political-news-img

తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా.. వచ్చే మూడు రోజుల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం (30-4-26) దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా.. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా పిడుగులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో గంటకు 50- 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. బుధవారం నాటి ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. అంతర్గత మహారాష్ట్ర సహా దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

Publish Date: Apr 30, 2026 7:40PM

political-news-img

ఏపీ ఆరోగ్య శాఖ సంచలనం...గ్రామస్థాయిలోనే 47 రకాల వైద్య పరీక్షలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, ముందస్తుగానే వాటిని గుర్తించి నివారించాలనే లక్ష్యంతో ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఏకంగా 47 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 57 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.163 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు 904 మొబైల్ మెడికల్ యూనిట్లను (104 వాహనాలు) వినియోగించనున్నారు. ప్రతి వాహనం రోజుకు కనీసం 20 మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. గతంలో 104 వాహనాల ద్వారా కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, తాజా నిర్ణయంతో ఈ వాహనాల్లో అత్యాధునిక 'సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ', 'సీబీసీ ఎనలైజర్' వంటి పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల లివర్ ఫంక్షన్, కిడ్నీ పనితీరు, లిపిడ్ ప్రొఫైల్ వంటి 11 విభాగాలకు చెందిన 47 రకాల కీలక పరీక్షలు ఇకపై సామాన్యులకు చేరువకానున్నాయి. ఈ పథకం ద్వారా కేవలం పరీక్షలు నిర్వహించడమే కాకుండా, ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేక 'ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు' (EHR)ను రూపొందించనున్నారు. 'సంజీవని' పథకం కింద ఈ డేటాను భద్రపరిచి, భవిష్యత్తులో సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా త్వరితగతిన వైద్యం అందించేందుకు ఈ రికార్డులు దిక్సూచిగా మారనున్నాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్ర హెల్త్ ప్రొఫైల్ తయారీకి దోహదపడుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను ప్రభుత్వమే ఉచితంగా, అది కూడా ఇంటి వద్దకే వచ్చి నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే ఇబ్బందులు ఈ పథకంతో తప్పుతాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు నెలల్లోనే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి, పరికరాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ విప్లవాత్మక మార్పు ఏపీ ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ పథకం అమలు తీరును బట్టి మరిన్ని పరీక్షలను జోడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పరీక్షలు నిర్వహిస్తే, రాష్ట్రంలో అంటువ్యాధులు మరియు జీవనశైలి వ్యాధుల మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Publish Date: Apr 30, 2026 6:46PM

political-news-img

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. చైనా మైండ్ బ్లాక్!

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో విస్తారంగా ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ (ఆర్ఈఈ) నిల్వలను వెలికితీయడం ద్వారా, ఈ రంగంలో చైనాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని భారత్ సవాల్ చేయగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న దాదాపు 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంలోని ఇసుక తిన్నెల్లో మోనజైట్, ఇల్మెనైట్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. వీటి ద్వారా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్రీన్ ఎనర్జీ విప్లవానికీ, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి వెన్నెముక వంటివి. ఈ సంపదను వెలికితీసే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్‌లో నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనాకు ప్రస్తుతం ప్రపంచ రేర్ ఎర్త్ మార్కెట్‌లో 80 శాతానికి పైగా వాటా ఉంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా అమెరికా, యూరప్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఉన్న నిక్షేపాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐఆర్ఈఎల్ వంటి విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏపీలో నెలకొల్పాలని సీఎం యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా, వ్యూహాత్మకమైనది కూడా. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల భారత్ రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. అంతే కాకుండా, ఈ ఖనిజాల వెలికితీత, శుద్ధి ప్రక్రియ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ తీర ప్రాంతాన్ని 'మినరల్ హబ్'గా మార్చేందుకు అవసరమైన కొత్త మైనింగ్ పాలసీని కూడా ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉంది. చైనాకు ధీటుగా ఎదగాలంటే ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయడం మాత్రమే కాకుండా, వాటిని తుది ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలను ఇక్కడే నెలకొల్పాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ విజయవంతమైతే, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో భారత్ ఒక కీలక శక్తిగా అవతరించడం ఖాయం.

Publish Date: Apr 30, 2026 6:30PM

political-news-img

కన్నీళ్లు పెట్టించే కథ…సెల్ఫీ వీడియోతో ముగిసిన జీవితం!

