56 ఏళ్ళ `దేవత`!
on Jul 24, 2021
నటరత్న నందమూరి తారక రామారావు - మహానటి సావిత్రిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరు జంటగా నటించిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఎన్టీఆర్, సావిత్రి జోడికి 1965 సంవత్సరం ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ క్యాలెండర్ ఇయర్ లో వీరిద్దరు మూడు సినిమాల్లో నటించగా అవన్నీ కూడా ప్రజాదరణ పొందాయి. ఆ చిత్రాలే.. `నాదీ ఆడజన్మే`, `పాండవ వనవాసం`, `దేవత`. వీటిలో మూడో సినిమా అయిన `దేవత`.. 1965లో ఇదే జూలై 24న జనం ముందుకొచ్చింది.
హాస్యనటుడు పద్మనాభం సమర్పణలో బి. పురుషోత్తం నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని కె. హేమాంబరధరరావు రూపొందించారు. ఇందులో సీత, లలితగా సావిత్రి చేసిన ద్విపాత్రాభినయం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఇక కథ విషయానికి వస్తే.. లెక్చరర్ ప్రసాద్, సీత అన్యోన్య దంపతులు. ఓ రైలు ప్రమాదంలో సీత చనిపోతుంది. అదే రూపంలో ఉండే లలిత.. ప్రసాద్ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దింది? ఇంతకీ ఆమె గతం ఏమిటి? అనేదే `దేవత` చిత్రం.
చిత్తూరు నాగయ్య, రేలంగి, రాజనాల, గీతాంజలి, బాలకృష్ణ, పుష్పలత, రాజబాబు, నగేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `దేవత`లో ఎస్వీ రంగారావు, గుమ్మడి, అంజలీ దేవి, జమున, షావుకారు జానకి, కృష్ణకుమారి అతిథి పాత్రల్లో మెరిశారు.
ఎస్పీ కోదండపాణి సంగీతమందించిన ఈ సినిమాలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``ఆలయాన వెలసిన``, `బొమ్మను చేసి`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``తొలి వలపే పదే పదే``, ``కన్నుల్లో మిసమిసలు``, ``మావూరు మదరాసు`` కూడా ఆకట్టుకుంటాయి. నేటితో ఈ కుటుంబ కథా చిత్రం.. 56 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read