51 ఏళ్ళ `కళ్యాణ మంటపం`!
on Jun 25, 2022
టాలీవుడ్ `రీమేక్ స్పెషలిస్ట్స్`లో అగ్ర దర్శకుడు వి. మధుసూదన రావు ఒకరు. ఆయన తెరకెక్కించిన రీమేక్ మూవీస్ లో `కళ్యాణ మంటపం` (1971) ఒకటి. కన్నడ సినిమా `గజ్జె పూజె` (1969) ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు, అందాల తార కాంచన జంటగా నటించగా.. కథానాయిక చిన్నప్పటి పాత్రలో బేబి శ్రీదేవి ఆకట్టుకుంది. జగ్గయ్య, అంజలీదేవి, గుమ్మడి, రమాప్రభ, నాగభూషణం, పండరీబాయి, అన్నపూర్ణ, సంధ్యారాణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కథ విషయానికి వస్తే.. దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన చంద్రముఖి అనే ఓ అమాయకురాలి గాథే `కళ్యాణ మంటపం` చిత్రం.
పి. ఆదినారాయణరావు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ సాహిత్యమందించారు. ఇందులోని ``చుక్కలు పాడే శుభమంత్రం``, ``సరిగమపదనిస``, ``పలికే వారుంటే`` అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, `యువచిత్ర` సంస్థ అధినేత కె. మురారి సహాయక దర్శకులుగా పనిచేసిన `కళ్యాణ మంటపం`ని.. జెమిని సంస్థ సమర్పణలో మధు మూవీస్ పతాకంపై చిత్ర దర్శకుడు వి. మధుసూదనరావు స్వయంగా నిర్మించారు. 1971 జూన్ 25న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `కళ్యాణ మంటపం`.. నేటితో 51 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read