అక్షరం మీద అవని!!
Publish Date:Nov 11, 2021
Advertisement
ప్రపంచ దేశాల మధ్య అన్ని రంగాలలో పోటా పోటీ కొనసాగుతూనే వుంటుంది. విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామికం ఇలా ఎన్నో…. ఒక్కొక్క రంగంలో నిపుణత సాధించడానికి ఎన్నో అవగాహనాలు, విశ్లేషణలు, పరిశీలనలు, ప్రయోగాలు చాలానే ఉంటాయి. అయితే రంగం ఏదైనా అందులో అన్ని తెలుసుకోవాలన్న దేశ కాలమాన పరిస్థితులను అంచనా వేయాలన్న ఆలోచనతో పాటు చదువు కూడా ఉండాలి. ఏదో దేశాలు ఉద్ధరించడానికి కాకపోయినా కనీసం ప్రతిమనిషి తన జీవితానికి ఆహారం, నీరు, అవసరాలు ఎలా ఉన్నాయో అలా చదువుకోవడం కూడా ముఖ్యమేనని, అది ప్రతి మనిషి హక్కు అని ప్రపంచ విద్యా దినోత్సవం నాడు గుర్తుచేసుకోవలసిన విషయం. నవంబర్ 11 ప్రపంచ విద్యా దినోత్సవంగా యావత్ ప్రపంచ దేశాలు విద్య ఆవశ్యకతను గుర్తిస్తూ తమతమ దేశాలలో అక్షరాస్యతను పెంచుకునేందుకు కలిగించే అవగాహనా దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఇక మన దేశం గురించి చెప్పుకుంటే విద్యను సామాజిక హక్కుగా, అది అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఒకానొక వనరు స్థానం నుండి దాన్ని మళ్ళీ కేవలం డబ్బుతో కొనుక్కునే వస్తువుగా ఎన్నటి నుండో పరిగణిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం విద్య అందరి హక్కు అని, అందరికి అందుబాటులో ఉండాలని అది తమ లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థలు అధికం కావడం, విద్య ఖరీదు రెక్కలు తొడగడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అయితే సాధారణ పౌరుల్లో సామాజిక విద్య పట్ల అవగాహన పెంపొందించడం సాటి పౌరులుగా అందరి బాధ్యత అనే విషయం మరచిపోకూడదు. ఇప్పట్లో ప్రభుత్వ బడులలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి ప్రాణాళికలు బాగానే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల స్వార్థం వల్ల వాటిని అమలుపరచడంలో సమస్యలు తలెత్తుతున్నాయేమో కానీ మండల, జిల్లా స్థాయి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. బడి పిల్లలకు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ లు, రిజర్వేషన్ లు, ఇవి మాత్రమే కాకుండా ప్రయివేట్ పాఠశాలలు మరియు కాలేజి పిల్లలకు కూడా రీయింబర్స్మెంట్ రూపంలో పూర్థిస్తాయి నాణ్యమైన విద్య అందే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేనికైనా అవగాహన ముఖ్యం అన్నట్టు విద్య దాని ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలి మరియు తెలియజెప్పాలి వేగవంతమైన ఈ ప్రపంచంలో విద్య ద్వారా మనిషి స్థాయి ఎలా ఇనుమడిస్తుందో, ఎలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో కొండశ్రీ జీవితాలను చూస్తూ తెలుసుకోవాలి పేదరికం విద్యకు ఎప్పుడు అడ్డంకి కాదని, దిగువ కులాలకు ఇచ్చిన ఎన్నో ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ చదువులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని ఎందరో జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. వారి గురించి వివరించాలి. ప్రతి పిల్లవాడికి లింగ బేధం లేకుండా కనీస విద్యార్హత వరకు చదువు చెప్పించడం ద్వారా వారి జీవితం ఎంతో ఆశావాహంగా సాగుతుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విద్య ద్వారా ప్రపంచాన్ని, ప్రపంచ పరిస్థితులను, కాలాన్ని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు తమ సామర్త్యాన్ని వినియోగించడం ద్వారా గొప్ప జీవితం సొంతమవుతుంది. ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఆలోచించి విద్య పట్ల అవగాహన పెంపొందిస్తే మన భారతదేశంలో అక్షరాస్యత రేటు పెరిగి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ అభివృద్ధి మొత్తం విజ్ఞానం పైననే ఆధారపడి ఉంది ఇప్పుడు. ◆ వెంకటేష్ పువ్వాడ
http://www.teluguone.com/news/content/avani-on-the-letter-35-126178.html