Top Stories

political-news-img

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన్వీ శర్మ సంచలనం.. ఐదో సీడ్ కు షాక్!

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై భారతదేశపు యువ సంచలనం తన్వీ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ యంగ్ షట్లర్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సిడ్నీ వేదికగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో తన్వీ శర్మ అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి కోర్టులో చెలరేగిపోయింది. టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన చైనీస్ తైపీ బలమైన ఆటగాడు చియు పిన్ చైన్‌ను మట్టికరిపించి తన్వీ శర్మ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 45 నిమిషాల పాటు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న ఐదో సీడ్ ఆటగాడి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, తన్వీ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా సమయస్ఫూర్తితో ఆడి విజయాన్ని ముద్దాడింది. ఈ మ్యాచ్ విశ్లేషణను పరిశీలిస్తే, తొలి గేమ్‌లో ఆరంభం నుండి ఇరు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నడిచింది. ఒక దశలో స్కోరు 5-5 తో సమం కావడంతో మ్యాచ్ ఎటు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాత తన్వీ శర్మ తన దూకుడును పెంచి వెనుదిరిగి చూసుకోకుండా పాయింట్ల వేట సాగించింది. దాంతో మొదటి గేమ్‌ను 21-12 తో చాలా సులభంగా కైవసం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియు పిన్ చైన్ పుంజుకుని భారత షట్లర్‌కు చుక్కలు చూపించింది. ఒకానొక దశలో స్కోరు 10-10 వద్ద, ఆ తర్వాత 17-17 వద్ద సమం కావడంతో కోర్టులో వేడి పెరిగింది. ఇద్దరు ఆటగాళ్లు ప్రతి ఒక్క పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. చివరకు స్కోరు 20-20 కి చేరిన వేళ, తన్వీ శర్మ అద్భుతమైన టైమింగ్‌తో రెండు పవర్‌ఫుల్ స్మాష్‌లను సంధించి 22-20 తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మరోవైపు ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం ఘన విజయాన్ని అందుకుంది. పెరూ దేశానికి చెందిన ఇనెస్ లూసియా కాస్టిలోపై 21-13, 21-11 స్కోరుతో పీవీ సింధు ఏకపక్షంగా విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి తన్యా హేమంత్ సైతం అమెరికా ప్లేయర్ ఇషికా జైస్వాల్‌పై 21-17, 21-18 తో వరుస గేముల్లో విజయం సాధించింది. అలాగే మాళవిక బన్సోద్ కూడా థాయ్‌లాండ్‌కు చెందిన టోన్‌రుంగ్ సెహాంగ్‌పై 15-21, 21-7, 21-13 తో తొలి గేమ్ ఓడిపోయినప్పటికీ ఘనంగా పుంజుకుని మ్యాచ్ గెలిచింది. భారత్‌కు చెందిన ఇషారాణి 22-20, 10-21, 21-14 తో చైనా క్రీడాకారిణి హన్ జియాన్ జిపై విజయాన్ని సాధించింది. అయితే ఆకర్షి కశ్యప్ మాత్రం మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్ చేతిలో 19-21, 21-19, 20-22 తో తీవ్రంగా శ్రమించినప్పటికీ ఓటమి పాలవడం అభిమానులను నిరాశపరిచింది.

Publish Date: Jun 11, 2026 11:45AM

political-news-img

వైభవ్ సూర్యవంశీ నిర్లక్ష్యం.. మరోసారి హాఫ్ సెంచరీ మిస్!

