కోహ్లీని తొలగించడమా.. సిగ్గు సిగ్గు! బీసీసీఐని టార్గెట్ చేసిన ఫ్యాన్స్..
Publish Date:Dec 8, 2021
Advertisement
భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతోంది. బీసీసీఐ, దాని చీఫ్ గంగూలీని ట్రోల్ చేస్తూ అభిమానులు ట్విట్టర్లో విరుచుకుపడుతున్నారు. బీసీసీఐపై గౌరవం పోయిందని, ఇప్పుడు ఇసుమంత గౌరవం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని నిప్పులు చెరుగుతున్నారు.ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ, జై షా, గంగూలీలు సిగ్గుపడాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కోహ్లీని ఎందుకు తొలగించారు.. 95 మ్యాచుల్లో 65 విజయాలు అందించినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా అయితే, ధోనీ గంగూలీ సారథ్యంలోని జట్లు ప్రపంచకప్లలో ఓడిపోలేదా? క్రీడల్లో కూడా రాజకీయాలు ప్రవేశించాయా?.. ఏది ఏమైనా ఇది మంచి సంకేతం కాదు’’ అంటూ గంగూలీ, బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు కోహ్లీ అభిమానులు. టీ20 కెప్టెన్గా కోహ్లీ తప్పుకున్నప్పుడే వన్డే కెప్టెన్సీ గురించి ఎందుకు ఆలోచించలేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కెప్టెన్ మార్పుపై మీడియా సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని, అకస్మాత్తుగా ఈ తొలగింపు ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు. చూస్తుంటే గంగూలీ, జై షా శకం గాడితప్పినట్టుగా ఉందని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు కోహ్లీ తొలగింపును ఐసీసీ సహా మాజీ క్రికెటర్లు స్వాగతించారు. భారత వన్డే క్రికెట్లో ఇది నూతన శకమని ఐసీసీ అభివర్ణించింది. ఇది చాలా మంచి నిర్ణయమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అన్నాడు. వైట్బాల్ క్రికెట్లో ‘మెన్ ఇన్ బ్లూ’ను నడిపించేందుకు నంబర్ 45 సిద్ధమని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పేర్కొంది. కోహ్లీ, రోహిత్లతో కూడిన జట్లను ద్రావిడ్ ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందేనని క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే అన్నాడు. రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించడం వల్ల డ్రెస్సింగ్ రూములో మార్పులు తప్పవని, రోహిత్, కోహ్లీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో ద్రావిడ్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకుడు అయాజ్ మీనన్ అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా అంతగా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీ నుంచి వన్డే జట్టు పగ్గాలు లాక్కుని రోహిత్ శర్మకు అందించారు. అయితే టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగిస్తున్నారు. అలాగే టెస్టుల్లో రహానే బదులుగా రోహిత్కు వైఎస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కాగా రోహిత్కు ఇప్పటికే టీ20 పగ్గాలు కూడా అప్పగించడంతో ఇక కోహ్లీ ఒక్క టెస్టులకు మాత్రమే సారథ్యం వహిస్తాడు.
http://www.teluguone.com/news/content/virat-kohli-fans-target-bcca-and-sourab-ganguly-over-captain-change-39-127990.html