కీరవాణి తొలి చిత్రం `మనసు మమత`కి 32 ఏళ్ళు!
on Jun 29, 2022
తెలుగునాట అగ్ర శ్రేణి సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు స్వరవాణి కీరవాణి. పరభాషల్లోనూ తన సరిగమలతో పరవశింపజేసిన కీరవాణికి జూన్ 29 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. 1990లో ఇదే తేదిన ఆయన తొలిసారిగా బాణీలు అందించిన `మనసు - మమత` చిత్రం తెరపైకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మౌళి దర్శకత్వం వహించారు. నరేశ్, సితార జంటగా నటించిన ఈ సినిమాలో రావు గోపాల రావు, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి, మాస్టర్ తరుణ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. డీవీ నరసరాజు ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు.
దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించిన ఈ చిత్రంలో ``ఏం కోపం చాలించు`` (ఎస్పీ బాలు, చిత్ర గానం), ``మధుమాసం`` (ఎస్పీ బాలు, చిత్ర గానం) అంటూ సాగే పాటలు రంజింపజేశాయి. 1990 జూన్ 29న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `మనసు మమత`.. నేటితో 32 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. ఇవాళ్టితో కీరవాణి స్వర ప్రస్థానానికి 32 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.