అల్లు అరవింద్, దిల్ రాజును షూట్ చేయాలట!
on Jan 7, 2019
'పెదవి దాటని మాటకు ప్రభువు నీవు... పెదవి దాటిన మాటకు బానిస నీవు' అని ఓ సామెత. అందువల్ల... నలుగురిలో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, అశోక్ వల్లభనేని ముందూ వెనుక ఆలోచించినట్టు లేరు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట'ను అయన తెలుగులో విడుదల చేస్తున్నారు. పేరు సినిమా నిర్మాత అశోక్ వల్లభనేని అయినా... తెర వెనుక మొత్తం వ్యవహారాలన్నీ ప్రసన్నకుమార్ చూస్తున్నారని ఇండస్ట్రీ టాక్. 'పేట'కు థియేటర్లు ఇవ్వడం లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వీరావేశంతో ఊగిపోయారు. థియేటర్ల మాఫియా దారుణంగా వుందని, సొంత సినిమాలకు లైన్ క్లియర్ చేస్తూ.. మిగతా సినిమాలను తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అయిన అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ అధినేతలను చిత్రనిర్మాత అశోక్ వల్లభనేని కుక్కలతో పోల్చారు. అంతటితో ఆగకుండా వారిని షూట్ చేయాలని తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను... ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కోరారు. అశోక్ వల్లభనేని మాటలకు ప్రసన్నకుమార్ వత్తాసు పలికారు. ఎన్టీఆర్ బయోపిక్, 'పేట' సినిమాలు చరిత్ర సృష్టిస్తాయని చెప్పిన ప్రసన్నకుమార్... సంక్రాంతికి వచ్చే మిగతా హీరోలను, నిర్మాతలను పందులతో పోల్చారు. జనవరి 18 తరవాత ఎన్టీఆర్ బయోపిక్, పేట సినిమాలు మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు.