భూముల విక్రయానికి తెలంగాణ సర్కార్ రెడీ !
Publish Date:Sep 26, 2022
Advertisement
తెలంగాణ ధనిక రాష్ట్రం. అందులో అనుమానం లేదు. కనక వర్షం కురిపించే ‘బంగారు హైదరాబాద్’ నోట్లో పెట్టుకుని పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నిస్సందేహంగా ధనిక రాష్ట్రం. కానీ, ఇప్పుడు అదే ధనిక రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయంది. ఎనిమిదేళ్లుగా ఏటి కేడాది పెంచుకుంటూ వచ్చిన అప్పులతో రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందనేది కూడా ఎవరూ కాదనలేని నిజం. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నతెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం, ప్రస్థానం ప్రారంభంలోనే బంగారు తెలంగాణ లక్ష్యంగా సంకల్పం చెప్పుకుంది. అయితే, ఎనిమిదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బంగారు తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ,చివరకు అప్పులు కూడా పుట్టని స్థితికి చేరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది విపక్షాలు చేస్తున్న ఆరోపణ మాత్రమే కాదు. ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. అయితే, అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, అంటోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నా చేసిన అప్పులు సక్రమగా రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తమ ఎనిమిదేళ్ళ పాలనలో సంపద వృద్ధి జరిగిందని, వివరణ ఇస్తోంది. అన్నిటినీ మించి కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద అసెట్ గా చూపిస్తోంది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎఫ్ఆర్బీఎం పరిమితులను దాటి, అప్పులు చేయడం లేదని వివరణ ఇస్తోంది. అలాగే, తెచ్చిన అప్పులు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నామని ప్రభుత్వం అప్పుల గురించి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తోంది. మొన్నీమధ్య ముచ్చటగా మూడు రోజులు జరిగిన రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర అర్థిక పరిస్థితి, అప్పుల పరిస్థితికి సంబంధించి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ పక్ష నేత, బట్టి విక్రమార్క ఒక్క ముక్కలో తేల్చి వేసిన విధంగా, ఆర్థిక మంత్రి, ప్రపంచ దేశాలు అన్నీ చుట్టి వచ్చారు, కానీ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పై మరో నాలుగు రాళ్లువేసి చేతులు కడుక్కున్నారు. అదలా ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్త పరుస్తోంది, ప్రతిపక్షాలు మాత్రమే, కాదు, కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక రంగ నిపుణులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఓ వంక ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మరోవంక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం మెగా ప్రాజెక్టు వలన, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కుబేరుడయ్యారే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల్లో ప్రాజెక్ట్ బండారం బయట పడింది. మోటార్లు మునిగిపోయాయి. అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరినీ, ఆ దిక్కుకు వెళ్లనీయడం లేదు. ప్రాజెక్ట్ పరిశీలనకు, ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. కాదని వెళితే అరెస్టులు చేసి వెనక్కి పంపుతోంది. మరో వంక, పెండింగ్ బిల్లిలు పాపంలా పెరిగిపోతున్నాయని ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఇక మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. పెండింగ్లో ఉన్న రూ. 800 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ తో ఆందోళన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల సంఘం అన్ని ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ పనులను నిలిపివేసింది. నిజానికి, ఒక జీహెచ్ఎంసీలోనే కాదు. స్కూల్ పిల్లలకు మధ్యాన్న భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లు మొదలు చిన్న కాంట్రాక్టర్లు అందరి పరిస్థితి ఇదే అనే ఆరోపణలున్నాయి. మరోవంక కేంద్ర ప్రభుత్వం కట్టడితో అప్పులు పుట్టే పరిస్థతి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత ఆదాయ దారులు మూసుకు పోతున్నాయి. లిక్కర్, రిజిస్ట్రేషన్, మైనింగ్ తప్ప ఆదాయం వచ్చే మార్గాలు కనబడటం లేదు. అలాగే, అవినీతి, అక్రమాలకు సంబందించిన ఆరోపణలు ముఖ్యమంత్రి కుటుంబాన్ని చుట్టుముడు తున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్తు ఉచ్చు బిగుస్తున్నట్లు వార్త లొస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న విధంగా తయారైందని, అంటున్నారు.ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక గండం నుంచి బయట పడేందుకు భూముల అమ్మకానికి తెరతీసిందని అంటున్నారు. అందుకోసమే 111 జీవోను ఎత్తి వేసింది. అయితే, దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో..వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయిందని అంటున్నారు. రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం స్టే విధించింది. దీంతో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, చిన్న మధ్య తరహ పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్ పేట లో భారీగా భూములను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 2,849 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈమూడు పారిశ్రామిక వాడల్లోని భూముల అమ్మకం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మరో ఐదారు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.నిజానికి ఇప్పటికే ప్రభుత్వం కోకాపేట సహా మరి కొన్ని ప్రాంతాలలో రెండు మూడు విడతల్లో భూములను విక్రయించింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన తెరాస నాయకులు, ఇప్పుడు అదే పని చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-lands-qre-ready-to-sale-39-144411.html