ENGLISH | TELUGU  

కృష్ణ 'మాయదారి మ‌ల్లిగాడు' మూవీతో స‌త్యానంద్ ఎలా రైట‌ర్ అయ్యారో తెలుసా?

on Dec 13, 2021

 

ప‌ద‌మూడ‌వ ఏటే స‌త్యానంద్ క‌థార‌చ‌యిత అయ్యారు. ఆ వ‌య‌సులో ఆయ‌న రాసిన క‌థ ఆంధ్ర‌ప్ర‌భ వీక్లీలో అచ్చయింది. ఆయ‌న పుట్టిందీ, పెరిగిందీ రాజ‌మండ్రిలోనే. మ‌ద్రాస్ వెళ్లిన తొలినాళ్ల‌వ‌ర‌కూ ప‌త్రిక‌ల‌కు క‌థ‌లు రాస్తూ వ‌చ్చారు. "నేను 21వ ఏట సినీ రచయితనయ్యాను. దానికంటే ముందు ఆర్థిక అవసరాల కోసం ఒక పది దాకా డిటెక్టివ్ నవలలు కూడా రాశాను. ఆ తర్వాత విజయ బాపినీడు గారి విజయ మేగజైన్‌కు కొన్ని రాశాను. ఆ కలెక్షన్ నా దగ్గర లేదు. దాచుకొనే అలవాటు లేదు. ఏదో ఒక డిటెక్టివ్ నవల ఉండాలి. అప్పట్లో డిటెక్టివ్ అనే మేగజైన్ వచ్చేది. దానికి జీవీజీ గారు ఎడిటర్. అందులో ఒక డిటెక్టివ్ సీరియల్ రాశాను. అదివరకే ఆయన నా కథలు చదివి ఉన్నారు. మొదటిసారి కలుసుకున్నప్పుడు నన్నుచూసి ఆశ్చర్యపోయి, మీరింత చిన్నవారు అనుకోలేదు, సత్యానంద్ అనే ఆయన చాలా పెద్దవారేమోననుకున్నానని ఆయన అన్నారు." అని చెప్పారు స‌త్యానంద్‌.

సినిమాల్లోకి వెళ్లాలనేది ఆయ‌న‌ కోరిక. "అప్ప‌టి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావుగారు మా మావయ్య. ఆయ‌న‌ మొదట నన్ను ఎంకరేజ్ చెయ్యలేదు. ఆ కష్టాల్లోకి నన్ను దింపడమెందుకని ఆయన వద్దన్నారు. దాంతో ఒక రూంలో ఇంకో ముగ్గురితో పాటు ఉంటూ, డిటెక్టివ్ పుస్తకాలు రాసుకుంటూ ఏడాది పాటు గడిపేశాను. ఒక నవలకు 300 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత సుబ్బారావుగారు నా గురించీ ఎంక్వైరీచేసి, నేను మద్రాసులోనే ఉన్నానని తెలుసుకున్నారు." అని ఆయ‌న తెలిపారు.

Also read:  ఫొటో స్టోరీ: చంద్ర‌మోహ‌న్ డైలీ ప్రోగ్రాంను బ్లాక్ బోర్డు మీద రాస్తున్న కుమార్తె!

అప్పటి దాకా సుబ్బారావు గారి బ్రదర్స్ కూడా అంతత మాత్రంగానే ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. "కొత్తగా మళ్లీ ఇంకొకడు ఇబ్బందులు పడటమెందుకని ఆయన నన్ను ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే నేను ఊరికి వెళ్లకుండా అక్కడే ఉన్నానని తెలిసి, 'ఒక పాయింట్ చెబుతాను. దాని డెవలప్ చేసి తీసుకురా. నువ్వెలా చేస్తావో చూస్తాను' అన్నారు. ఆ పాయింట్‌ను బేస్ చేసుకొని నేనొక 200 పేజీల నవల కిందే రాసేశాను. అదే 'మాయదారి మల్లిగాడు' సినిమా. అది చదివి ఆయన 'ఇది బాగానే ఉంది. అయితే దీని స్క్రీన్‌ప్లే రూపంలో రాయాలి' అని నవలా రూపంలో ఉన్నదాన్ని ఎలా స్క్రీన్‌ప్లే చెయ్యాలో ఆయనే చెప్పారు. అప్పుడు మళ్లీ దాన్ని స్క్రీన్‌ప్లే ఆర్డర్‌లో రాశాను." అని చెప్పారు స‌త్యానంద్‌.

Also read:  'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా?

అప్పుడు ఆదుర్తి మళ్లీ 'నేనింకా డైలాగ్ రైటర్‌ని ఎవర్నీ అనుకోలేదు. ఎల్లుండి షూటింగ్. నువ్వు స్క్రీన్‌ప్లే రాశావు కాబట్టి, ఈ రెండు సీన్లకూ డైలాగ్స్ రాసి తీసుకురా, చూద్దాం' అన్నారు. "రాసి తీసుకెళ్లి చూపిస్తే, చూసి బాగున్నాయన్నారు. దాంతో పాటు ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేరమన్నారు. సెట్స్ మీద డైలాగ్స్ విషయంలో ఏవైనా డౌట్స్ వస్తే చెప్పడానికి నేనుండాలని ఆయన అనుకున్నారు. అలా 'మాయదారి మల్లిగాడు' మూవీకి రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. కృష్ణగారికి ఆయన డైలాగ్స్ చెప్పారు. నన్ను పరిచయం చేశారు. ఆయన ఓపెన్‌గా డైలాగ్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ఆ సినిమా రిలీజయ్యేనాటికి నాకు 22 ఏళ్లు." అని స‌త్యానంద్ వివ‌రించారు.

Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి!

కృష్ణగారు తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ 'కొత్త కుర్రాడు బాగా రాస్తున్నాడయ్యా.. మన సుబ్బారావుగారి మేనల్లుడంట' అని చెప్పడం మొదలుపెట్టారు. "ఎవరిలోనైనా చిన్న గొప్పదనం కనిపిస్తే పదిమందినీ కూర్చోబెట్టి చెప్పే గొప్ప గుణం ఆయనలో ఉంది. 'మాయదారి మల్లిగాడు' రిలీజై మంచి హిట్టయింది. ఆ వెంటనే తాతినేని రామారావుగారు, పూర్ణచంద్రరావు గారు పిలిచి తమ సినిమాకు అవకాశమిచ్చారు. అలాగే క్రాంతికుమార్ గారిదొక సినిమా, వీబీ రాజేంద్రప్రసాద్ గారి సినిమా.. ఈ మూడూ వెంటనే వచ్చాయి. వాటిలో రెండింటిలో శోభన్‌బాబు హీరో అయితే, ఒకటి శారద గారు లీడ్ రోల్ చేసిన 'ఊర్వశి' అనే సినిమా. శోభన్‌బాబు గారితో వరుసగా ఆరేడు సినిమాలు చేశానప్పుడు. నిర్మాతలు, దర్శకులకు ఆయన నన్ను రికమెండ్ చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, శోభన్‌బాబు ఇద్దరూ నన్ను ఆదరించారు, ఎఫక్షనేట్‌గా చూసేవారు. అని చెప్పుకొచ్చారు స‌త్యానంద్‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.