Top Stories

dummy

political-news-img

వార్ ఎఫెక్ట్.. ఏయే దేశాలకు ఎంతెంత?

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఏ ఒక్క దేశమో కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేర్వేరు స్థాయిల్లో నష్టపోతున్నాయి. అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో చూస్తే.. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి. యుద్ధం వల్ల దేశంలో ఇప్పటికే ఉన్న నిరసనలు, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆ తర్వాత భారీగా నష్టపోతున్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్ల వల్ల ఇజ్రాయెల్ నగరాల్లో.. భారీ ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇక్కడ తామెంత నరకం అనుభవిస్తున్నామో తమకే తెలుసంటున్నారు ఇజ్రాయెలీలు. నిరంతరం సైరన్లు, బంకర్లలో గడపాల్సి రావడం వల్ల.. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రక్షణ వ్యవస్థలు మరీ ముఖ్యంగా.. ఐరన్ డ్రోమ్ వంటి వాటి నిర్వహణకు, యుద్ధానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇతర దేశాల పరిస్థితి ఏంటో చూస్తే.. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా.. ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్- స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20శాతం నిలిచిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటాయి. ఇక ఆసియా దేశాలపై పడుతున్న భారం ఎలాంటిదో చూస్తే.. చమురు దిగుమతుల కోసం మధ్య ప్రాచ్యంపై ఆధారపడే.. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా తగ్గడంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. అమెరికా తన సైనిక శక్తిని వాడటంతో పాటు, తన యుద్ధ విమానాలను- కోల్పోవడం, సైనిక ఖర్చులు పెరగడం వంటి నష్టాలను ఎదుర్కొంటోంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల పరంగా నేరుగా నష్టపోతుంటే, మిగిలిన ప్రపంచ దేశాలు పెరిగిన చమురు ధరలు, ఆర్థిక మాంద్యం భయంతో పరోక్షంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. మొత్తంగా ఏయే దేశాలకు అంకెల్లో చూపితే ఎంతెంత ఆర్ధిక భారం పడుతోంది.. మరీ ముఖ్యంగా ఇరాన్ ఖర్చు ఎంత? ఇజ్రాయెల్ ఎంత? అమెరికా ఎంత? అని పరిశీలిస్తే.. 2026 ఏప్రిల్ నాటి తాజా అంచనాల ప్రకారం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జరిగిన ఆర్థిక నష్టాలు భయానకంగా కనిపిస్తున్నాయి. కేవలం యుద్ధం చేస్తున్న దేశాలే కాకుండా, ప్రపంచం మొత్తం దీని భారాన్ని మోస్తోంది. మరీ ముఖ్యంగా.. అమెరికా అయితే ఈ యుద్ధం కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తోంది. రోజువారీగా యుద్ధ కార్యకలాపాల కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెబితే సుమారు రూ. 16 వేల 600 కోట్లు ఖర్చవుతోందని చెబుతున్నాయి నివేదికలు. యుద్ధం మొదలైన మొదటి 12 రోజుల్లోనే అమెరికా 16.5 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఏప్రిల్ మొదటి వారం నాటికిది పాతిక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో చెబితే సుమారు రూ. 2.1 లక్షల కోట్లుగా ఉంది. యుద్ధం వల్ల ఏర్పడిన ఆయుధాల కొరతను తీర్చడానికి అమెరికా- 2027 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి భారీగా ఖర్చు చేస్తోంది. 2026 సంవత్సరానికి ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్‌ 34.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఇజ్రాయెల్ షెకెల్స్ లో చెబితే.. సుమారు 112 బిలియన్ షెకెల్స్ గా తెలుస్తోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టడానికి వాడే ఐరన్ డోమ్, ఆరో వ్యవస్థల కోసం ఒక్కో రాత్రికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. యుద్ధం వల్ల టూరిజం, టెక్నాలజీ రంగాలు బాగా దెబ్బతిని దేశ జీడీపీ వృద్ధి గణనీయంగా తగ్గింది. ఈ మొత్తం యుద్ధంలో ఇరాన్ అసలైన బాధిత దేశం. ఇరాన్ తన మౌలిక సదుపాయాలను కోల్పోవడంతో పాటు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ రియాల్ విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం 40శాతం పైగా ఉందని ముందే చెప్పుకున్నాం. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. వీటిని తిరిగి నిర్మించడానికి వందల బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు కొన్ని వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది ఇరాన్. భారత్ వంటి ఇతర దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉందో చూస్తే, ఇది పైకి తెలీదు. కానీ, లోలోన కార్చిచ్చులా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తుందనే చెప్పాలి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో 11శాతం అంటే, రోజుకు 1.1 కోట్ల బారెల్స్ కొరత ఏర్పడింది. గత నెలలోనే పెట్రోల్ ధరలు సుమారు 10 శాతం, డీజిల్ ధరలు 20 శాతం పెరిగాయి. ప్రపంచ ఎరువుల సరఫరాలో 12 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగి భారత్ వంటి వ్యవసాయ దేశాలపై భారం పడుతోంది. ఈ గణాంకాలు ప్రస్తుత యుద్ధ తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 0.3 శాతం నుండి 1శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది.

