వైసీపీ నేతల పేకాట.. బాలయ్య ఇలాఖాలో సంచలనం..
posted on Oct 19, 2021 1:53PM
ఏపీలో వైసీపీ నాయకుల ఆగడాలు అన్నీఇన్నీ కావు. పనుల్లో వాటాలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్లు, ఇసుక అక్రమ రవాణ.. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇవి చాలవన్నట్టు అక్రమ మద్యం, గంజాయి, నాటు సారా కేసుల్లోనూ వైసీపీ నాయకుల ప్రమేయం ఉంటోంది. ఇక ఊరూరా పేకాట శిబిరాల గురించి చెప్పనవసరమే లేదు. వైసీపీ నేతల ప్రధాన ఆదాయం పేకాటే అంటున్నారు.
తాజాగా, అనంతపురం జిల్లా హిందూపురంలో పేకాట ఆడుతూ ఇద్దరు వైసీపీ నాయకులు పట్టుబడ్డారు. వారితో పాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది.
పేకాట ఆడుతున్న వైసీపీ నాయకుడు, కల్లు వ్యాపారి రామకృష్ణప్ప, తిప్పన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పేకాడుతున్న స్టేట్ బ్యాంక్ మేనేజర్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ను సైతం పోలీసులు పట్టుకున్నారు. 32 వేల నగదు, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ఆ ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టారు.