వచ్చే ఎన్నికల్లో కారు గల్లంతేనా? టీఆర్ఎస్ మూడోస్థానానికే పరిమితమా?
Publish Date:Aug 21, 2021
Advertisement
ఇండియా టుడే సర్వేలో సీఎం కేసీఆర్ ర్యాంక్ ఎంత? టక్కున చెప్పలేని పరిస్థితి. ఎక్కడో చివరాఖరికి పడిపోయింది కేసీఆర్ పరపతి. అది జాతీయ సర్వే అనుకున్నా.. తాజాగా లోకల్ సంస్థ లోకల్ యాప్ సైతం ఓ సర్వే చేపట్టింది. అందులో మరింత షాకింగ్ రిజల్ట్స్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడం పక్కనపెడితే.. కనీసం సెకండ్ ప్లేస్లో కూడా లేరట. ఏకంగా మూడోస్థానానికి పరిమితమయిందట గులాబీ పార్టీ. మరి, ఫస్ట్.. సెకండ్ ఎవరనేగా మీ క్వశ్చన్. ఇంకెవరు.. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్దే విజయమని తేల్చింది లోకల్ యాప్ సర్వే. అనూహ్యంగా బీజేపీ సెకండ్ ప్లేస్లో నిలిచింది. ముచ్చట్లు మాత్రమే చెప్పే కేసీఆర్.. ముచ్చటగా మూడో స్థానంలో వెనకబడింది కారు పార్టీ. లోకల్ యాప్ లేటెస్ట్ సర్వే.. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లోకల్ యాప్ నిర్వహించిన సర్వేలో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు 40 శాతం మంది ఓటేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని 34 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇక అధికార టీఆర్ఎస్కు కేవలం 26 శాతం మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇదే ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. కారు పార్టీకి మూడో స్థానం రావడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. కొంతకాలంగా కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అప్పుడూ అదే కేసీఆర్.. ఇప్పుడూ అదే కేసీఆర్.. అప్పుడూ అవే పథకాలు.. ఇప్పుడూ అవే పథకాలు.. అప్పుడూ వాళ్లే ఎమ్మెల్యేలు ఇప్పుడూ వాళ్లే మంత్రులు.. కేసీఆర్లో కానీ, ప్రభుత్వంలో కానీ, కేబినెట్లో కానీ.. ఎలాంటి మార్పు లేదు.. కానీ, జనం మారిపోయారు.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చెప్పిందే చెప్పి.. ఇచ్చిన హామీలే ఇచ్చి.. జనాలను ఎంతో కాలం మభ్యపెట్టలేరు. కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతీసారీ ఓట్లు పడవు. జనం ఇంకా ఏదో కోరుకుంటున్నారు. తమ గోడు వినే నాయకుడికి కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్లా, సిద్ధిపేటలకే కాదు.. తమకూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని నిలదీస్తున్నారు. కొత్త పింఛన్లు, కొత్త రేషన్కార్డుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలా జనం కోరికలు వేరు.. కేసీఆర్ ఆశ చూపిస్తున్నది వేరు.. దళిత బంధుతో కుటుంబానికి 10 లక్షలు పంచుతున్నా.. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల గాయం ఇంకా మాననేలేదు. దళితబంధును చూసి.. గిరిజర, బీసీ, మైనార్టీ బంధుల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం కేసీఆర్పై ఆక్రోషంగా మారుతోంది. అందుకే, పులిమీద స్వారీ చేస్తూ.. ఆ పులికే బలయ్యేలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి. ఇన్నాళ్లూ కేసీఆర్కు సరైన అల్టర్నేట్ లేకుండే. ఇప్పుడలా కాదు.. రేవంత్రెడ్డి రూపంలో జనానికో సమర్థుడైన నాయకుడు దొరికాడు. ప్రజల్లో రేవంత్ క్రేజ్ ఎలా ఉందంటే.. భారీ వర్షంలోనూ కదలకుండా రేవంత్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేంత అభిమానం ఆయనపై. అందుకే, రేవంత్ సభ పెడితే.. లక్షకు తగ్గట్లేదు జనం. కాంగ్రెస్లో మునపటి ఉత్తేజం.. కేడర్లో రెట్టించిన ఉత్సాహం.. లోకల్ సర్వేలోనూ అదే స్పష్టమైంది. కాంగ్రెస్కే విజయావకాశాలని తేల్చేసింది. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ. టీఆర్ఎస్ మాత్రం వద్దే వద్దు. అన్నట్టు ఉంది పరిస్థితి. బండి సంజయ్ నాయకత్వంలో కమలదళం దూసుకుపోతోంది. కిషన్రెడ్డి కేంద్రమంత్రి అయ్యాక కేడర్లో జోష్ పెరిగింది. దుబ్బాక, జీహెచ్ఎమ్సీలో కమల ప్రభంజనం కనిపించింది. ఈటల రాజేందర్ చేరికతో ఉరిమే ఉత్సాహం నెలకొంది. ఇలా కేసీఆర్కు అల్టర్నేట్గా కాంగ్రెస్నో, బీజేపీనో ఎంచుకుంటున్నారు ప్రజలు. అంతేగానీ, గులాబీ పాలన తమకు వద్దంటూ సర్వేల్లో తేల్చిచెబుతున్నారు. అందుకే, లోకల్ యాప్ సర్వేలో కారు పార్టీ ఏకంగా మూడోస్థానానికి పడిపోవడం ప్రగతి భవన్లో ప్రకంపణలు సృష్టిస్తోంది.
http://www.teluguone.com/news/content/trs-in-third-place-in-local-survey-25-121820.html