ప్రేమకు వయసుతో కానీ, సమాజం పెట్టే హద్దులతో కానీ ఎలాంటి సంబంధం లేదని నిరూపించింది బాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని ములే. 'లగాన్', 'జోధా అక్బర్', 'దిల్ చాహతా హై' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ఈ జాతీయ అవార్డు గ్రహీత.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆమె 60 ఏళ్ల వయసులో ఒక ప్రముఖ శాస్త్రవేత్తను ప్రేమించి పెళ్లాడిన అరుదైన రిలేషన్షిప్ జర్నీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న సుహాసిని ములే మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు తాను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. సమాజం కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. తన ఆలోచనలకు, ఆత్మగౌరవానికి విలువనిచ్చే సరైన భాగస్వామి దొరకనందునే తాను అంత కాలం ఒంటరిగానే ఉండిపోయానని స్పష్టం చేశారు. బంధాలలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె సరైన సమయం కోసం వేచి చూశారు.
ఈ క్రమంలోనే వృత్తిపరమైన అవసరాల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లోకి ఎంట్రీ ఇచ్చారు సుహాసిని. అక్కడ స్విట్జర్లాండ్లోని ప్రముఖ 'సెర్న్' ల్యాబ్లో పనిచేసిన వరల్డ్ క్లాస్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ (అణు భౌతిక శాస్త్రవేత్త) అతుల్ గుర్తూ ప్రొఫైల్ ఆమెను ఎంతగానో ఆకర్షించింది. అలా ఫేస్బుక్లో మొదలైన వీరి పరిచయం కొద్ది రోజుల్లోనే చాటింగ్గా మారి.. ఆపై బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది.
కేవలం 75 రోజుల పరిచయంతోనే ఈ జంట ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అనంతరం 2011 జనవరి 16న ఆర్య సమాజ్ ఆలయంలో అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో సుహాసిని తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయానికి ఆమె తల్లి, ప్రముఖ మహిళా దర్శకురాలు విజయ ములే పూర్తి మద్దతునివ్వడం విశేషం. సమాజం మొదట్లో ఆశ్చర్యపోయినా, ఆమె మాత్రం తన అంతరాత్మ ప్రబోధాన్నే నమ్మారు.
ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న సుహాసిని, అతుల్ గుర్తూల వైవాహిక బంధం విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సీనియర్ నటి పంచుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సమాజ నియమాలను బద్దలు కొట్టి, తమకు నచ్చినట్లు జీవిస్తున్న ఈ క్యూట్ కపుల్పై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.




