political-news-img

రాహుల్ కుటుంబంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ అనుచిత వ్యాఖ్యలు.!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. అయితే అవి హద్దులు దాటితేనే సమస్య. ఇటీవలి కాలంలో రాజకీయ విమర్శలు అన్ని హద్దులూ దాటేసి, దూషణలు, బెదరింపులు, అనుచిత, అసభ్య వ్యాఖ్యలూ ఎక్కువైపోయాయి. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విషయమేంటంటే.. యశ్‌పాల్ సువర్ణ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను ప్రస్తావించారు. ఆ చారిత్రాత్మక ఘటనను గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరిని మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ పోతే, రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా 1992లో బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ తరహా తీవ్రమైన పదజాలం రాజకీయాల్లో ఎప్పుడూ చూడని రీతిలో ఉండటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు, రాజకీయ పరిశీలకులూ, సామాన్య జనం కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బేషరతు క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. విద్వేషపూరితంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యతరకరమంటూ కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ కొడవూర్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణపై ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వైషమ్యాలను, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఒక ప్రముఖ నాయకుడి కుటుంబంపై భయాందోళనలు రేకెత్తించే రీతిలో మాట్లాడారనీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు యశ్‌పాల్ సువర్ణపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Yashpal Suvarna, Rahul Gandhi, Babri Masjid comments, Karnataka BJP MLA, Udupi Congress FIR, BNS sections case

Publish Date: Jul 29, 2026 2:28PM

political-news-img

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కుంభకోణంలో 350 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడంపై సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్న సుప్రీం కోర్టు . అక్రమంగా చేతులు మారిన వేల కోట్ల రూపాయల వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి తరలించారనే నిజానిజాలు బయటకు రావాలంటే నిందితులను నేరుగా ప్రశ్నించడమే సరైన మార్గమని అభిప్రాయపడింది. ఇందు కోసం కస్టోడియల్ విచారణ అవసరమనీ, ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక నేరాలలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించకుండా పూర్తి నిజాలు రాబట్టడం సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. విచారణాధికారులకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉందే తప్ప, విచారణ నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిలు రక్షణ కవచంలా ఉపయోగపడకూడదని స్పష్టం చేసింది. 350 కోట్ల రూపాయల మేర ప్రజాధనానికి గండి పడిందన్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, నిందితుడికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటూ కారుమూరి నాగేశ్వరరావు యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. AP liquor scam, Karumuri Nageswara Rao, Supreme Court verdict, anticipatory bail rejected

Publish Date: Jul 29, 2026 1:55PM

political-news-img

ఇండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి.!

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ నిప్పుల గుండంగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై పీవోకే ప్రజలు ఒక రకంగా తిరుగుబాటు ప్రకటింారు. ప్రాథమిక హక్కుల కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఒక రకంగా పీవోకేలో పరిస్థితి సివిల్ వార్ ను తలపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన పాక్ పాలకులు.. పీవోకేను శత్రుదేశంగా అభివర్ణిస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పీవోకే నిరసనకారులను ఇండియా లాగే వాళ్లు కూడా పాకిస్థాన్ కు శత్రువులు అంటూ ప్రేలాపనలు చేస్తున్నారు. పీవోకే నిరసనకారులను భారత్ లాగే శత్రువులు అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను పీవోకే ప్రధాని ఫైసల్ ముంతాజ్ రాథోడ్ ఖండించారు. కాశ్మీరీలకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖవాజా ఆసిఫ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన సొంత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ చేస్తోన్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అణచివేత కారణంగానే పీఓకే ప్రజల ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. Khawaja Asif POK remarks, POK protests 2026, Pakistan Defence Minister controversy, JAAC Rawalakot march, India slams Pakistan POK, Pakistan occupied Kashmir human rights

Publish Date: Jul 29, 2026 12:16PM

political-news-img

చంద్రబాబు విజన్ కు మరో ప్రత్యక్ష నిదర్శనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.!