భారత క్రికెట్ ప్రపంచంలో సంచలన ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. మైదానంలోకి దిగితే చాలు పరుగుల వరద పారించే ఈ యువ కిరటం, అద్భుతమైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో మళ్లీ విఫలమయ్యాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ట్రై-సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-A జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వైభవ్ ఆడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, భారత్-A తరఫున ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మరియు వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చారు. ఇద్దరూ మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన సహజసిద్ధమైన దూకుడు శైలితో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. అఫ్గాన్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ కేవలం 22 బంతుల్లోనే ఏకంగా 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 200గా నమోదు కావడం విశేషం. బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కేవలం కొన్ని నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ మార్కుకు చేరువైన వైభవ్, క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ ఆశించారు. కానీ, అంతలోనే పాత తప్పునే పునరావృతం చేస్తూ అనవసరమైన మరియు బాధ్యతారాహిత్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మ్యాచ్ 7.1వ ఓవర్‌కు చేరుకున్న సమయంలో, అఫ్గానిస్థాన్ యువ బౌలర్ అబ్దొల్లా అహ్మద్‌జాయ్ ఒక అద్భుతమైన షార్ట్ బాల్ వేశాడు. ఆ బంతిని వికెట్ కీపర్ తల మీదుగా ర్యాంప్ షాట్ ఆడి బౌండరీ తరలించాలని వైభవ్ ప్రయత్నించాడు. అయితే, బంతి వేగాన్ని, దిశను సరిగ్గా అంచనా వేయడంలో వైభవ్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాట్‌కు స్వల్పంగా తగిలిన బంతి నేరుగా వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్ చేతుల్లోకి వెళ్ళింది. దీనితో కేవలం 44 పరుగుల వద్దే వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌ కు ఊహించని విధంగా ఎండ్ కార్డ్ పడింది. మంచి ఫామ్‌లో ఉండి, అర్థశతకానికి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇలాంటి నిర్లక్ష్యపు షాట్ ఆడటంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. క్రీజులో కుదురుకున్న తర్వాత కూడా వికెట్ విలువను గుర్తించకపోవడం, వరుసగా భారీ స్కోర్లను చేజార్చుకోవడం వైభవ్‌కు ఒక పెద్ద మైనస్‌గా మారుతోంది. అయితే, అతడు ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత్-A జట్టుకు అద్భుతమైన పవర్‌ప్లే లభించింది. వైభవ్ అవుట్ అయ్యే సమయానికి భారత్-A జట్టు 7.2 ఓవర్లలో 74 పరుగుల బలమైన స్కోరు సాధించింది. ఒకవైపు వైభవ్ అవుట్ అయినా, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 28 పరుగులతో క్రీజులో నిలకడగా ఆడుతూ జట్టును ముందుకు నడిపించాడు. వైభవ్ తన ప్రతిభకు తగ్గట్టుగా బాధ్యతాయుతమైన ఆట తీరును అలవర్చుకుంటే భవిష్యత్తులో తిరుగులేని ఆటగాడిగా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Publish Date: Jun 11, 2026 11:21AM

political-news-img

హెర్మూజ్ జలసంధి మూసివేత.. ప్రపంచ దేశాలకు ఇరాన్ షాక్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా దాడులకు నిరసనగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ జలసంధి గుండా ఏ నౌకా ప్రయాణించడానికి వీల్లేదనీ, ఒకవేళ ఈ జలసంధి గుండా ప్రయాణానికి ఏ నౌక ప్రయత్నించినా.. తమ సైన్యం దాడి చేస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) హెచ్చరించింది. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది. కాగా బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేశ్మ్, హెంగామ్ ఐలాండ్స్ పరిసరాల్లోని కనీసం ఏడు తీర ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా బలగాలు, ఇరాన్ నావికా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు గల్ఫ్ ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక అమెరికన్ ఎఫ్-16ఫైటర్ జెట్‌పైకి క్షిపణిని ప్రయోగించి, దానిని వెనక్కి మళ్లించాయి. అదలా ఉంటే.. హెర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 30 శాతం ఈ జలసంధి గుండానే సాగుతుంది. గతంలో సంక్షోభం ప్రారంభమైన రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు ఏకంగా 126 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం ఉంది.

Publish Date: Jun 11, 2026 10:57AM

political-news-img

ఇథనాల్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే సరికొత్త ఇంధన రకాలపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా లీటర్ పెట్రోల్‌పై పడే ఎక్సైజ్ సుంకం భారం తగ్గడం వల్ల, రాబోయే రోజుల్లో ఈ ఇంధనాలు వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం అత్యధికంగా ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ అంతర్జాతీయ దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడం.. అదే సమయంలో దేశీయంగా వ్యవసాయ ఆధారిత వనరుల నుండి ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఇథనాల్ వినియోగాన్నిపెంచడం ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. దీనివల్ల దేశీయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే రైతాంగానికి, పరిశ్రమలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. నిజానికి.. ఈ పన్ను మినహాయింపు ప్రకటనకు కొన్ని రోజుల ముందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ మిశ్రమాలకు సంబంధించిన సరికొత్త నాణ్యతా ప్రమాణాలను విడుదల చేసింది. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉండాలి, ఆక్టేన్ రేటింగ్ ఏ స్థాయిలో నిర్వహించాలి, సల్ఫర్ పరిమితులు ఎంతవరకు ఉండాలి అనే సాంకేతిక, భద్రతాపరమైన కఠిన నిబంధనలను ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు తాజాగా కేంద్రం ఎక్సైజ్ సుంకం మినహాయింపు కూడా ఇవ్వడంతో, ఈ సరికొత్త ఇంధన రకాల తయారీకి, మార్కెటింగ్‌కు అవసరమైన పూర్తి సాంకేతిక, ఆర్థిక మద్దతు లభించినట్లయింది.