Publish Date: Apr 4, 2026 4:45PM

political-news-img

మాతో ఆడండి ప్లీజ్ .. బీసీసీఐకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్‌‌కు మధ్య దూరం పెరిగింది. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్‌తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ 20 ప్రపంచకప్‌నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది. ఐపీఎల్‌‌లో కూడా బంగ్లా జట్టు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వైఖరి మారింది. బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం. అలాగే షెడ్యూల్ ప్రకారం భారత్‌కు మా జట్టు వెళ్లాల్సి ఉంది' అని అబేదిన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది . ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 6,7 తేదీలలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సహకారంపై కూడా మాట్లాడబోతున్నట్టు సమాచారం.

Publish Date: Apr 4, 2026 4:32PM

political-news-img

నెల్లూరు నేతలను గాడిన పెడుతున్న చంద్రబాబు!

- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది - మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి - ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు - సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు - దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు. కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి? జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు. ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం. పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్‌సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది. వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి. దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. జమీన్ రైతు సౌజన్యంతో

Publish Date: Apr 4, 2026 4:18PM

political-news-img

అమెరికా నిష్క్రమణ బెదిరింపు ప్రపంచ శక్తిని ఎలా పునర్నిర్మించగలదు.. భారత్‌కు ఎలా ఊతం ఇవ్వగలదు?

