జగన్కు తూట్లు.. టికెట్ కోసం 50 లక్షలు వసూలు.. వైసీపీలో కుంపట్లు..
posted on Oct 18, 2021 5:34PM
జగనన్న పాలన దోపిడీ పాలన. ఇసుక నుంచి మద్యం వరకూ సర్వం దోపిడీ మయం. ఏపీలో కమీషన్లు లేనిదే ఒక్క పనైనా జరగదంటున్నారు. ఆ కమీషన్ల కక్కుర్తి వల్లే బొగ్గు కొరత ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్గా మారుతోందనే విమర్శ ఉంది. ఇలా అధినేతే దొరికిన కాడికి దోచుకుంటుంటే.. ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల గురించి చెప్పేదేముంది. ఎవరికి వారు వారి వారి స్థాయిలో కమీషన్లు రాబట్టుకుంటున్నారు. పాలన, ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టేసి.. అవినీతి, దోపిడీనే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఈ మాట అంటున్నది ఏ ప్రతిపక్ష నేతలో కాదు. స్వయానా అధికార వైసీపీ నాయకులే తమ పార్టీ ఎమ్మెల్యేపై ఈ రకమైన తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి.. ఎమ్మెల్యే కమీషన్ల దందా గుట్టు రట్టు చేశారు.
ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డిపై అదే పార్టీకి చెందిన నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఆశయాలకు ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ప్రెస్మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే వసూళ్ల దందా చిట్టా విప్పారు. ప్రతి పనికీ ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు.
‘‘మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఫిక్స్డ్ రేట్ల ఎమ్మెల్యేగా మారిపోయారు. 8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు. అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి మండల కన్వీనర్ల వరకు అమ్మకాలు చేపట్టారు. వింజమూరు మండల కన్వీనర్లను ఆరునెలల్లో మూడుసార్లు మార్చారు. వరికుంటపాడు ఎంపీపీ పదవిని అమ్ముకున్నారు. జడ్పీటీసీ టికెట్ కోసం రూ.50లక్షలు ఇచ్చాం.’’ అని సుబ్బారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి బండారం బట్టబయలైంది.