బాబు లేఖాస్త్రం.. సోనూ సాయం.. బుక్కైన వైసీపీ నేత.. రేవంత్ గర్జన.. టాప్ న్యూస్@1PM
Publish Date:Nov 28, 2021
Advertisement
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనా మేరకు రూ.6,054 కోట్ల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికి కేవలం రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేయడం సరికాదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టిందని బాబు చెప్పారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు.
---
నెల్లూరు వరద ప్రభావిత ప్రజలకు సాయం చేస్తూ సినీ నటుడు సొనూసూద్ మరోసారి ఉదారతను చాటుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నారు. బాధితులకు బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు వంటి నిత్యవసరాలతో కూడిన కిట్లను పంపారు.
-----
గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్యే ఆర్కే. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆర్కే ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 2
------
తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేస్తుంటే కేసులు నమోదుచేసి వేధిస్తున్నారని ఆరోపించారు. భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సీపట్నంలో జరిగిన ఆందోళనలో తాను పాల్గొంటే పోలీసులు తనపట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు
-------
తెలంగాణ కాంగ్రెస్ ఇందిరాపార్క్ దగ్గర చేపట్టిన దీక్ష రెండోరోజు ఆదివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వర్షా కాలం ధాన్యం కొనకుండా.. యాసంగి పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రైతులు రాళ్లతో కొడతారన్నారు. ధైర్యముంటే సీఎం కేసీఆర్, హరీష్రావు, బండి సంజయ్, కిషన్రెడ్డి కల్లాల దగ్గరకు రావాలన్నారు.
--------
చిత్తూరు జిల్లాలో వరుస భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. పలమనేరు మండలం, కరడిమడుగులో అర్ధరాత్రి భారీ శబ్దంతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్డుపై బిక్కు బిక్కుమంటూ గడిపారు. అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు
-----
భారీగా అక్రమ మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడ్డాడు. కృష్ణా జిల్లా అనంతవరం చెక్పోస్ట్ దగ్గర డీటీఎఫ్ అధికారులు 480 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీ, అధికారుల అండదండలతో వైసీపీ నేత కోడె శ్రీను.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. కోడె శ్రీను అక్రమ రవాణాకు అనంతవరం చెక్పోస్ట్ సిబ్బంది సైతం సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది.
---
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నమైంది. కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాల ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్నారు.
---
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద కారు బీభత్సం సృష్టించింది . అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది .దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది . అందులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . కారులో ఉన్న యువకులను బయటకుతీసి .. యశోద దవాఖానకు తరలించారు.
---
దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేసి అమలు చేస్తున్నారు. అలాగే, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/top-news-39-127280.html