దేశసేవలో తెలుగు తేజం.. డ్రైవర్ నుంచి అమరత్వం వరకు..
Publish Date:Dec 9, 2021
Advertisement
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో తెలుగుతేజం, పారా కమాండో బి.సాయితేజ మరణం అందరికీ దుఃఖకారణమే. సాయితేజ అకాల మరణం చిత్తూరు జిల్లా వాసులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. లాన్స్ నాయక్ సాయితేజ సొంతూరు చిత్తూరు జిల్లా కురుబకోట మండలం రేడగపల్లె. 29 ఏళ్ల సాయితేజకు భార్య శ్యామల, ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కూతురు దర్శిని ఉన్నారు. సాయితేజ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరి. సాయితేజ తమ్ముడు మహేష్ కూడా సైన్యంలోనే ఉన్నాడు.భార్య శ్యామలకు ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే సాయితేజ అనంతలోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను దుఃఖసాగరంలో ముంచింది. శ్యామలకు ఫోన్ చేసిన సాయితేజ పిల్లలను చూడాలని ఉందంటూ వీడియోకాల్ లో మాట్లాడాడు. భార్య, పిల్లలతో సంతోషంగా ముచ్చటించాడు. ఫోన్ లో మాట్లాడిన మూడు గంటలకే సాయితేజ మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శత్రుస్థావరాలపై మెరుపు దాడులు చేయడంలో దిట్ట అని సాయితేజ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సాయితేజ సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భారత సైన్యంలో పారా కమాండోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి పారా ట్రూపర్స్ నుంచి సీడీఎస్ బిపిన్ రావత్ టీమ్కి సాయితేజ ఎంపికవడం విశేషం. సైన్యంలో నిర్వహించే పారా ట్రూపర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సాయితేజ కఠిన శిక్షణ తీసుకున్నాడు. దేశంలో అత్యంత దృఢమైన, శక్తి సామర్ధ్యాలు ఉండేవారే పారాట్రూపర్లు. సీడీఎస్ బిపిన్ రావత్ దృష్టిలో పడి ఆయన వ్యక్తి సిబ్బందిలో ఒకడిగా సాయితేజ చేరాడు. బిపిన్ రావత్ ప్రోత్సాహంతో సాయితేజ పారాట్రూపర్లకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. సాయితేజ దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తిచేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్ కు హాజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడై 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్నా, సొంతూరిలో ఉన్నా ప్రతిరోజూ 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసే వాడు. శరీర దృఢత్వానికి సాయితేజ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తీరు చూసి.. ఊరు ఊరంతా ఆశ్చర్యపోయేదట. క్రికెట్ అంటే కూడా సాయితేజకు ఎంతో ఇష్టమని స్నేహితులు చెబుతున్నారు. రేగడపల్లె యువకులను సాయితేజ క్రికెట్ టోర్నీలకు పంపించి ప్రోత్సహించేవాడని గుర్తుచేసుకుంటున్నారు. గ్రామంలో ఉన్నన్ని రోజులూ అందరితో ఎంతో కలిసిమెలిసి ఉండేవాడని, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవాడని చెబుతున్నారు. ఇంటికి ఎవరెవరో వస్తుండడం, తల్లి శ్యామల భోరున విలపిస్తుండడంతో ఏం జరిగిందో తెలియక సాయితేజ కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని అందరి వంకా దీనంగా చూస్తున్నారు. చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది. సిపాయిగా సైన్యంలో చేరిన సాయితేజ తొలుత జమ్ము కశ్మీర్లో విధులు నిర్వర్తించాడు. పారా ట్రూపర్ల శిక్షణలో రాటుదేలిన సాయితేజ కొంతకాలం పాటు పారాట్రూపర్లకు శిక్షణ కూడా ఇచ్చాడు. సాయితేజ శక్తి సామర్ధ్యాలను గుర్తించిన బిపిన్ రావత్ తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేర్చుకున్నారు. సాయితేజను చూసి సీడీఎస్ బిపిన్ రావత్ ఎంతో అభిమానించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడు పదుల వయస్సు కూడా నిండని సాయితేజ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. దేశం తలెత్తుకునే స్థాయికి సాయితేజ ఎదిగాడు. విధి నిర్వహణలోనే వీరమరణం పొందాడు. దేశ భద్రతను పర్యవేక్షించే సీడీఎస్కు చీఫ్ సెక్యూరిటీ అధికారి సాయితేజను చూసి యావద్దేశం కన్నీరు పెడుతోంది.
http://www.teluguone.com/news/content/special-story-on-lance-naik-bsai-teja-39-127999.html