గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్న వేళ... ఆ ఎమ్మెల్యే మాత్రం అందుకు వ్యతిరేకమైన కామెంట్లు చేశారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టం అమలు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గోవధ చట్టంపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 

భారత్‌లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటన్నారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదన్నారు. లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువని, తినే వారికి ఆహార వస్తువన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు.  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నాయని కూడా వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం కరెక్టు కాదన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే గా చెప్పడం లేదంటూనే అతి సున్నితమైన గోవధ చట్టాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చెన్నకేశవ రెడ్డి. మునులు గోవులను తిన్నట్టుగా తాను విన్నానని వ్యాఖ్యానించారు. గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు మన చట్టాల్లో ఈ కాలానికి అవసరం లేని చట్టాలు తొలగించాలని సూచించారు. గోవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.లౌకికవాదిగా చెప్తున్నానంటూనే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.