తెలంగాణలో స్కూల్స్ క్లోజ్!
Publish Date:Mar 22, 2021
Advertisement
కరోనా విజృంభణతో తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయికి లాక్ డౌన్ అమలుకు అవకాశం లేకపోయినా.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/coivd-increasing-telnagana-govt-planing-to-close-schools-25-112361.html