ట్రంప్ నాటో షాక్.. అమెరికా నిష్క్రమణ బెదిరింపు ప్రపంచ శక్తిని ఎలా పునర్నిర్మించగలదు.. భారత్‌కు ఎలా ఊతం ఇవ్వగలదు? తేజస్ ఎమ్ కే-1ఏ ఇంజిన్ల సరఫరాలో జాప్యానికి గాను జీఈ ఏరోస్పేస్‌పై హెచ్‌ఏఎల్ నష్టపరిహారం విధించింది. ముందే ఊహించిన ద్రోహం.. 716 మిలియన్ డాలర్ల 2021 కాంట్రాక్టు కింద ఆలస్యమైన ప్రతి ఇంజిన్‌కు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లిక్విడేటెడ్ డామేజెస్ క్లాజ్‌ను (సాధారణంగా కాంట్రాక్టు విలువలో 10% వరకు వర్తింపజేస్తోంది. భారత్ రక్షణ ఎగుమతుల జోరు! ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 4 బిలియన్ డాలర్లను ఆర్జించింది: - 2025-26: 38424 కోట్లు - 2024-25: 23622 కోట్లు - 2023-24: 21083 కోట్లు -2022-23: 15918 కోట్లు -2021-22: 13000 కోట్లు - 2018-19: 10745 కోట్లు - 2017-18: 4682 కోట్లు - 2016-17: 1521 కోట్లు - 2015-16: 2059 కోట్లు - 2014-15: 1940 కోట్లు భారత్ ముందుకు సాగుతోంది ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా మారడం. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. * అమెరికాపై ఆధారపడటాన్ని పునఃసమీక్షిస్తున్న ఐరోపా, కొత్త రక్షణ భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది. ఐరోపా యూనియన్‌తో భారతదేశం ఇటీవల కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం, ఈ విషయంలో దానికి సరైన స్థానాన్ని కల్పిస్తుంది. ఈ సహకారం సహ-అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ప్రపంచ వ్యవస్థ ఇప్పటికే బహుధ్రువత్వం వైపు మళ్లుతున్న తరుణంలో, నాటో బలహీనపడే అవకాశం ఉంది. విచ్ఛిన్నమైన కూటమి వ్యవస్థ ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుంది. - ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (నాటో) నుండి అమెరికాను ఉపసంహరించుకోవడాన్ని తాను "ఖచ్చితంగా" పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజధానులలో ఆందోళనను రేకెత్తించాయి. - ఇరాన్ వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మరియు ఐరోపా మిత్రదేశాల నుండి తగినంత మద్దతు లభించడం లేదని వాషింగ్టన్ భావిస్తున్న అసంతృప్తి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. - ట్రంప్ రాజకీయ ప్రసంగాలలో నాటోకు ముప్పు వాటిల్లడం కొత్తేమీ కానప్పటికీ, ఈ ప్రకటన యొక్క సమయం మరియు తీవ్రత, ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సైనిక కూటములలో ఒకదానిలో సంభావ్య చీలిక గురించి ఆందోళనలను పెంచాయి. -1949లో ఏర్పడినప్పటి నుండి, నాటో పాశ్చాత్య సైనిక సహకారానికి వెన్నెముకగా ఉంది. ఇది ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలను ఒక ఉమ్మడి రక్షణ చట్రం కింద బంధిస్తుంది, ఇక్కడ ఒక దేశంపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తారు. - ఈ కూటమికి అమెరికా కేంద్ర స్తంభం. ఇది అణ్వస్త్ర నిరోధక శక్తి, లాజిస్టిక్స్, గూఢచార సమాచారం మరియు నిధులతో సహా నాటో యొక్క సైనిక సామర్థ్యాలలో అధిక భాగాన్ని అందిస్తుంది. - భారతదేశానికి, ఈ మారుతున్న పరిసరాలు అవకాశంతో పాటు సంక్లిష్టతను కూడా అందిస్తున్నాయి. - బహుళ ప్రయోజనాలున్న ప్రపంచంలో అధికారం మరియు కూటములు అస్థిరంగా, సమస్యల ఆధారంగా ఉంటాయి. దేశాలు కఠినమైన కూటములకు దూరంగా ఉండి, తమ ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను సమతుల్యం చేసుకుంటూ, సరళమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. - అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం చాలా కాలంగా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని పాటిస్తోంది. - ఇది ఏ సైనిక కూటమికి అధికారికంగా కట్టుబడి ఉండకుండానే, అమెరికా, యూరప్, రష్యాలతో సహా పలు ప్రపంచ శక్తులతో సంబంధాలను కొనసాగిస్తోంది. - విచ్ఛిన్నమైన ప్రపంచంలో, ఈ వైఖరి ఒక ముఖ్యమైన ప్రయోజనంగా మారగలదు. - ట్రంప్ తాజా వ్యాఖ్యలకు ముందే, యూరోపియన్ దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచడం మరియు కొనుగోళ్లపై పునరాలోచన చేయడం ప్రారంభించాయి. - ఉక్రెయిన్‌లో యుద్ధం మరియు విస్తృత భౌగోళిక రాజకీయ అస్థిరత ఇప్పటికే మితిమీరిన ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలను బహిర్గతం చేశాయి. - అమెరికా పాత్ర తగ్గడం ఈ మార్పును తీవ్రతరం చేస్తుంది, తద్వారా యూరప్ వేగంగా మరియు పెద్ద ఎత్తున స్వతంత్ర సామర్థ్యాలను నిర్మించుకునేలా చేస్తుంది. - ఈ పరివర్తన కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, లోతైన రాజకీయపరమైనది కూడా. విశ్వసనీయత లేదా పొత్తుపై రాజీ పడకుండా యూరప్ సరఫరాదారులను వైవిధ్యపరచాలి. - అధునాతన సామర్థ్యాన్ని మరియు భౌగోళిక రాజకీయ స్థిరత్వాన్ని రెండింటినీ అందించగల భాగస్వాములను కనుగొనడంలోనే అసలు సవాలు ఉంది. సమయమే సర్వస్వం. భారతదేశం తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో యూరప్ బయటి వైపు చూస్తోంది: భారతదేశానికి, ఉద్భవిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎంత వేగంగా తనను తాను సిద్ధం చేసుకోగలదనే దానిపై దృష్టి ఉంటుంది. దీనిలో రక్షణ తయారీని పెంచడం, ఎగుమతి సామర్థ్యాలను బలోపేతం చేయడం మరియు సంక్లిష్టమైన దౌత్యపరమైన పరిస్థితులను ఎదుర్కోవడం వంటివి ఉన్నాయి. సేకరణ.. కంఠంనేని సీతారాం

