కాదంబరి జెత్వానీ కేసు.. సీఐడీ చార్జిషీట్ రిటర్న్!
ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం సృష్టించిన కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ అయ్యింది. సీఐడీ గుంటూరు అధకారులు దర్యాప్తు చేసి.. ఈ కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారనే పూర్తి వివరాలతో చార్జిషీటును సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. అయితే.. సాంకేతిక కారణాలలో కోర్టు చార్జిషీట్ ను రిటర్న్ చేసింది. దీంతో సీఐడీ అధికారులు త్వరలోనే లోపాలను సవరించి మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేసు వివరాల్లోకి వెడితే.. వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో దాదాపు రెండు వారాల పాటు ఆమెను జైల్లో ఉంచి, తీవ్ర మానసిక, శారీరక క్షోభకు గురిచేశారనీ, తమ ఆస్తులను సీజ్ చేశారని బాధితురాలు కాదంబరి జత్వానీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వానీ విజయవాడ పోలీస్ కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసింది. సీఐడీ దర్యాప్తులో ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (పీఎస్ఆర్), కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తేల్చింది. ఇప్పటికే ప్రభుత్వం వీరిసై సస్పెన్షన్ వేటు వేసింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ పోలీసులు 50 మంది సాక్షులను విచారించి, కీలక ఆధారాలను సేకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పి.ఎస్.ఆర్. ఆంజనేయులను ఈ ఏడాది ఏప్రిల్ 22న సీఐడీ అరెస్ట్ చేయగా, ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ అనుభవించి, ఇటీవల హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. ఇప్పుడు కోర్టు చార్జిషీటును తిరస్కరించడంతో సీఐడీ సాంకేతిక లోపాలను సవరించి మరో చార్జిషీట్ దాఖలు చేయడానికి సమాయత్తమౌతోంది. CID charge sheet returned in Kadambar Jatwani case, PSR, Krantiranatata, Vishalgunni, Kukkala Vidyasagar
Publish Date: Jul 18, 2026 11:37AM