'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు హీరో సిద్ధార్థ్. అయితే కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్.. త్వరలో విడుదల కానున్న 'మహాసముద్రం' మూవీతో ఆ లోటుని భర్తీ చేయాలి అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే లండన్ లో సిద్ధార్థ్ కి ఆపరేషన్ జరుగుతోందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం మూవీ టీమ్ ట్రైలర్ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధార్థ్ హాజరు కాలేదు. అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియాలో లేరని.. లండన్ లో ఆయనకి ఒక చిన్న ఆపరేషన్ జరుగుతోందని డైరెక్టర్ చెప్పారు. దీంతో సిద్ధార్థ్ కి ఏమైంది? ఆపరేషన్ ఎందుకు? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడాల్సింది ఏం లేదని.. అది చిన్న సర్జరీ అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇక 'మహా సముద్రం' విషయానికొస్తే.. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి అంచనాలకు తగ్గట్లు సినిమా అలరిస్తుందేమో చూడాలి.