చిరుకు కాదు, తనలాంటి వారికే రాజ్యసభ.. జగన్కు వైవీ సుబ్బారెడ్డి ఝలక్..
posted on Jan 17, 2022 4:31PM
రాజకీయాలలో బంధాలు, బంధుత్వాలు పనిచేయవని అనలేము, కానీ, అన్ని సమయాలలో బంధుత్వం, రక్త సంబంధం రాజకీయంగా కలిసి వస్తుందని అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వభావం అందుకు పూర్తి విరుద్ధం. అది అందరికీ తెలిసిన నిజం.. అంటారు. బంధుత్వం అయినా మరొకటి అయినా తమకు ఉపకరించే వరకే జగన్ రెడ్డి వాడుకుంటారు, , అవసరం తీరిన తర్వాత, ఎవరినీ ఆయన పట్టించుకోరని, ఆయన బంధువర్గంలోని వారే ఆరోపించిన సందర్భాలున్నాయి . అయినా, ఇంకా జగన్ రెడ్డి బంధుత్వాలకు, ప్రాధాన్యత ఇస్త్తారని అనుకోవడం, ఆలా అనుకునే వారి అమాయకత్వం అవుతుందే కానీ, మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
నిజానిజాలు, ఎలా ఉన్నప్పటికీ, వైఎస్సార్ చనిపోయిన సమయంలో, అంత్యక్రియలు అయినా పూర్తి కాకముందే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించారని అంటారు. ఇక బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా కొందరు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్ట్పరుస్తున్నారు .ఇక సోదరి షర్మిల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. చివరకు తల్లి విజయమ్మ తోనూ ... జగన్ రెడ్డికి ఏవో విబేధాలు ఉన్నాయని అంటారు.
అయితే అన్నీ తెలిసిన మరో బాబాయ్.. టీటీడీ చైర్మన్, సుబ్బారెడ్డి మాత్రం బంధుత్వాన్ని నమ్ముకుని రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అయన నేరుగా తమ మనసులోని మాటను బయట పెట్టకుండా, చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని వస్తున్న వార్తలపై, స్పందిస్తూ పనిలో పనిగా తమ మనసులోని కోరికను బయట పెట్టారు.
గతంలో అంబానీ రెకమెండేషన్ మీద పరిమళ్ నత్వానీకి రాజస్య సభ టికెట్ ఇచ్చిన విషయాన్ని మరిచి పోయారో ఏమో, పార్టీ కోసం పని చేసే వారికే జగన్ రెడ్డి రాజ్యసభ టిక్కెట్ ఇస్తారు… ఎవరినో తెచ్చి ఇవ్వాల్సిన అవసరం జగన్కు లేదని, పరోక్షంగా చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేయలేదని ఆయన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశా రు. అంతవరకు ఓ కే అయినా పనిలో పనిగా సుబ్బారెడ్డి, తమ కోరికను కూడా చెప్పేశారు. పార్టీ కోసం పనిచేసే తనలాంటి వారిని గుర్తించి రాజ్యసభకు పంపాలని అన్నారు
నిజానికి సుబ్బా రెడ్డి 2014 / 2019 లో నెల్లూరు ఎంపీ టికెట్ ఆశించారు. ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు. అయితే, సమీకరణాల లెక్క తప్పిదో లేక జగన్ రెడ్డి ఆలోచన ఇంకోలా ఉందో ఏమో కానీ, ఆయన టికెట్ రాలేదు. ఆ నేపధ్యంలోనే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి బాబాయ్' ని జగన్ రెడ్డి వరసగా రెండు సార్లు కొండెక్కించారు. అయినా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ సుబ్బా రెడ్డి, రాజ్య సభ టికెట్ కోసం అభ్యర్ధిస్తూనే ఉన్నారు. కానీ జగన్ మాత్రం టీటీడీ చైర్మన్ పోస్టుతోనే సరి పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో సారి టీటీడీ చైర్మన్తో పాటు రాజ్యసభ కూడా ఇవ్వాలని సుబ్బరెడ్డి కోరుతున్నారు. కానీ జగన్, నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. నిజానికి రాదని కూడా అంటున్నారు. రాజకీయ అవసరాల కోసం, కాదంటే ఆర్థిక అవావసరాల కోసం రాజ్యసభ సీట్లు కేటాయిస్తారన్నది, జగన్ నైజం ఎరిగిన నెట్ల మాట. అయినా సుబ్బా రెడ్డి ... పట్టువదలని విక్రమార్కునిలా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు .. జగన్ ఉ ..అంటారా ఉహూ అంటారో ఇంకేమంటారో చూడాలి.