చావులోనూ తోడువీడని సతీమణి.. సేవలో మధులికా రావత్ మేటి..
Publish Date:Dec 9, 2021
Advertisement
భారత సైన్యంలోకే అత్యున్నత హోదా. దేశ తొలి సీడీఎస్. అంతకుముందు ఆర్మీ చీఫ్. అలాంటి బిపిన్ రావత్ సతీమణి మధులికా సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. భర్త ఆర్మీ ఆపరేషన్స్లో బిజీగా ఉంటే.. భార్య సైనికుల సేవలో, ప్రజా సేవలో నిమగ్నమయ్యేవారు. అలాంటి మధులికా.. రావత్తో పాటే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలకు మధులిక దన్నుగా నిలిచేవారు. వారి కుటుంబాలకు చేయూత నిచ్చేవారు. సైనికుల కుటుంబ సభ్యుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేశారు. కుట్లు, అల్లికలు, సంచుల తయారీ, బ్యుటీషియన్ కోర్సులు నిర్వహించారు. ఆరోగ్యంపైనా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సైనిక కుటుంబాలనే కాదు.. సాధారణ ప్రజల కోసం కూడా మధులిక అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేశారు. దివ్యాంగులైన పిల్లల కోసం అనేక ప్రొగ్రామ్స్ చేశారు. అలా సేవలో మేటి అనిపించుకున్నారు మధులికా రావత్. ఇక, జనరల్ బిపిన్ రావత్కు తన స్వగ్రామమైన ఉత్తరాఖండ్లోని పౌరీ అంటే ఎంతో ఇష్టం. తరుచూ అక్కడికి వెళుతుంటారు. చిన్ననాటి స్నేహితులను, బంధువులను కలుస్తుంటారు. గ్రామంలో కుల దేవతకు పూజలు చేసేవారు. చివరిసారిగా 2018లో రావత్ తన స్వగ్రామాన్ని సందర్శించారు. పదవీ విరమణ తర్వాత అక్కడే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇక్కడినుంచి ఉద్యోగరీత్యా వెళ్లడం చాలా బాధగా ఉందని, తిరిగి వచ్చాక గ్రామానికి ఎంతోకొంత చేయాలని ఉందని బిపిన్ రావత్ అనేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో మళ్లీ గ్రామానికి వస్తానని చెప్పారు. కానీ, అంతలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యారు.
మధులిక విద్యాభ్యాసం గ్వాలియర్లోని సింధియా కన్యా విద్యాలయంలో సాగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రావత్తో వివాహం అనంతరం.. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ప్రతిరూపంగా నిలిచారు. సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. సైనిక కుటుంబాల బాగోగులు చూసే ఈ సంఘం.. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా పేరు గాంచింది.
http://www.teluguone.com/news/content/madhulika-rawat-profile-39-128005.html