‘హు కిల్డ్ బాబాయ్?’కి సమాధానం దొరకబోతోంది!

తెలుగు ప్రజలను గత ఐదేళ్ళుగా సమాధానం దొరక్కుండా వేధిస్తున్న ప్రశ్న ‘హు కిల్డ్ బాబాయ్?’ బేతాళుడి ప్రశ్నలకు సమాధానాలు విక్రమార్కుడు చెప్పేవాడు. కానీ ‘హు కిల్డ్ బాబాయ్’ అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘వివేకా హత్యకేసు ఎన్నో మలుపులు తిరిగింది. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలికి సీఐ వెళ్ళారు. సీబీఐకి వాస్తవాలన్నీ తెలియజేయడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి ప్రమోషన్ ఇచ్చింది. విచారణాధికారి మీద కేసు పెడితే హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు నేరస్థుడు ముఖ్యమంత్రి కావడంతో పోలీసులు కూడా వంత పలకాల్సిన పరిస్థితి వచ్చంది. వివేకా హత్యకేసు నిందితులను అరెస్టు చేయడానికి వెళ్ళిన సీబీఐ సిబ్బంది ఏమీ చేయలేక వెనుదిరిగారు. గతంలో ఈ కేసు విషయంలో ఎన్నో అవరోధాలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్వరలో ‘హు కిల్డ్ బాబాయ్?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది’’ అన్నారు.