దయామయులకు వందనం !!
Publish Date:Nov 13, 2021
Advertisement
ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. ఒకరికి మరొకరు విభిన్నమైన వారు. కొందరిలో క్రూరత్వం, మరికొందసరిలో సాధుస్వభావం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పెరిగిన పరిస్థితుల ఆధారంగానే ఉన్నా, తమ అనుభవాల కారణంగా అటు వారు ఇటు, ఇటు వారు అటు మారిపోయిన, మారిపోతున్న సందర్భాలు కూడా బోలెడు. అయితే ప్రపంచానికి దయా హృదయాన్ని పంచినవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఎమిటో తెలుసుకుని ఆ మాటలను పిల్లలకు చెబితే నేటి పిల్లలు రేపటి దయామయులు అవుతారు. సాధారణంగా అందరూ చేసే తప్పు ఒకరిని తక్కువగా చూడకూడదు, పేదవారిని ఎగతాళి చేయకూడదు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి ఇలాంటి మాటలు పిల్లలకు చెప్పడం. ఇవి తప్పు మాటలా అని అందరికి అనిపిస్తాయి. కానీ వంద మాటలు చెప్పడం కన్నా ఒక చిన్న పని పిల్లల చేత చేయించడం ఎంతో ఉత్తమం. నీతి కథలను, వేమన పద్యాలను, సుభాషితాలను పిల్లలచేత వల్లే వేయించి వాళ్లకు నీతిని, దాయను, జాలిని నూరిపోస్తున్నాం అనుకుంటారు కానీ కేవలం మాటల వల్ల మాత్రమే వాటి తాలూకూ విలువలు పిల్లల్లో పెంపొందవు. పేదవాళ్లకు, కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయించాలి. చిన్నదా పెద్దదా అనే సంశయం అక్కర్లేదు. నేటి విత్తనమే రేపటి వృక్షం. పిల్లలతోనే నేరుగా సహాయం చేయించడం వల్ల దాని లోతులు పిల్లలకు తెలుస్తాయి. మొక్కల పెంపకం ఓ మొక్కను నాటించి దాన్ని సంరక్షించి, నీళ్లు పోసి, కలుపు తీసి దాన్ని పెద్దగయ్యేలా చేయడంలో ఉన్న శ్రమ పిల్లల్లో బాధ్యతను తెలుపుతుంది. పెద్దవారి పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండేలా అది తోడ్పడుతుంది. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల సందర్శన వృద్ధాశ్రమాలలో దిక్కులేని వృద్ధులు బిక్కు బిక్కుమని గడుపుతుంటారు. వారి దగ్గరకు తీసుకెళ్తే వారి దయనీయ పరిస్థితులు, అనాధాశ్రమాలలో పిల్లల జీవితాలు చూడటం ద్వారా జీవితంలో తాము ఎంత మంచి స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. వారికి సహాయం చేయాలనే మనస్తత్వం పెంపొందుతుంది. జంతువుల పట్ల భూతదయ.. ఇంట్లో ఏదో ఫాషన్ కోసమూ, స్టేటస్ కోసమూ పెంపుడు జంతువులను పెంచడం కాదు. వీధి కుక్కలు, పిల్లులుకు ఆహారం పెట్టడం. ఇంటి గోడ మీద వాలే పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం. మూగజీవాలను కొట్టకుండా వాటికీ మనసు ఉంటుందని వాటి చర్యలకు అర్థం వివరిస్తూ జంతువులను అర్థం చేసుకునేలా చేయడం. సమాజంలో తిండి, నీరు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉండటానికి సరైన నివాస ప్రాంతాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు జీవితంతో ఎలా పోరాటం చేస్తున్నారో, వీధి బాలలు తమ బాల్యాన్ని చిత్తు కాగితాల మధ్య ఎలా కోల్పోతున్నారో అర్థమయ్యేలా చెబుతూ మీ చుట్టూనే ఉన్నవారిని ఉదాహరణగా చూపించడం వల్ల పిల్లల్లో ప్రత్యక్ష ప్రతిస్పందనలు కలుగుతాయి. నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం సందర్బంగా అందరిలో ఈ విషయం పట్ల అవగాహన పెంచేందుకు ఇదొక చిన్న ప్రయత్నం. మీరు మీ చుట్టుపక్కల వారిలో మార్పు కోసం ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల ఉన్న కరుణా మూర్తులకు వందనం సమర్పించండి.
ఈ దయ అనేది పిల్లలోనే కాకుండా పెద్దలలో కూడా పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థంలో కూరుకుపోయిన ఎందరో మార్పు చెంది ప్రపంచాన్ని కూడా మార్చాల్సిన సమయం ఆసన్నమయ్యింది.
◆ వెంకటేష్ పువ్వాడ
http://www.teluguone.com/news/content/greetings-to-the-merciful-35-126312.html