
- అతనితో పెళ్ళి, నలుగురు పిల్లలు
- వైరల్ గా మారిన త్రిష ఇన్స్టాగ్రామ్ స్టోరీ
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ త్రిష(Trisha) వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఆమె సినిమాలకు గుడ్బై చెప్పబోతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై త్రిష తనదైన శైలిలో స్పందించింది.
తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెడుతూ తాజాగా త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. "నేను సినిమాలకు గుడ్బై చెప్పేశానట, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నానట.. అంతేకాదు, నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను కూడా పెంచుతున్నానట. ఇంకేమైనా జోడించాలా? లేక ఈ రోజుకి మన ‘ఫిక్షన్ కోటా’ పూర్తయిందా?" అంటూ సెటైరికల్ గా స్పందించింది. త్రిష చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వార్తలు రావడం సహజం, కానీ త్రిష విషయంలో అవి కాస్త శ్రుతి మించాయని ఆమె స్పందన చూస్తే అర్థమవుతోంది. ఈ ఒక్క పోస్ట్తో తన రిటైర్మెంట్, పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష క్లారిటీ ఇచ్చేసింది.

కాగా, ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ను త్రిష ప్రేమ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైందని, పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశముందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందని న్యూస్ చక్కర్లు కొట్టింది. ప్రముఖ నటుడు చిత్రా లక్ష్మణన్ సైతం ఒక ఇంటర్వ్యూలో.. ఇక త్రిష సినిమాల్లో నటించదని చెప్పాడు. దీంతో త్రిష పెళ్ళి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే తనదైన శైలిలో సెటైరికల్ పోస్ట్ పెట్టి.. రూమర్స్ కి చెక్ పెట్టింది త్రిష.
ప్రస్తుతం త్రిష కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ లో 'కరుప్పు', మలయాళంలో 'రామ్' సినిమాలు చేస్తోంది.




