
కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్లోనూ క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన గాసిప్స్ ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతుంటాయి. తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), బ్లాక్బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతోందనే వార్త నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది.
కోలీవుడ్ మీడియా ఈ ఇద్దరి కలయికపై రకరకాల ఆసక్తికరమైన కథనాలను ప్రచురిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెరవెనుక ఒక సాలిడ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) చిత్రాన్ని సితార సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య 50వ చిత్రం కోసం ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయడానికి ప్రొడ్యూసర్ నాగవంశీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ ఇదివరకే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని కూడా గతంలో నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇదే బ్యానర్ లో నెల్సన్ డైరెక్ట్ చేయబోయే సినిమా కోసం సూర్య రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తో అనుకున్న కథలోకి సూర్య వస్తున్నాడా లేక ఇది వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల 'కరుప్పు' (Karuppu) సినిమాతో భారీ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సూర్య, ప్రస్తుతం ఒక ఇంటెన్స్ సినిమా తర్వాత పూర్తిస్థాయి లైట్-హార్టెడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నారట. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ సూర్య బాడీ లాంగ్వేజ్కు పక్కాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ను కుదర్చడానికి నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని, నెల్సన్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హీరో సూర్య ప్రస్తుతం 'ఆవేశం' చిత్ర దర్శకుడు జితు మాధవన్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ఆయన '5 రూపీ డాక్టర్' (5 Rupee Doctor) బ్యాక్డ్రాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న జ్ఞానవేల్ చిత్రంలో జాయిన్ కావలసి ఉంది. ఆ ఇంటెన్స్ స్టోరీ పూర్తయిన తర్వాతే నెల్సన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
మరోవైపు దర్శకుడు నెల్సన్ కూడా తన తదుపరి కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో 'జైలర్ 2' (Jailer 2) చిత్రంతో పాటు, రజనీ-కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను కూడా ఆయన లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన 'డ్రాగన్' (Dragon) సినిమాను పూర్తి చేయడంతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ లోగా నెల్సన్ డేట్స్ ని వాడుకుంటూ, సూర్యతో 50వ సినిమాను సితార ప్రొడక్షన్స్ బ్యానర్లో పట్టాలెక్కించడానికి నాగవంశీ స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ గనుక అధికారికంగా అనౌన్స్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.





