అప్పుడు 'పవన్ కళ్యాణ్'.. ఇప్పుడు 'విజయ్ దేవరకొండ'
on Oct 21, 2021
టాలీవుడ్ కు విజయ్ దేవరకొండ రూపంలో మరో పవన్ కళ్యాణ్ దొరికాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. అప్పట్లో మూడు నాలుగు సినిమాలకే పవన్ కు ఎంత క్రేజ్ వచ్చిందో.. ఇప్పుడు విజయ్ కు అలాగే వచ్చిందని చెప్పారు. 'రౌడీ బాయ్స్' సినిమా రెండో సాంగ్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని 'ప్రేమే ఆకాశమైతే' అనే సాంగ్ ను తాజాగా విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజ్ మాట్లాడుతూ విజయ్ పై ప్రశంసలు కురిపించారు.
యూత్ ఫుల్ కథాంశంతో 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని తెరకెక్కించామని, కథకు అనుగుణంగానే ఈ చిత్రానికి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ పెట్టామని దిల్ రాజ్ అన్నారు. టైటిల్ ఓకే అనుకున్నాక.. విజయ్ పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తమ బ్యానర్ లో వచ్చిన 'కేరింత' సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒక రోల్ విజయ్ చేయాల్సి ఉందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన 'పెళ్లిచూపులు' సినిమాను తమ బ్యానర్ ద్వారా విడుదల చేయాలని విజయ్ ఎంతో ట్రై చేశాడని, కానీ ఆ సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల కుదరలేదని తెలిపారు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో విజయ్ స్టార్ గా మారాడు. 'గీతగోవిందం' సినిమా సక్సెస్ ఈవెంట్కి తాను వెళ్లానని, అక్కడ విజయ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అప్పట్లో అతి తక్కువ కాలంలో పవన్ కు యూత్ లో ఎంత క్రేజ్ వచ్చిందో.. ఇప్పుడు విజయ్ కు అంత క్రేజ్ వచ్చిందని.. తెలుగు ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ లా విజయ్ దొరికాడని అన్నారు. 'లైగర్'తో పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతున్న విజయ్ కి నా అభినందనలు అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.