Publish Date: Apr 4, 2026 4:02PM

political-news-img

మావి‘గన్’ పేలదు.. డీవీ శ్రీనివాస్ విశ్లేషణ

తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం కేంద్ర బిందువుగా మారింది. పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మావిగన్ కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ డి.వి. శ్రీనివాస్ విశ్లేషణ ప్రకారం, జగన్ వ్యూహం వెనుక కేవలం రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల సమస్యలను విస్మరించిన జగన్.. ఇప్పుడు అకస్మాత్తుగా శేషగిరమ్మ వంటి వృద్ధులను కలవడం విమర్శలకు తావిస్తోంది. జగన్ అకస్మాత్తుగా రైతుల పక్షపాతిగా మారడం వెనుక ఒక వ్యూహం ఉందని సీనియర్ జర్నలిస్ట్ డీవీశ్రీనివాస్ అంటున్నారు. అమరావతి ప్రాంతంలో కోల్పోయిన ఓటు బ్యాంకును, కనీసం ఈ మావిగన్ ప్రాంతంలోని పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే.. గతంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరని, మరచిపోరనీ డీవీ శ్రీనివాస్ చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడమే వైసీపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారాయన. అమెరికాలో ఒక పోలీసు అధికారి బూటు కాలితో తొక్కడం ఎలాగైతే ఒక ప్రభుత్వం పతనానికి దారితీసిందో, ఏపీలో కూడా రైతు కుటుంబాల పట్ల జరిగిన దుశ్చర్యలే గత ఎన్నికలలో జగన్ ఓటమికి ప్రధాన కారణమని గుర్తు చేసిన డీవీ శ్రీనివాస్.. ఇప్పుడు మావిగన్ పేరుతో ముందుకు రావడం అనేది కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, వాస్తవిక అభివృద్ధికి సంబంధించినది కాదని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం వేగవంతమైతే, జగన్ ప్రతిపాదించిన మావిగన్ మంత్రం ఫలించే అవకాశమే లేదన్నారాయన. ప్రభుత్వం మానవీయ కోణంలో రైతుల సమస్యలను పరిష్కరిస్తే.. జగన్ ఆరోపణలకు బలం ఉండదు. ఒకవేళ వైసీపీ తన మొండి వైఖరిని వీడకుండా, కేవలం విమర్శలకే పరిమితమైతే, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో కూడా ఆ పార్టీకి ఉన్న అంతంత మాత్రం పట్టు కూడా సడిలిపోతుందని అన్నారు డీవీ శ్రీనివాస్. రాబోయే ఎన్నికల నాటికి అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని చెప్పారు.

Publish Date: Apr 4, 2026 3:34PM

political-news-img

డెటా సెంటర్లే లక్ష్యం.. ఇరాన్ కొత్త యుద్ధ వ్యూహం.. బెంబేలెత్తుతున్న ప్రపంచదేశాలు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశం ఉద్దేశపూర్వకంగా ఇతర దేశాల్లోని వాణిజ్య డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అన్నది తొలిసారిగా కనిపిస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లో అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న ప్రాంతాలను టార్గెట్ చేసి దెబ్బతీయడం ద్వారా తన పట్టును నిలుపుకోవడమే కాకుండా, అమెరికాను ఢిఫెన్స్ లో పడేసి తన పట్టు నిలుపుకోవాలని ఇరాన్ భావిస్తున్నది. గతంలో డేటా సెంటర్లు కేవలం హ్యాకింగ్ లేదా సైబర్ దాడులకు మాత్రమే పరిమితం అయ్యేవి.. అయితే ఇప్పుడు ఇరాన్ వాటిని దాడులతో నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందనిపిస్తున్నది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కీలకంగా మారింది. అమెరికా తన దాడులను పక్కాగా అమలు చేయడానికి, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఈ ఏఐ టెక్నాలజీనే వాడుతోంది. ఆ సాంకేతికతకు వెన్నుదన్నుగా, వెన్నెముకగా నిలుస్తున్న డేటా సెంటర్లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తే అమెరికా రక్షణ వ్యవస్థ బలహీనపడుతుందన్నది ఇరాన్ ఉద్దేశంగా, వ్యూహంగా కనిపిస్తున్నది. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాలు ప్రపంచ టెక్నాలజీ హబ్‌లుగా మారుతున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. అయితే, ఇరాన్ దాడులు వాటికి పెను ముప్పుగా పరిణమించాయి. తమ దేశాలపై దాడులకు ఈ కేంద్రాల నుంచే సమాచారం అందుతోందని ఇరాన్ ఆరోపిస్తూ డేటా సెంటర్లను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల రక్షణ గల్ఫ్ దేశాలకు, అమెరికాకు, ఇంటర్నేషనల్ టెక్ కంపెనీలకు పెను సవాలుగా పరిణమించింది. ఎందుకంటే ఇరాన్ వీటిపై దాడులు కొనసాగిస్తూ పోతే.. ప్రపంచ డిజి టల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పెనుముప్పు ఉంది.

Publish Date: Apr 4, 2026 2:14PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img