
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, రచయితగా తనికెళ్ల భరణి(Tanikella Bharani)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆధ్యాత్మికతపై అపారమైన గౌరవం ఉన్న ఆయన, తాజాగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మోడీని కలవడంతో తన జన్మ ధన్యమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ భరణి రాసిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. పురాణ పురుషులను, ఆధ్యాత్మిక గురువులను మనం నేరుగా చూడలేమని, కానీ వారి అంశలను మోడీలో చూశానని ఆయన తెలిపారు.
"నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం." అంటూ తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తనికెళ్ల భరణికి మొదటి నుంచీ శివభక్తి ఎక్కువ. మోదీ కూడా ఆధ్యాత్మికతను, భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే వ్యక్తి కావడంతో, ఆయన పట్ల భరణి గారికి ఉన్న గౌరవం ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒక గొప్ప నటుడు, దేశ నాయకుడి పట్ల చూపిన గౌరవం అద్భుతం" అని కొందరు అంటుంటే, మరికొందరు భరణి ఆధ్యాత్మిక కోణాన్ని ప్రశంసిస్తున్నారు.