గతంలో భోగాపురం వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయంపై వైసీపీ ఎకసెక్కాలు చేసింది. భోగాపురానికి ఎర్రబస్సే రాదు.. అలాంటిది ఏకంగా ఎయిర్ బస్ తీసుకువస్తారట అంటూ ఎగతాళి చేశారు. అంతే కాకుండా విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకంటూ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకూ, ఎకసెక్కాలకూ దీటైన జవాబుగా ఇప్పుడు భోగాపురం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాకారం చేసి చూపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం విమానాశ్రయ పనులు వాయువేగంతో ముందుకు సాగాయి. నిర్దేశిత గడువు కన్నా ముందే ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ట్రయల్ రన్ ద్వారా ఎయిర్‌బస్ తరహా భారీ విమానాలు ఇక్కడ సునాయాసంగా దిగవచ్చని రుజువైంది. ఇక మరో నాలుగు రోజుల్లో.. అంటే వచ్చే నెల 1న ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలో నడుస్తోంది. దీని వల్ల పౌర విమానాల రాకపోకలపై పరిమితులు ఉన్నాయి. నేవీ వర్గాలు అనుమతించిన సమయాల్లో మాత్రమే విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాలు ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. టేకాఫ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పరిమితులు, నిబంధనల కారణంగా రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సాధారణ విమానాల రాకపోకలకు అవకాశం ఇసుమంతైనా లేదు. దీనికితోడు విశాఖ తూర్పు నావికాదళం తన రక్షణ కార్యకలాపాలను, సైనిక శిక్షణను విస్తరించ తలపెట్టిన కారణంగా ముందు ముందు విశాఖ నుంచి పౌర విమానాలకు కేటాయించే సమయం మరింత తగ్గిపోతుంది. ఈ కారణంగా విశాఖ పేరుకు అంతర్జాతీయ విమానాశ్రయమే అయినా.. పరిమితుల కారణంగా ఇక్కడ నుంచి విమానయాన సంస్థల సర్వీసులు లిమిటెడ్ గానే ఉన్నాయి. ముందు ముందు మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉండటంతో.. ఉత్తరాంధ్రకు సంపూర్ణ పౌర విమానయాన సర్వీసుల కోసం మరో అంతర్జాతీయ విమానాశ్రయం అనివార్యం. అయితే వైసీపీయులు.. ఈ అనివార్యతలను, అవసరాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా భోగాపురం ఎందుకంటూ ఊరూ వాడా ఏకం చేస్తూ విమర్శలు గుప్పించారు. వాస్తవానికి.. భోగాపురం విమానాశ్రయఆలోచనకు ఎప్పుడో 1997లోనే నాంది పడింది. మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు. ఆ దిశగా ముందుకు సాగే క్రమంలో వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. కేసుల మీద కేసులతో అవాంతరాలు సృష్టించారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత భోగాపురం పురోగతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే 2024 ఎన్నికలలో అఖండ మెజాజరిటీతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అమరావతి, పోలవరంలతో సమ ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు పెట్టించింది చంద్రబాబు ప్రభుత్వం. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును 4 వేల 750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే ఈ విమానాశ్రయం భవిష్యత్తులో దశలవారీగా దీని సామర్థ్యాన్ని నాలుగు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించేందుకు వీలుగా విస్తరించనున్నారు. ఈ ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి రోజూ 200కు పైగా విమానాల రాకపోకలకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాలను కూడా ఈ విమానాశ్రయంలో సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా రన్ వేల రూపకల్పన చేశారు. ఉత్తరాంధ్ర తీర తరచూ తుఫానులు, ఈదురుగాలులకు గురయ్యే అవకాశం ఉన్నందున, భోగాపురం విమానాశ్రయ భద్రతా ప్రమాణాలకు పెద్ద పీట వేసి నిర్మించారు. హుద్‌హుద్ వంటి పెను తుపానులను సైతం తట్టుకునేలా సాంకేతిక హంగులతో ఈ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా టెర్మినల్, రన్‌వే నిర్మాణాలు చెక్కుచెదరవు. భారీ వర్షాలు కురిసినా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా.. డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే కాకుండా యావత్ ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చే ప్రధాన చోదక శక్తిగా నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయం రావడంతో.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులకు నేరుగా కనెక్టివిటీ దొరకడం వల్ల విదేశీ పెట్టుబడులు ప్రవాహంలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. తీరప్రాంత పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకం కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. Bhogapuram International Airport, Visakhapatnam Greenfield Airport, Bhogapuram Airport Construction Details, Airbus Landing Bhogapuram, North Andhra Infrastructure Development

Publish Date: Jul 29, 2026 11:59AM

political-news-img

మరో ఉద్యమానికి కాక్రోచ్ లు రెడీ.. ఎందుకంటే?

