మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ
Publish Date:Aug 8, 2022
Advertisement
మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ నెల్లూరులో అత్యంత వైభవంగా జరుగుతోంది. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. అలాగే మరికొన్ని వేడుకలు కొంత మంది మాత్రమే జరుపుకొంటారు. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు నెల్లూరుకే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. ఈ పండుగకు దేశం నలుమూలల నుంచే కాదు.. ఇతర దేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. గతంలో ఈ పండగ మూడ్రోజులు మాత్రమే జరిగేది. కోరిన కోర్కెలు తీర్చే.. సంబరాల రొట్టెల పండుగ ప్రతి ఏటా మొహర్రం నెల ప్రారంభమయిన తర్వాత వచ్చే పదకొండో రోజు నుంచి మూడ్రోజుల పాటు జరుగుతోంది. ఈ పండుగ వెనుక ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. ఈ పండగకు మూడొందల అరవై సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 1651లో సౌదీలోని మక్కా షరీఫ్ నుంచి పన్నెండు మంది వీరులు సంచరిస్తూ భారత దేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని హైదర్ ఆలీ పరిపాలిస్తున్నారు. అదే సమయంలో నెల్లూరు ప్రాంతంలో నవాబుల పాలన ఉండేది. సరిగ్గా అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో మత విబేధాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజా రాజులపై దండెత్తేందుకు బీజాపూరు సైన్యం బయల్దేరింది. వారితోపాటే ప్రచారానికి వచ్చిన మక్కావీరుల బృందం సైతం వారితో అడుగులు కలిపింది. వాలాజాకు గుర్రాలపై నెల్లూరు మీదుగా వెళ్తుండగా.. కొడవలూరు మండలం గండవరం వద్ద తమిళనాడు సైన్యం ఎదురైంది. దీంతో రెండు వర్గాల మధ్య హోరాహోరీ యుద్దం జరిగింది. ఈ కదనరంగంలో ఆ పన్నెండు మంది వీరుల తలలు గండ వరంలో నేలరాలాయి. మొండాలు మాత్రం గుర్రాలపైనే నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరినట్లు చరిత్ర చెబుతోంది. బారా అంటే పన్నెండు... షహీద్ అంటే అల్లా ధ్యాసలో సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి అమరులైన వారని అర్థం. అయితే ఆ స్వర్ణాల చెరువు వద్ద నిత్యం దుస్తులు ఉతికే ఒక రజక దంపతులకు ఓ రోజు రాత్రి కలలో ఈ మృత వీరులు కన్పించారట. అప్పటికి నెల్లూరును పాలిస్తున్న ఆర్కట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందని... మా శవాలు కలిసిన ప్రాంతంలోని మట్టిని తీసుకెళ్లి ఆమెకు బొట్టు పెడితే రాజు భార్య అనారోగ్యం తగ్గుతుందని కలలో కనిపించి చెప్పారట. ఈ విషయాన్ని రాజభటుల ద్వారా రాజుకు వారు తెలియజేశారు. దీనిపై రాజు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం తగ్గిపోయిందని సమాచారం. దీంతో రాజు, రాణి ఇద్దరూ ఈ చెరువు దగ్గరకొచ్చి మత ప్రచారకులు మట్టిలో కలిసిన చోట దర్గాలు కట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలా పూజలు చేసేందుకు వచ్చేటప్పుడు తమతోపాటు తెచ్చుకున్న రొట్టెలను అక్కడే తిని, మిగిలిన వాటిని అక్కడి వారికి పంచేవారట. అలా అలా.. చెరువు దగ్గర రొట్టెలు తినటం, పక్కవారికి ఇవ్వటం ద్వారా రొట్టెల పండుగ జరుగుతోంది. అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణించే యాత్రికులు ఇక్కడ కాసేపు కూర్చుని సేద తీరేవారట. వారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను చెరువు దగ్గర తిని, చెరువులోని నీళ్లు తాగి వెళ్లేవారట. అలా దర్గా దగ్గర రొట్టెలు తిని, చెరువులో నీళ్లు తాగితే శుభం జరిగేదని.. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేకూరేదని భక్తుల్లో ఓ విధమైన నమ్మకం కల్గింది. అలా దర్గాకు ప్రాచుర్యం జరిగిన కొన్నాళ్లకు నెల్లూరు జిల్లా ఆర్కాట్ నవాబుల పాలన కిందకు వచ్చింది. ఓసారి నవాబు తన భార్య బేగంతో కలిసి ఉదయగిరికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు బారా షహీద్ దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నవాబు భార్య కాలు తట్టుకుని కింద పడ్డారు. తర్వాత అక్కడ్నుంచి తమ రాజధానికి వెళ్లారు. కొన్నాళ్లకు నవాబు భార్యకు జబ్బు చేసి మంచాన పడింది. ఎంతకీ నయం కాలేదు. బేగం కాలు తట్టుకుని కింద పడిన చోట పన్నెండు సమాధులున్నాయని, ఆ ప్రదేశాన్ని తవ్వించి అభివృద్ది చేస్తే జబ్బు తగ్గుతుందని ఓ దివ్యమూర్తి కలలోకి వచ్చి నవాబుకు చెప్పిందట. దీంతో వెంటనే ఆయన సమాధులను వెలికి తీసి, దర్గాను నిర్మించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు బేగం వ్యాధి పూర్తిగా నయమైపోయింది. దర్గా ప్రాశస్త్రం అనతి కాలంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. మొక్కులపై ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైంది. దర్గాలో అమర వీరుల సమాధులను దర్శించుకుని, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్ని భుజించి నెల్లూరు చెరువు (స్వర్ణాల చెరువు) లో నీళ్లు తాగేవారు. రొట్టెల రూపంలో ఎలాంటి కోర్కెలైనా నెరవేరుతున్నాయన్న ప్రచారం వ్యాపించింది. అలా రొట్టెల పండుగ రూపం సంతరించుకుంది. రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులకు గట్టి నమ్మకం ఏర్పడింది. అలా కోర్కెలు తీరిన వారు కొత్తవారికి రొట్టెలను పంపిణీ చేస్తారు. ఎంతో నమ్మకం ఉండబట్టే ప్రతిఏటా బారాషాహీద్ దర్గాకు వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు.. అప్పటికే ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. కోర్కె తీరిన వారు స్వయంగా అయిదు రొట్టెలను తయారు చేస్తారు. ఒకదాన్ని ఇంట్లో ఉంచి, మిగిలిన నాలిగింటినీ దర్గా దగ్గరకు తీసుకువస్తారు. సమాధుల్ని దర్శించుకుని చెరువు వద్దకు తీసుకెళ్తారు. నీళ్లను తలపై చల్లుకుని, కోర్కెలు నెరవేరాలంటూ వాటిని అవి కావాల్సిన వారికి అందజేస్తారు. ఎన్ని కోర్కెలు కోరుకున్నా.. ఒక్కో కోరికకు ఐదు రొట్టెలు పంచాల్సి ఉంటుంది. కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దర్గా అనగానే సహజంగా ఎవ్వరైనా సరే.. ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. కానీ నెల్లూరు బారాషహీద్ దర్గా విషయంలో మాత్రం అదే మీలేదు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాలవారూ తరలివస్తారు. ప్రతి ఏటా తాము కోరిన కోర్కెలు తీరినందుకో లేక కొత్తగా కోర్కెలు కోరుకునేందుకో వస్తూనే ఉంటారు. దీంతో ఏటేటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఇక గంధ మహోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. గంధం తీసుకురాగానే భక్తులు దాన్ని అందుకునేందుకు పోటీపడతారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారాషహీద్ దర్గాలోని రొట్టెల పండగలోని ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. నెల్లూరు కోటమిట్టలోని అమినీయా మసీదులో కొంతమంది మైనార్టీ నేతలు మొత్తం పన్నెండు మంది సభ్యులు కలిసి పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు. తర్వాత మేళతాలాల మధ్య ఉప్పొంగిన భక్త జనం మధ్య కోలాహలంగా గంధాన్ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు. పూలతో అలంకరించిన గంధం బిందెలను ఊరేగింపుగా తెస్తుంటే ముందు భాగంలో మేళతాళాలు, ఫకీర్ల జరుబులు, విన్యాసాలు అందరినీ అలరిస్తుంటాయి. మొదటి బిందె గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి, మిగతా పదకొండు బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
http://www.teluguone.com/news/content/nellore-rottela-panduga-known-for-communal-hormony-39-141524.html