
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్గా తనదైన ముద్ర వేసిన జానీ మాస్టర్(Jani Master)కు సంబంధించి గత కొన్ని ఏళ్లుగా కోర్టులో కొనసాగుతున్న ఒక వివాదానికి తెరపడింది. అసోసియేషన్ వ్యవహారాలకు సంబంధించి 2014లో నమోదైన ఒక కేసులో మేడ్చల్ కోర్టు ఈరోజు (మే 11) కీలక తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అసోసియేషన్ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ కేసు విచారణలో ఉంది. 2014లో మొదలైన ఈ న్యాయ వివాదం అనేక వాయిదాల తర్వాత నేటితో ఒక ముగింపుకు వచ్చింది. ఇన్నేళ్ల పాటు సంయమనం కోల్పోకుండా, చట్టంపై గౌరవంతో జానీ మాస్టర్, ఇతర సభ్యులు ఈ పోరాటాన్ని కొనసాగించి విజయాన్ని సాధించారు.
కేసు కొట్టివేతపై స్పందిస్తూ, "న్యాయం గెలవడానికి సమయం పట్టవచ్చు, కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది" అన్న మాట మరోసారి నిరూపితమైందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఇన్ని ఏళ్లుగా ఎన్నో మానసిక ఇబ్బందులను, ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, అసోసియేషన్ శ్రేయస్సు కోసం ఓర్పుతో నిలబడ్డారు. జానీ మాస్టర్తో పాటు ఈ కేసులో అసోసియేషన్ కోసం పోరాడిన వారిలో రమేష్ మాస్టర్, వేణు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, ధన్ శ్యామ్ మాస్టర్, ఎస్.వి. రాముడు ఉన్నారు.
సుదీర్ఘ కాలంగా సాగిన ఈ పోరాటంలో సత్యమే జయించడంతో కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం వమ్ము కాలేదని వారు తెలియజేశారు.





