Top Stories

political-news-img

సోషల్ మీడియా ట్రోలర్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిధిని దాటి ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను కొందరు ఇష్టారాజ్యంగా వాడుకుంటూ సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే అవి నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప వ్యక్తిగత కక్ష సాధింపులుగా మారకూడదని హితవు పలికారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులపై బురదజల్లే ధోరణిని ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా దేవుళ్లు, దేవతలను లక్ష్యంగా చేసుకుని సాగే ఉద్దేశపూర్వక వ్యాఖ్యలను, మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలను రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావించలేమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగడం, మహిళలను సైబర్ వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి కులం, మతం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా సైబర్ దాడులు, వేధింపుల వల్ల ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం కార్యాలయంలోనే ఇందుకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని (సెల్) ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఈ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి, నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా రాజకీయ పగలతో సాగుతున్న ట్రోలింగ్ సంస్కృతికి ఈ ప్రత్యేక విభాగం ద్వారా అడ్డుకట్ట పడుతుందని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై ఆన్‌లైన్ వేధింపులు తగ్గుముఖం పడతాయని, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వాతావరణం ఏర్పడుతుందని పౌర సమాజం భావిస్తోంది.

Publish Date: Jul 1, 2026 9:28PM

political-news-img

ఎంపీ మహువా మెుయిత్రాపై కోడిగుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. కోల్‌కతాలో ఆమె తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఒక ముఖ్యమైన అంతర్గత సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ దాడితో ఒక్కసారిగా స్థానిక రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహువా మొయిత్రా పార్టీ శ్రేణులతో సమావేశమైన భవనాన్ని నిరసనకారులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. భవనం వెలుపల గుమిగూడిన ఆందోళనకారులు ఆమెకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. "దొంగ.. దొంగ.." అంటూ పెద్ద పెట్టున అరుస్తూ, ఆమె ఉన్న భవనంపైకి వరుసగా కోడిగుడ్లను విసిరారు. ఒక్కసారిగా జరిగిన ఈ గందరగోళంతో అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలను, వీడియోను ఎంపి మహువా మొయిత్రా స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల హస్తం ఉందని ఆమె నేరుగా ఆరోపించారు. బీజేపీ గూండాలే ప్రణాళికాబద్ధంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియోలో నిరసనకారులు భవనంపైకి గుడ్లు విసరడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరుపై మహువా మొయిత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనకారులు తనపై దాడులు చేస్తుంటే, అక్కడే ఉన్న పోలీసులు మౌనప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేసినప్పటికీ, ఆందోళనకారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఘాటుగా విమర్శించారు. తన ట్విట్టర్ పోస్ట్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరియు అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖ విపక్ష నాయకులను ఆమె ట్యాగ్ చేశారు. కాగా, మహువా మొయిత్రా చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై మరియు కోడిగుడ్ల దాడి ఘటనపై భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా వివరణ రాలేదు. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త వివాదానికి తెరలేపింది.

Publish Date: Jul 1, 2026 9:17PM

political-news-img

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రూ.34 లక్షల టోకరా

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి యువతిని నమ్మించి శారీరక సంబంధాలు కొనసాగించిన అనంతరం, వ్యాపార విస్తరణ పేరుతో రూ.34 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఎన్. చందు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో పరిచయం పెంచుకుని, వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆ నమ్మకంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం వ్యాపార విస్తరణకు పెట్టుబడి అవసరమని చెప్పి బాధితురాలు, ఆమె తల్లి నుంచి సుమారు రూ.34 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, నిందితుడు ఇప్పటికే మరో మహిళను వివాహం చేసుకున్న విషయం ఇటీవల బాధితురాలికి తెలిసింది. దీనిపై ఆమె ప్రశ్నించగా దుర్భాషలాడటంతో పాటు దాడి చేసి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 30న అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 69, 318(4), 115(2), 351(2) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జూలై 1న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Publish Date: Jul 1, 2026 9:06PM

political-news-img

జమ్మలమడుగులో ఉద్రిక్తత..వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

ఎంతోకాలంగా కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమకు ఈ నెల 3న శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును పరిశీలించేందుకు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన పనుల పురోగతిని పరిశీలించాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ బృందం జమ్మలమడుగుకు చేరుకుంది. అయితే, వైసీపీ కార్యాలయం నుంచి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరిన నాయకులను స్థానిక నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన క్రెడిట్‌ను దక్కించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు ఉందని, పోలీసుల చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jul 1, 2026 8:55PM

political-news-img

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు... భారత్ నుండి వెళ్లేది వీరే!

ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ అంత్యక్రియల వేడుకలు జూలై 9వ తేదీ వరకు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ అంతిమ సంస్కారాలకు ప్రపంచ దేశాల నుండి ప్రముఖులు, దౌత్యవేత్తలు మరియు కోట్ల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. ఇరాన్ ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం.. ఈ అంత్యక్రియల కార్యక్రమాలకు దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది వరకు జనం హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే ఇరాన్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రభుత్వ అంత్యక్రియలుగా రికార్డు సృష్టించనుంది. ఈ చారిత్రాత్మక అంతిమ యాత్రకు ఇరాన్ ప్రభుత్వం తన మిత్ర దేశాలకు ప్రత్యేక ఆహ్వానాలను పంపుతోంది. ఇందులో భాగంగానే భారతదేశానికి కూడా ఇరాన్ నుండి అధికారిక ఆహ్వానం అందింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ప్రస్తుతం ఉన్న అత్యంత బిజీ షెడ్యూల్స్ మరియు ముందస్తు కార్యక్రమాల కారణంగా ప్రధాని మోడీ ఈ అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. ప్రధాని మోడీ వెళ్లలేకపోతున్న నేపథ్యంలో, భారతదేశం తరఫున ఒక ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందాన్ని ఇరాన్ పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారత ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ కూడా భారత ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా ఇరాన్ దేశానికి వెళ్లనున్నారు. విశేషం ఏమిటంటే.. ఇరాన్ ప్రభుత్వం కేవలం భారత ప్రభుత్వానికే కాకుండా, ఇక్కడి అధికార మరియు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు కూడా విడివిడిగా ప్రత్యేక ఆహ్వానాలు పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భారత్ లోని బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నాయకులను ఇరాన్ ఆహ్వానించింది. అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే భారత మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ విదేశాంగ విభాగం చైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ లకు ఇరాన్ నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం లభించింది. అయితే ఈ అంత్యక్రియలకు తాము స్వయంగా హాజరవ్వాలా లేదా అనే విషయంపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రతినిధి బృందంలో ఎవరు పాల్గొనాలనే అంశంపై ఆ పార్టీ అధిష్టానం త్వరలోనే ఒక స్పష్టత ఇవ్వనుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ అంత్యక్రియల కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమేనీ భౌతికకాయాన్ని మొదటగా అక్కడి ప్రసిద్ధ గ్రాండ్ మొసల్లాలో ప్రజల మరియు ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత ఇరాన్ లోని పలు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున అంతిమయాత్రను నిర్వహించనున్నారు. విదేశాల నుండి వచ్చే విఐపిలు మరియు ప్రతినిధుల కోసం ఇరాన్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసింది. దాదాపు 30 దేశాలకు చెందిన ప్రముఖ ప్రతినిధులు ఈ అంతిమ వీడ్కోలు సభకు హాజరవుతారని అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయా దేశాల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇరాన్.. యూరోపియన్ దేశాలకు మాత్రం ఎలాంటి ఆహ్వానాలు పంపలేదని ఖచ్చితంగా స్పష్టం చేసింది. టెహ్రాన్‌లో ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాక్‌లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు అయిన నజఫ్ మరియు కర్బలా ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం, చివరగా జూలై 9వ తేదీన మష్హద్‌లోని ప్రసిద్ధ ఇమామ్ రేజా దర్గాలో ఖమేనీ పార్థివ దేహాన్ని అధికారిక లాంఛనాలతో ఖననం చేయనున్నారు.

Publish Date: Jul 1, 2026 8:46PM

political-news-img

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలుగువన్ పుట్టింది : కంఠమనేని రవిశంకర్

ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 104వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగువన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, దశరథ్ జనార్ధన్‌కు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగు సమాజంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేశారు. తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్న రవిశంకర్, 1983కు ముందు ఉత్తర భారతదేశంలోని నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో, తెలుగు వారిని ప్రత్యేక గుర్తింపుతో చూడకుండా దక్షిణాది ప్రజలందరినీ కలిపి "మద్రాసీలు" అని పిలిచేవారని పేర్కొన్నారు. అయితే 1983లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి, తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అప్పటి నుంచి తెలుగువారు తమ భాష, సంస్కృతి, అస్తిత్వంపై గర్వపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్టీఆర్ అందించిన అదే స్ఫూర్తితో డిజిటల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందకముందే 'తెలుగువన్' సంస్థను స్థాపించినట్లు రవిశంకర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే సంకల్పంతో, తెలుగువాడు ఎల్లప్పుడూ "ఒకటో స్థానం"లో ఉండాలనే లక్ష్యంతో 'తెలుగువన్' అనే పేరును ఎంపిక చేసినట్లు వివరించారు. భాష, సంస్కృతి, ప్రాంతీయ అస్తిత్వాన్ని డిజిటల్ మరియు వెబ్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం కూడా ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పురస్కార గ్రహీత దశరథ్ జనార్ధన్ సేవలను రవిశంకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్టీఆర్ మరణించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచినా ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు, శతజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు జనార్ధన్ విశేష కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు లబ్ధి పొందిన తర్వాత తమకు అవకాశమిచ్చిన నాయకులను మరచిపోతారని, కానీ ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం దశరథ్ జనార్ధన్ ప్రత్యేకత అని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాద ధోరణులు పెరుగుతున్న సమయంలో విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన కృషి ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రసంగంలో అత్యంత ప్రాధాన్యంగా ప్రస్తావించిన అంశం నేటి యువతరం, ముఖ్యంగా జెన్-జీకి ఎన్టీఆర్ సిద్ధాంతాలను చేరవేయాల్సిన అవసరమని రవిశంకర్ పేర్కొన్నారు. మహానటుడిగా, ప్రజానాయకుడిగా, "అన్నగారు"గా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ ఆత్మగౌరవ భావజాలం తరాలు మారినా సజీవంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని రవిశంకర్ స్పష్టం చేశారు. ఆయన అందించిన స్ఫూర్తితోనే తెలుగు భాష, సంస్కృతి నేడు డిజిటల్ ప్రపంచంలోనూ విశిష్ట స్థానం సంపాదించుకుంటోందని అన్నారు.

Publish Date: Jul 1, 2026 7:32PM

MOVIE NEWS