మరిదితో కాపురం చేయాలని భర్త, అత్తమామలు ఒత్తిడి... సెల్ఫీ వీడియో తీసి వివాహిత ఆత్మహత్య.. బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. తన మరణానికి గల కారణాలను వివరిస్తూ, కన్నీళ్లతో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి డ్యామ్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, వరకట్న పిశాచి కోరలకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దొడ్డబళ్లాపుర తాలూకా సోతెనహళ్లికి చెందిన పుష్ప (23)కు ఏడేళ్ల క్రితం తపసీహళ్లికి చెందిన వేణుతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పుష్ప తల్లిదండ్రులు తమ స్తోమతకు తగ్గట్టుగా భారీగానే కట్నకానుకలు సమర్పించారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల అసలు రూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలని ఆమెను శారీరకంగా, మానసికగా హింసించడం మొదలుపెట్టారు. పుష్ప ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో తన ఆవేదననంతా వెళ్లగక్కింది. భర్త వేణు తనను దారుణంగా వేధించడమే కాకుండా, తన సోదరుడు (మరిది)తో కలిసి ఉండాలని ఒత్తిడి చేసేవాడని పేర్కొనడం విస్తుగొలుపుతోంది. మరో వివాహం చేసుకోవాలనే దురాశతో తనను వదిలించుకోవడానికి భర్త యత్నించాడని, ఒకానొక దశలో ఆహారంలో విషం కలిపి తనను చంపే ప్రయత్నం కూడా చేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది. అంతేకాకుండా, పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో కూడా ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన పుష్ప, బెంగళూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య పిక్ అప్ డ్యామ్ వద్దకు చేరుకుని, తన సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసిన అనంతరం నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కట్నం కోసమే కాకుండా, అమానవీయమైన కోరికలతో పుష్పను నరకయాతనకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పుష్ప రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా భర్త వేణును, మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Publish Date: Apr 30, 2026 6:21PM

political-news-img

ఉస్మానియా హాస్పిటల్‌లో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది. ప్రభుత్వ వైద్యరంగంలో అరుదుగా జరిగే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకుంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం.... గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ అనే అరుదైన వ్యాధితో బాధపడు తున్న కేవలం 18 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఈ క్లిష్ట శస్త్రచికిత్స చేపట్టారు. సుమారు పది కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ చిన్నారికి లివర్ మార్పిడి చేయడం వైద్యపరంగా అత్యంత సవాలుతో కూడుకున్న పని. ఈ కథలో భావోద్వేగానికి హద్దులే లేవు. చిన్నారి తండ్రే తన లివర్‌లోని ఒక భాగాన్ని దానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. తండ్రి నుంచి సేకరించిన లివర్ భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిన్నారి శరీరానికి అమర్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యుల అనుభవం కలిసిన ఈ శస్త్రచికిత్స సుమారు 14 గంటల పాటు ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు విజయం సాధించారు...ఈ క్లిష్టమైన చికిత్స మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించడం పేద కుటుంబానికి పెద్ద ఊరటగా మారింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు దేశవ్యాప్తంగా చాలా అరుదని నిపుణులు పేర్కొన్నారు. ఈ అద్భుత విజయంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రపంచస్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ విజయంతో వైద్యుల సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Apr 30, 2026 6:02PM

political-news-img

వైసీపీ అనుకూల సీఐపై అత్యాచారం కేసు!

వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఇంత కాలం సీఐడీలో పనిచేసి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం కేసులో ఇరుక్కోవడం కలకలం రేపుతోంది. మల్లయ్య తన ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి, తనపై అత్యాచారం చేశాడని భాధితురాలు వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన ఒక కుటుంబం కొంతకాలంలో మండలంలోని వేరే గ్రామంలో అద్దెకు ఉంటోంది. అదే గ్రామ వాసి అయిన సీఐ చిన్నమల్లయ్య బుధవారం (29-4-26న) గ్రామానికి వచ్చాడు. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేసిన బాధితురాలికి ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి, సీఐ అకృత్యాన్ని నిర్ధారించారు. వైసీపీ హయాంలో సీఐడీ సీఐగా ఉన్న మల్లయ్య తెలుగుదేశం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నాయకుడిని గన్‌తో బెదిరించాడు. ఇటీవలే కారంపూడికి చెందిన టీడీపీ నేతలను వాట్సప్‌లో బెదిరించాడు. తాజాగా అత్యాచారం కేసులో చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వినుకొండ పోలీసులు తెలిపారు.

Publish Date: Apr 30, 2026 5:32PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img