కాక్రోచ్ జనతాపార్టీ మరో సారి ఉద్యమించడానికి రెడీ అవుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతుకు దిగి వచ్చిన మోడీ సర్కార్.. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఉద్యమ సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులన్నిటినీ తక్షణమే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. అయితే రోజులు గడుస్తున్నా కేంద్రం ఆ హామీని నెరవేర్చకపోవడంతో.. దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటమ్ ఇచ్చింది. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిథి సౌరవ్‌ దాస్.. నీట్ వివాదంపై నమోదైన ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న సౌరవ్ దాస్, గతంలో ఎటువంటి నేరచరిత్ర లేని, నిర్బంధంలో ఉన్న విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. అయితే.. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న ఒకే ఒక్క అంశాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటూ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆరోపించారు. న్యాయస్థానం ఎక్కడా కేసులను ఎత్తివేయకూడదని ఆదేశించలేదని, నమోదైన కేసులను ఉపసంహరించుకునే పూర్తి అధికారాలు, చట్టపరమైన హక్కులు ప్రభుత్వానికి ఉంటాయని స్పష్టం చేశారు. నీట్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే కాకుండా, వారిపై మోపిన అక్రమ కేసులన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోతే.. మళ్లీ క్షేత్రస్థాయిలో వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. CJP to agitate again, Cockroach Janata Party, CJP ultimatum, student protest cases, FIR withdrawal demand, Supreme Court NEET ruling

Publish Date: Jul 29, 2026 11:14AM

political-news-img

మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రా అరెస్టు.!

మావోయిస్టు అగ్రనేత సీపీఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రా అరెస్టయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మిసిర్ బిస్రా తలపై 1 కోటి రూపాయల రివార్డు ఉంది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో అనేక విధ్వంస కార్యకలాపాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి మిసిర్ బేస్రాఅరెస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భద్రతా బలగాల పక్కా వ్యూహంతో సాగించిన ఆపరేషన్ లో మిసిర్ బేస్రా అరెస్టయ్యారు. ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, కోబ్రా బెటాలియన్ సంయుక్తంగా ధన్‌బాద్, గిరిడిహ్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని మంగళవారం (జులై 28) అర్థరాత్రి సమయంలో చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో మిసిర్ బేస్రా ఉన్నారన్న సమాచారం అంతకు ముందు రోజు అంటే సోమవారం (జులై 27) రాంచీలో 16 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయారు.వారిలో మిసిర్ బేస్రాకు వ్యక్తిగత అంగరక్షకుడు దేవాన్ ముర్ము అలియాస్ శనిచర్వా కూడా ఉన్నాడు. అతడి ద్వారా అందిన సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో మిసిర్ బేస్రా, అతనితో ఉన్న మరో ఇద్దరు కీలక రీజినల్ కమిటీ సభ్యులు కూడా చిక్కారు. ఝార్ఖండ్ లోని గిరిడిహ్ జిల్లా పిర్తాండ్‌ ప్రాంతానికి చెందిన మిసిర్‌ బేస్రా నాలుగు దశాబ్దాల కిందట మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఉద్యమంలో భాస్కర్, సునిర్మల్, సాగర్ అనే వేర్వేరు పేర్లతో కార్యకలాపాలు సాగించారు. మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు. Misir Besra arrested, CPI Maoist Politburo member, Jharkhand Maoist arrest, Rs 1 crore reward Maoist, CRPF CoBRA operation, Naxalite commander captured

Publish Date: Jul 29, 2026 10:52AM

MOVIE NEWS