English | Telugu
'కార్తీకదీపం' రేటింగ్స్ తగ్గుతున్నాయ్! ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్!!
Updated : Jul 3, 2021
బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ అత్యధిక టీఆర్పీతో మిగతా సీరియల్స్కు అందనంత ఎత్తులో దూసుకుపోతూ వస్తున్న విషయం తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా టాప్ రేటింగ్ తో మొదటి స్థానంలో ఉన్న ఈ సీరియల్ కు అసలు ఏదురనేది లేకుండా పోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ రేటింగ్స్ తగ్గుతుండటం గమనార్హం. మోనిత ప్రెగ్నెంట్ అనే ట్విస్ట్ తో 21.01 టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది 'కార్తీకదీపం'. అయితే ఈ ట్విస్ట్ తరువాత సీరియల్లో పస తగ్గిందనే అభిప్రాయం వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. దీంతో రేటింగ్స్ తగ్గుతూ వస్తున్నాయి.
జూన్ నెల 5 నుండి 11 వరకు చూసుకుంటే ఈ సీరియల్ 19.10 రేటింగ్ సంపాదించింది. జూన్ 12-18 మధ్య 18.86 రేటింగ్, ఆ తర్వాత జూన్ 19-25 మధ్య 18.25 రేటింగ్ సాధించింది. ఇది చూస్తే గనుక వారం, వారానికి రేటింగ్ తగ్గుతూ వస్తోంది. టీఆర్పీ తగ్గుతున్నప్పటికీ.. ఫస్ట్ ప్లేస్ మాత్రం 'కార్తీకదీపం' సీరియల్దే.
ప్రస్తుతం 'కార్తీకదీపం' సీరియల్ 18.24 రేటింగ్తో తొలిస్థానంలో ఉండగా.. 'గృహలక్ష్మి' 12. 92 రేటింగ్తో రెండో స్థానంలో ఉంది. కొత్త సీరియల్ 'గుప్పెడంత మనసు' 11.89 రేటింగ్తో అనూహ్యంగా మూడో స్థానంలో నిలవగా.. 'జానకి కలగనలేదు' 9.35 రేటింగ్తో నాలుగో స్థానంలో ఉంది. 'దేవత' సీరియల్ 8.79 రేటింగ్ తో ఐదో స్థానంలో నిలిచింది.
డాక్టర్ బాబు, దీప కలుసుకోబోతున్నారని ప్రేక్షకులు సంతోష పడుతున్నంతలో మోనిత ప్రెగ్నెంట్ కావడం, దానికి కారణం డాక్టర్ బాబేనని ఆమె చెప్పడంతో మొదట ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తింది. కానీ క్రమంగా సీరియల్ను సాగదీయడంలో భాగంగానే ఇలా చేస్తున్నారనే అభిప్రాయం వీక్షకులకు కలుగుతోంది. దాంతో ఈ సీరియల్ను రెగ్యులర్గా చూసే పలువురు ప్రేక్షకులు కూడా ఆ సీరియల్పై విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీప పాత్ర చిత్రణ కూడా ఆకట్టుకొనే రీతిలో ఉండటం లేదని వారంటున్నారు.