Publish Date: Jun 11, 2026 10:10AM

political-news-img

బ్రిటన్, సింగపూర్ లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు.. అంబరాన్నంటిన సంబరాలు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ క్రేజ్ తెలుగురాష్ట్రాలు, ఇండియా ఎల్లలు దాటి పోయింది. ఆయనకు ఉన్న గ్లోబల్ రేంజ్ అని మరోసారి రుజువైంది. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బ్రిటన్, సింగపూర్ లో జరిగిన భారీ ఈవెంట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. బ్రిటన్ లోని లెస్టర్ నగరంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమైభారీ కార్ ర్యాలీతో జరిగాయి. బాలకృష్ణ చిత్రపటాలు, ప్రత్యేక జెండాలతో అలంకరించిన లగ్జరీ కార్లతో లెస్టర్ వీధుల్లో బాలయ్య అభిమానులు నిర్వహించిన ఈ ర్యాలీ అందరినీ విశేషంగా ఆకర్షించింది. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన కల్చరల్ కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక శోభను తెచ్చాయి. అఖండ తాండవం నృత్య ప్రదర్శన హైలైట్ గా నిలిచింది. అలాగే సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కూడా అలరించాయి. ఇదే వేదికపై నందమూరి బాలకృష్ణకు అంకితమిస్తూ అభిమానులు స్వయంగా రూపొందించిన ఒక ప్రత్యేక గీతాన్ని విడుదలచేశారు. మరోవైపు సింగపూర్‌లో సైతం బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీమ్ జై బాలయ్య సింగపూర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బాలకృష్ణ నటించిన 100కు పైగా సినిమాల సినీ ప్రస్థానాన్ని, వైవిధ్యాన్ని గుర్తుచేసేలా ప్రత్యేక ఆడియో విజువల్స్, ప్రదర్శనలను చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీమతి తేజస్వి పొడపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ కేవలం వెండితెరపైనే కాకుండా, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ నిజమైన జన హృదయ నేతగా ఎదిగారని కొనియాడారు. విదేశీ గడ్డపై ఉంటూ కూడా మాతృభూమిని, తమ అభిమాన హీరో సామాజిక సేవలను గుర్తుంచుకుని ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు.

Publish Date: Jun 11, 2026 9:55AM

political-news-img

మంత్రి లోకేష్ ఓఎస్పీడీ రెండు స్వర్ణ పతకాలు.. ఎందుకంటే?

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ.. విద్యారంగంలో చూపిన ప్రతిభకు గాను రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పని చేస్తున్న డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు గాను ఈ ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాలను సాధించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకల్లో డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కు ఈ గౌరవం దక్కింది. ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క సమాజానికి ఉపయోగపడే ఆర్థిక పరిశోధనలు చేసి ప్రతిభను చాటుకున్న ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన 63 నుంచి 68 ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ ఈ స్వర్ణ పతకాలను అందుకున్నారు. విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్' లభించాయి. ఒకే వేదికపై డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ రెండు ప్రతిష్టాత్మక పతకాలను అందుకోవడం విశేషం. డాక్టర్ వరప్రసాద్ ఎంచుకున్న పరిశోధనా అంశం ప్రస్తుత ఆధునిక నగరాల అభివృద్ధికి ఎంతో కీలకం. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ ఎలా చేయవచ్చు అన్న అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ ఆర్థిక విధానాన్ని అటు ప్రభుత్వాలకు భారం కాకుండా, ఇటు పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఎలా మార్చవచ్చో ఆయన తన పీహెచ్ డి సిద్ధాంత గ్రంథంలో విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి, పట్టణాల రూపురేఖలు మార్చడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. డాక్టర్ కాశిరెడ్డి వరప్రసాద్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, ప్రభుత్వ పాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా సేవలు అందిస్తూనే.. డిప్యూటేషన్‌పై మంత్రి నారా లోకేష్ వద్ద ఓఎస్డీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన ఆర్థిక గణాంకాలపై మీడియాలో వచ్చిన కొన్ని కథనాల నేపథ్యంలో ఆయనపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. సస్పెన్షన్ కు కూడా గురయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఐటీ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా రాణిస్తూ, విద్యారంగంలోనూ గోల్డ్ మెడల్స్ సాధించి తన సత్తా చాటారు.

Publish Date: Jun 11, 2026 9:40AM

MOVIE NEWS