రమేశ్బాబు, జుహీ చావ్లా జంటగా నటించారని మీకు తెలుసా?
on Jan 9, 2022
అవును. రమేశ్బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా.. సూపర్స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన 'కలియుగ కర్ణుడు'. 1988లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ సరసన జయప్రద, రమేశ్ సరసన జుహీ చావ్లా హీరోయిన్లుగా నటించారు. అయితే ఆమె అసలు పేరుతో కాకుండా 'మీనా' పేరుతో ఈ మూవీలో నటించింది. పేరులో తెలుగుతనం ఉండాలనే ఉద్దేశంతో ఆమె పేరును మీనాగా మార్చారు కృష్ణ. అయితే ఆ తర్వాత ఆమె తన అసలు పేరుతోనే 'విక్కీ దాదా', 'శాంతి క్రాంతి' లాంటి సినిమాల్లో చేసింది.
కృష్ణ, రమేశ్బాబు హీరోలుగా నటించిన తొలి సినిమా 'కలియుగ కర్ణుడు'. ఇందులో ఆ ఇద్దరూ అన్నదమ్ములుగా నటించారు. టైటిల్ రోల్ను కృష్ణ పోషించగా, న్యాయం కోసం పోరాడే ఆయన తమ్మునిగా రమేశ్ నటించారు.
Also read: నాగార్జున 'రెండు నాల్కల' తీరుపై సోషల్ మీడియాలో 'రగడ'!
'కలియుగ కర్ణుడు' కంటే ముందు కన్నడ సినిమా 'ప్రేమలోక'లో హీరోయిన్గా నటించింది జుహీ. ఆ సినిమా తెలుగులో 'ప్రేమలోకం' పేరుతో విడుదలై బాగా ఆడింది. అందులో జుహీని చూసి, రమేశ్ సరసన చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారు కృష్ణ. 'కలియుగ కర్ణుడు' చిత్రీకరణ జరుగుతున్నప్పుడే ఆమిర్ ఖాన్, జుహీ చావ్లా జంటగా నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' విడుదలై బ్లాక్బస్టర్ హిట్టయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాని బాగా ఆదరించడంతో, జుహీకి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అది 'కలియుగ కర్ణుడు' సినిమాకు ప్లస్సయింది.
Also read: 'అఖండ'లో మెయిన్ విలన్ రియల్ లైఫ్లో మాజీ ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా?
కశ్మీరులో 12 రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ జరిగింది. ఆ సందర్భంగా రమేశ్, జుహీపై రెండు పాటలను, కొన్ని సన్నివేశాలను కృష్ణ చిత్రీకరించారు. డాల్ లేక్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్టోబర్ 13న రమేశ్బాబు బర్త్డే అని తెలుసుకున్న నిర్మాత కాశీవిశ్వనాథరావు అప్పటికప్పుడు కేక్ తెప్పించి, బోట్లోనే దాన్ని కట్ చేయించారు. తన పుట్టినరోజు సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ స్వెట్టర్లు, బూట్లు, డాన్సర్లకు చీరకు బహూకరించి తండ్రికి తగ్గ తనయునిగా ఉదార స్వభావాన్ని చాటుకున్నారు రమేశ్బాబు. తెరపై రమేశ్, జుహీ జోడీ ఆడియెన్స్ను అలరించింది.
Also Read