తెరాసలో పేలనున్న అసమ్మతి బాంబు
Publish Date:Aug 9, 2022
Advertisement
తెరాసకు ఇప్పుడు రోజులు కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారో.. ఆ క్షణం నుంచీ గులాబి పార్టీకి వరుస ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ తో యుద్ధం ప్రకటించిన కేసీఆర్ కు స్వరాష్ట్రంలో అసమ్మతి, అసంతృప్తి నేతల తాకిడి సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో అడుగు కలిపి నడిచిన ఒక్కరొక్కరుగా ఆయనకు దూరం జరుగుతున్నారు. అదే సమయంలో వరుసగా రెండు ఉప ఎన్నికలలో విజయం తరువాత రాష్ట్రంలో కాషాయదళం గళం పెంచింది. గతంలో ఏ ఆపరేషన్ ఆకర్ష్ తో అయితే ప్రత్యర్థి పార్టీల బలాన్ని కేసీఆర్ హరించారో ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములాతో బీజేపీ తెరాస గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు.. దానిని అధిగమించేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి సాధించిన తెలంగాణను ఒర్వలేని తనంతో మోడీ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపేముందు గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయని విధంగా అప్పులు చేసిన కేంద్రం సంగతి ముందు తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ ను వ్యర్థ వ్యవస్థగా అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని పేర్కొంటూ ఏకంగా మోడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మైండ్ గేమ్ లో ఇప్పటి దాకా నిష్ణాతుడిగా పేరొందిన కేసీఆర్ నే బెంబేలెత్తించే స్థాయిలో బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. తెరాసలో త్వరలో అసమ్మతి బాంబ్ పేలబోతోందంటూ బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న మురళీధరరావు చేసిన వ్యాఖ్య ఇప్పుడు గులాబి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకు ముందు తెలంగాణలో మరో 12 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే మురళీ ధరరావు వ్యాఖ్యలను అర్ధం చేసుకోవాలని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇరత పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులను ఆకర్షించిన ఫలితంగానే ఇప్పుడు తెరాసలో అసంతృప్తుల బెడద లేని నియోజకవర్గం లేదంటే అతిశయోక్తి కాదనే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పరంగా కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాకు తెరతీసి.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకుండా జాతీయ స్థాయిలో సమస్యలపై మోడీ టార్గెట్ గా గళమెత్తుతున్నారని తెరాస వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి పీక్ కు చేరి ఉండటంతో కార్యకర్తలు కూడా అందుకు తగ్గట్టుగానే ఏదో ఒక గ్రూపులో చేరిపోయారు. దీంతో నియోజకవర్గాలలో పార్టీ వర్గాలు, గ్రూపులుగా చీలిపోయి ఉన్న పరిస్థవితి ఉంది. ముందు ఇంటిని ( పార్టీ) చక్కదిద్దుకోకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ నేల విడిచి చేస్తున్న సాము కారణంగా రాష్ట్రంలో పార్టీ పునాదులే కదిలిపోయేలా వ్యతిరేకత అనే భూకంపం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/dissident-bomb-ready-to-blast-in-trs-39-141564.html