
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులలో ఒకటి 'పెద్ది'(Peddi). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
చివరి నిమిషంలో తప్పుకున్న మృణాల్?
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ముందుగా క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్, ఈ స్పెషల్ సాంగ్లో నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణ వస్తుందని మేకర్స్ భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల మృణాల్ ఈ ప్రాజెక్ట్ నుండి చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఎంట్రీ ఇస్తున్న మిస్ ఇండియా!
'పెద్ది' స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ప్లేస్లో మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి(Manasa Varanasi) పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ అందాల భామ, గ్లోబల్ వేదికలపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా 'దేవకీ నందన వాసుదేవ', 'కపుల్ ఫ్రెండ్లీ' వంటి సినిమాల్లో నటించింది.

మానస వారణాసి అయితే ఈ సాంగ్కు కొత్తదనం వస్తుందని, పైగా మెగా పవర్స్టార్ పక్కన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మానస వారణాసి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ మాస్ డ్యాన్స్కు తోడు మిస్ ఇండియా గ్లామర్ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే, మానస వారణాసికి టాలీవుడ్లో ఇది టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశముంది.
‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తవగా, ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.






