24 ఏళ్ళ `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`!
on Jun 25, 2022
మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. అలాంటి వైవీఎస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో వెంకట్, చాందిని హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. చంద్రమోహన్, మురళీ మోహన్, ఆహుతి ప్రసాద్, చలపతి రావు, బెనర్జీ, చందు, శివాజీ, కమల్, వెన్నిరాడై నిర్మల, రమాప్రభ, కల్పన, ప్రియ, కృష్ణ శ్రీ, బేబి నిహారిక ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వైవీఎస్ చౌదరి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలు కట్టిన `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`కి దిగ్గజ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ``ఓ ప్రేమా``, ``ఓం అని``, ``ఏవమ్మా వైనమేమమ్మా``, ``ఏవమ్మ కంప్యూటరమ్మా``, ``హాయిరబ్బా``, ``నీ ఊహల్లో`` తదితర పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించిన `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`.. 1998 జూన్ 26న విడుదలై మంచి విజయం సాధించింది. ఆదివారంతో ఈ మ్యూజికల్ హిట్ 24 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.