అరటి రైతులది ...అరణ్య రోదన : షర్మిల

posted on: Mar 25, 2026 5:30PM

 

అరటి రైతుల పరిస్థితి అరణ్య రోదనలా మారిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వరకు టన్నుకు రూ.26 వేల వరకు ధర పలికిన అరటి, ఇప్పుడు రూ.4 వేలకే పడిపోయిందని పేర్కొన్నారు. వ్యాపారుల సిండికేట్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందుల పరిధిలో ఈ దుస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు.

 

 

మంగళవారం సాయంత్రం సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో అరటి తోటలను పరిశీలించిన షర్మిల, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తుఫానులు, యుద్ధ పరిస్థితులు, మార్కెట్ లో అనిశ్చితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు తమ సమస్యలను ఆమెకు వివరించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూఎన్నో ఏళ్లుగా అరటి రైతులు నష్టాల పాలవుతున్నారని కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని షర్మిల తెలిపారు. పలుమార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుకు రూ.4 వేల ధర కూడా రావడం కష్టమైందని, మొక్కల విషయంలో కూడా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. 

 

 

జనరిక్ మొక్కలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరటి పంటకు ఎకరాకు రూ.2 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, ప్రస్తుత ధరలతో రైతుకు లాభం ఏముంటుందని ప్రశ్నించారు.

భీమా లేక రైతుల ఆవేదన

పంట నష్టపోయినా భీమా సౌకర్యం లేకపోవడం దారుణమని షర్మిల అన్నారు. గతంలో భీమా పేరుతో రూ.170 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధుల పేరుతో కూడా గత ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ప్రకటించి అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రకటించినా, ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదని అన్నారు. అరటి రైతుల ప్రస్తుత నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ నిధి నుంచి తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని, ఈ పరిస్థితిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

రైతన్నకు కన్నీరు మిగిల్చిన అరటి పంట

ఒకప్పుడు సిరులు కురిపించిన అరటి పంట, నేడు రైతన్నకు కన్నీరు మిగిల్చుతోంది. ఎకరాకు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పంట పండించినా, టన్నుకు కనీసం రూ.15 వేల ధర రాకపోతే రైతు ఎలా నిలదొక్కుకుంటాడని ప్రశ్నించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలించిన సందర్భంగా రైతుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని, గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...