మహా సంక్షోభానికి ముగింపు ఎప్పుడో ?

మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేనలో ఏర్పడిన సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై, పార్టీ సీనియర్ నాయకుడు, ఏకనాథ్ షిండే ఎగరేసిన తిరుగుబాటు సృష్టించిన సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

చివరకు, సెంటిమెంట్ ను పండించేందుకు రాత్రికి రాత్రి అధికార నివాసం వదిలి, మాతృశ్రీకి చేరుకున్నారు. అనారోగ్యాన్ని, ఇతర వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించి, సింపతీ గైన్ చేసే ప్రయత్నమూ చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. అయిన ఎన్ని చేసినా, చేసిన ప్రయత్నాలు అన్నీ విఫల మయ్యాయి.  మరో వంక తిరుగుబాటు జెండా ఎగరేసిన ఏక్ నాథ్ శిందే బలం రోజురోజులు పెరుగుతోంది.  చివరకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు కూడా బయటకు రాగానే, ఫ్లైట్ ఎక్కి చలో గౌహతి అని ఏక్‌నాథ్‌ శిబిరానికి చేరుతున్నారు. దీంతో, అసెంబ్లీలో బలం లేదు. ప్రభుత్వాని నిలుపుకోవడం అయ్యే పని కాదని ఉద్దవ్ ఠాక్రేకి అర్థమైంది. 

అందుకే ఇక ఇప్పడు చేసేది లేక, ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పోయినా పార్టీని అయినా కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా శివసేన జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. కన్నీరు పెట్టుకున్నారు. హిందుత్వను, బాల్ ఠాక్రే ఆదర్శాలను వదలనని ప్రతిజ్ఞ చేశారు. మరో వంక శివసేన జాతీయ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే,తిరుగుబాటు వర్గం నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.  మరోవంక, వీధి పోరాటాలకు ఉద్దవ్ ఠాక్రే వర్గం తెర తీసింది.

ఒక విధంగా ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన సూత్రధారిగా విమర్శలు ఎదుర్కుంటున్న సంజయ్ రౌత్, వీధి పోరాటాలకు  నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఠాక్రేసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు లక్ష్యంగా దాడులు సాగిస్తోంది.  పూణేలోని కత్రాజ్‌లోని బాలాజీ ప్రాంతంలో శివసేన పార్టీ రెబెల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయాన్ని ఇవాళ శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. సావంత్ రాష్ట్రంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరు. ప్రస్తుతం ఆయన అస్సాంలోని గౌహతి క్యాంప్ లో ఏకనాథ్ షిండే శిబిరంలో ఉన్నారు. ఇదే కోవలో మరికొందరు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపైనా ఠాక్రేసేన శివసేన కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీంతో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేల నేత అయిన ఏకనాథ్ షిండే ఇంటికి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం భద్రతను తొలగించింది.

అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గువాహటి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకున్నట్లు సమాచారం. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసమ్మతి వర్గ నేత శిందే ఓ వార్తా సంస్థకు స్వయంగా వెల్లడించారు.
ఇదిలాఉండగా, ఇంతవరకు తెర వెనక నుంచి చక్రం తిప్పుతున్న బీజేపే నాయకత్వం, రాష్ట్ర్మలో పరిస్థితి అదుపు తప్పితే, రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రపతి పాలనకు, శివసేనతో పాటుగా కాంగ్రెస్, ఎన్సీపీకి కూడా సుముఖంగానే ఉన్నాయని అంటున్నారు అయితే. శివసేన రెబెల్ వర్గం అందుకు అంగీకరించ పోవచ్చని, ఉద్దవ్ ఠాక్రే , సమయం వస్తే    ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని రెబెల్ వర్గం భావిస్తోంది. ఏమైనా, మహా సంక్షోభానికి .. ముగింపు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదని అంటున్నారు.