Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నక్సల్ ముక్త భారత్.. సాకారమైనట్లేనా?
posted on: Mar 30, 2026 11:22AM

నక్సల్ ముక్త భారత్ కు కేంద్ర ప్రభుద్వం నిర్దేశించిన గడువు మంగళవారం (మార్చి 31)తో ముగియనున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిగ్గా రెండేళ్ల కిందట ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ఆరంభమైంది. ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో జరిగిన పలు ఎన్ కౌంటర్లలో వందల మంది మవోయిస్టులు హతమయ్యారు. అంతకంటే పెద్ద సంఖ్యలో మావోలు ఆయుధాలు అప్పగించి సరండర్ అయ్యారు. అలా సరండర్ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు.
వాస్తవానికి గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో నక్సల్స్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో విస్తరించిన ఈ ఉద్యమం.. ఆ తరువాత 7 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది.
ముఖ్యంగా నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులను దాదాపుగా తుడిచిపెట్టేసిందని చెప్పవచ్చు. ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, మోస్ట్ వాంటెడ్ కమాండర్ హిడ్మా వంటి అగ్రనేతలు హతమయ్యారు. మల్లోజుల వంటి కీలక నేతలు వందలాది మంది మావోయిస్టులతో లొంగిపోయారు. గత ఏడాది కాలంలోనే వందల సంఖ్యలో నక్సల్స్ మరణించడం, ఆయుధాలు విసర్జించి లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం బాగా బలహీనపడింది. ప్రస్తుతం ఇంకా సాయుధపోరాటమే మార్గం అంటూ అడవిలో ఉన్న నక్సల్స్ సంఖ్య చాలా చాలా పరిమితంగా ఉందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో నక్సల్ రహిత భారత్ గడువునకు ముందు లోక్ సభ వేదికగా ఈ అంశంపై చర్చ జరిగింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చర్చను ప్రారంభించి.. నక్సలిజం అంతం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. 2013లో జీరం లోయలో జరిగిన దారుణ మారణకాండ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను వారు ప్రశంసించారు.
బస్తర్ ప్రాంతంలో శాంతి స్థాపన జరిగితే ఆ ప్రాంతం పారిశ్రామికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందనీ, సాయుధ పోరాటం ముగిసినప్పటికీ, గిరిజనుల హక్కుల కోసం జరిగే ప్రజాస్వామ్య పోరాటాలు కొనసాగుతాయనీ అంటున్నారు. మొత్తం మీద, రేపటి డెడ్లైన్ నాటికి భారత్ నక్సల్ రహిత దేశంగా అవతరిస్తుందా? ఈ మేరకు కేంద్రం ప్రకటన చేస్తుందా, అడవులలో ఇంకా నామమాత్రంగా మిగిలిన మావోయిస్టులు ఈ ఒక్క రోజులో లొంగుబాట పడతారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






