ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే?

అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది. తాజాగా అలా జనావాసాలపై వైపు వచ్చిన ఓ చిరుత పులి.. ఓ ఇంట్లోకి దూరి ఆ ఇంటి పెంపుడు కుక్కను నోట కరుచుకుని పారిపోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యింది. చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంటి యజమాని ఫోన్ లో బిజీగా ఉన్నారు. చిరుత మాత్రం పిల్లిలా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఆడుకుంటున్న కుక్క పిల్లను నోట కరుచుకుని పారిపోయింది. ఈ సంఘటన పుణెలోని భోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జయానంద్ కాలే అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత జయానంద్ కాలే పడుకుని ఉన్న మంచం కింద ఉన్న కుక్కపిల్లను నోట కరుచుకుని ఉడాయించింది.   ఈ వీడియోపై నెటిజనులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెంపుడు కుక్కను కోల్పోయిన జయానంద్ కాలేపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, అతడు అదృష్టవంతుడని కామెంట్లు పెడుతున్నారు. కుక్కపై కాకుండా అతనిపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల నుంచి ప్రజలకు రక్షణ కరవైందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  
ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే? Publish Date: Mar 14, 2025 3:42PM

కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు!

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ బాగా ఉన్నా కూటమి సర్కార్  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల పట్ల ఉదాశీనంగా ఎందుకు ఉంటోందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయిందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కొందరు అధికారుల తీరు కూటమి సర్కార్ ప్రతిష్ఠ మసకబారేలా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి  అధికారులపై నియంత్రణ లేకుండా పోయిదా అన్న భవం కలిగేలా కొందరుర అధికారుల తీరు ఉంటోంది.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్ర లేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో అధికారులు ఆయా శాఖల మంత్రులను కూడా లేక్క చేయకుండా వ్యవహరించిన ఉదంతాలపై రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు శాఖలని కాకుండా పీఎంవో సహా దాదాపు అన్ని శాఖల్లోనూ కొందరు అధికారుల వ్యవహార శైలి కూటమి సర్కార్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై  సెక్రటేరీయేట్, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బిల్లుల బకాయిలపై మాట్లాడేందుకు తన వద్దకు వచ్చి విజ్ణప్తి చేసిన కాంట్రాక్టర్లతో పియూష్ కుమార్ దురుసుగా   కాంట్రాక్టుల్లో లాభాలు వచ్చినప్పుడు బానే తీసుకున్నారు కదా? ఇప్పుడు బిల్లుల కోసం కొంత కాలం వేచి చూడలేరా అంటూ మండిపడ్డారట.  ప్రజలకు, ప్రభుత్వానికీ వారథులుగా ఉండాల్సిన అధికారి ఇలా వారి మధ్య అగాధం సృష్టించేలా మాట్లాడటమేమిటన్న విస్మయం వ్యక్తం అవుతోంది. పియూష్ కుమార్ తీరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  ఈ సందర్భంగానే పీయూష్ కుమార్ గతంలో చేసిన నిర్వాకాలను కూడా గుర్తు చేసుకుంటున్నాయి.  కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే  పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేసింది పియూష్ కుమారే అని తరువాత తేలింది.  సాంకేతిక తప్పిదంగా పీయూష్ కుమార్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు సంబంధించి వేరు బి్ల్లుల హడావుడి చెల్లింపుల వెనుక కూడా పీయూష్ కుమారే ఉన్నారని తేలింది. ఇలా పియూష్ కుమార్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడం, వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తాన్నారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.   ఇక సీఎంఓలోని ఒకరిద్దరు ఉన్నతాధికారుల అండతో పీయూష్ ఆర్థిక శాఖను తన ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల నుంచే వస్తున్నాయి.  ఒక్క పియూష్ కుమార్ అనే కాకుండా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ కూడా తమతమ శాఖలలో కొందరు ఉన్నతాధికారుల తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.  ఇటువంటి అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వ ప్రతిష్ట, వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ట కూడా మసకబారుతుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు! Publish Date: Mar 14, 2025 2:47PM

రాజ్యసభకు వెళ్తానంటున్న యనమల .. చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా?

తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.  యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు చంద్రబాబు 2013లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యనమల శాసనమండలి సభ్యుడుగా కొనసాగుతున్నారు.  2014లో ఎమ్మెల్సీగా ఉంటూనే చంద్రబాబు కేబినెట్‌లో యనమల కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీఏసీ చైర్మన్ వంటి పదవులు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.  అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీకి దక్కిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. బీటీ నాయుడు,  బీద రవిచంద్రలను బీసీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు.  ఆ క్రమంలో యనమల తన పొలిటికల్ ఫ్యూచర్‌పై నోరు విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతానని యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తనను.. ఆ తర్వాత ఏం చేస్తారని అడుగుతున్న సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఇదే సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫలానా వారిని ఎంపిక చేశామని ఆయన చెబితే... స్వాగతించానన్నారు. తనకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పానన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి సేవలందించానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద యనమల రాజ్యసభ కోరిక తీరుతుందో లేదో చూడాలి
రాజ్యసభకు వెళ్తానంటున్న యనమల .. చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా? Publish Date: Mar 14, 2025 12:59PM

నెక్స్ట్ ఏంటి?

రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు. అందులోనూ ప్రధానంగా అధిష్టానం మొక్కులు చెల్లించుకోవడంకోసమో,  రాష్ట్రం నుంచి అధిష్టానికి చేరిన ఫిర్యాదులకు, సంజాయిషీ ఇచ్చుకోవడం కోసమో అప్పట్లో ముఖ్యమంత్రుల ఢిల్లీ యాత్రలు సాగేవని అప్పటి రాజకీయాలు ఎరిగిన సీనియర్ పాత్రికేయ మిత్రులు అంటుంటారు.  అయితే రాష్ట్ర విభజన తర్వాత వరసగా రెండు మార్లు ముఖ్యమంత్రిగా ఉన్న  బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు మాత్రం ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు తక్కువనే చెప్పుకోవాలి. ఒక విధంగా చూస్తే ఆయన వెళ్ళిన సందర్బాలను వేళ్ళ మీదలెక్క పెట్ట వచ్చునేమో. ఢిల్లీ వెళ్ళినా, పంటి నొప్పి, కంటి నొప్పి పేరున వెళ్లి రావడమే కానీ, ప్రత్యేకించి  అధికారిక కార్యకలాపాల కోసంగా  ఢిల్లీ వెళ్లిన సందర్భాలు,  ప్రధాని లేదా ఇతర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి  రావలసిన నిధుల గురించి చర్చించిన సందర్భాలు  చాలా చాలా తక్కువ. అలాగని  కేంద్రంతో ఏ సంబంధాలు లేకుండా కాలం వెళ్ళ దీశారా, అంటే లేదు. రాజకీయ శతృమిత్ర సంబంధాల విషయంలో ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేశారు.  కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాష్ట్ర మంత్రులు,అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో అధికారిక స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపడం, అవసరం అయితే వారే ఢిల్లీ వెళ్లి పని కానిచ్చుకోవడమే కానీ, ముఖ్యమంత్రి స్వయంగా ఫైల్స్ చంకన పెట్టుకుని ఢిల్లీ వెళ్ళడం అప్పట్లో అంతగా లేదు.   అలాగని కేంద్రంతో సయోధ్యంగా ఉన్నారా అంటే అదీ లేదు. ధాన్యం కొనుగోలు విషయం మొదలు అనేక విషయాల్లో కేంద్రంపై రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ వెళ్లి మరీ వీధి పోరాటాలు చేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాలలో  బీఆర్ఎస్ సిటీ అంతా నల్ల జెండాలు కట్టి, గో బ్యాక్ మోడీ నినాదాలతో నిరసన వాతావరణం సృష్టించింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్  కనీస మర్యాద పాటించలేదు. ప్రోటోకాల్ నిబంధనలను బేఖాతర్ చేశారు. ప్రధాని పర్యటనకు వచ్చిన ప్రతి సారీ ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ప్రధానమంత్రి వట్టి చేతులతో వస్తే ఎంత పోతే ఎంత, మూటలతో వస్తేనే స్వాగతం లేదంటే, నల్ల జెండాలు, గో బ్యాక్ నినాదాలే స్వాగతం చెపుతాయి అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ , ప్రభుత్వం వ్యవహరించాయి. అప్పట్లో  బీఆర్ఎస్ వ్యవహార శైలి,   మా ఇంటికొస్తే, మాకేం తెస్తావ్, మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్  అన్నట్లు ఉండేది.  సరే, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు అనేది వేరే చర్చ. వదిలేద్దాం.  అదలా ఉంటే  టీఆర్ఎస్  పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ జెండా ఎత్తిన తర్వాత కేసీఆర్  బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసేందుకు కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగొచ్చారు. సరే,  ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోగా, ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అన్నట్లు  రాష్ట్రంలో అధికారం పోయింది. లోక్ సభలో బీఆర్ఎస్ కు కనీస ప్రాతినిధ్యం  కూడా  లేకుండా పోయింది.  అది వేరే విషయం.  ఇక ఇప్పడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఆయన  ఢిల్లీ పర్యటనలు ఎక్కువయ్యాయి. ఒక పూట ఇక్కడ ఒక పూట అక్కడ అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళితే  పార్టీ అధిష్టాన్ని కలవకుండా వెనక్కి రావడం చాలా అరుదు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి రెండు సందర్భాలలో అది కూడా అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి నప్పడు మినహా  అధిష్టానాన్ని కలిసింది లేదని అంటున్నారు. మరో వంక  గత ఆరేడు నెలలుగా  రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది. నిజానికి  రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల అప్పాయింట్మెంట్ అయినా దొరుకోతోంది కానీ, రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ దొరకడం లేదని అంటున్నారు.  ఈ నేపధ్యంలోనే  రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రల రహస్యం ఏమిటనేది, కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి  రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అన్న విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి ? ఒక విధంగా ఇదే  ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
నెక్స్ట్ ఏంటి? Publish Date: Mar 14, 2025 12:46PM

చిక్కుల్లో సర్కార్.. సందిగ్ధంలో విపక్షం!

తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన  గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు. మంత్రుల పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ మంత్రులు సైతం, ఎందుకనో అంటీ ముట్ట నట్లే ఉంటున్నారు. ఇగో ప్రాబ్లమో, స్టేచర్  సమస్యో తెలియదు కానీ, ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సయోధ్య  ఉన్నట్లు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా అదే పరిస్థితి. ఓవరాల్ గా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. అదేమిటో తెలియదు కానీ, అంతా బాగుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. ఇది కళ్ళ  ముందు కనిపిస్తున్న సత్యం.    నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల, ఇంటా బయటా పెదవి విరుపులే కానీ, ప్రశంసలు పెద్దగా వినిపించడం లేదు. ముఖ్యమంత్రి  విమర్శలు చెవిలో, ప్రశంసలు మైకులో చెప్పాలని మైకులో వేడుకున్నా, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్లు  ఇటుదటు, అటు దిటు చేసి పార్టీ నాయకులు బహిరంగంగా  విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి  స్థానిక నాయకులే కాదు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ  ఢిల్లీ పెద్దలకూ  నచ్చడం లేదు. ప్రజల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదు అన్నట్లు  రేవంత్ రెడ్డి పాలన ఉందని సామాన్య జనం, పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని అంటున్నారు.  ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఎంత అద్వానంగావుందో  స్వయంగా ముఖ్యమంత్రే, ఢిల్లీ వెళ్లి డప్పు కొట్టి మరీ  దేశం మొత్తానికి వినిపించేలా చెప్పి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయం గత ప్రభుత్వ హాయంలో చేసిన అప్పుల పై కడుతున్న వడ్డీలు, ప్రభుత్వ ఉద్యోగుల భత్యాలకే  సరిపోతోందని, ఆ రెండు పద్దులకూ పోను   కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఆభివృద్ధి, సంక్షేమం, ఇతర రోజువారీ ఖర్చులకు మిగులుతున్నదని  ‘ఇండియా టుడే’ గోష్టిలో చెప్పి వచ్చారు. అదే విషయాన్ని ఇంకొంచం క్లారిటీతో బుధవారం (మార్చి 12), జరిగిన సభలో వివరించారు.  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కాన్సర్  సోకిందని,  సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ  ఎంత అద్వాన్నంగా వుందో కళ్ళకు కట్టి నట్లు చెప్పారు. ఇదలా ఉంటే  ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అంటూ వస్తున్న వార్తలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.  అధికార పార్టీ, ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  కూడా ఎందుకో, అంతగా దూకుడు చూపడం లేదు. ముఖ్యంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్  నిన్నమొన్నటివరకు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న సందేహం వచ్చే విధంగా, పర్ణశాల (ఫార్మ్ హౌస్)కే పరిమితం అయ్యారు. ఇంచుముంచుగా ఆరేడు నెలలకు పైగా  అసెంబ్లీకి  అయినా రాలేదు. సభకు ముఖం చూపలేదు. ఇంతలో, ఓ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో సభలో ప్రతిపక్షం బలం పలచ బడింది.  అలాగే,  ప్రతిపక్ష నేత కేసీఆర్  సభకు రాకుండా ముఖం చాటేయడంతో  ప్రతిపక్షం వాయిస్ మరింత బలహీనపడింది. అయితే, గత కొద్దిరోజులుగా, కీసీఆర్   రీ ఆక్టివ్  అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు, మార్చి 12 న ఏదో మొక్కుబడిగా సభకు వచ్చి సంతకం చేసి వెళ్ళారే కానీ , బడ్జెట్ సమావేశాలు చివరి వరకు క్రియాశీల పాత్ర పోషించక పోవచ్చని పార్టీ వర్గాల సమాచరం. ఏప్రిల్ 27న, వరంగల్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ తర్వాతనే కేసీఆర్  రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు తమ చేతకాని తనంతో అధికారాన్ని ఫార్మ్ హౌస్  కు వచ్చి మరీ బంగారు పళ్ళెంలో పెట్టి. ఇచ్చిపోతారని, కేసీఆర్  సార్ .. గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు. అందుకే, అప్పుడైనా వస్తారా.. అనేది అనుమానమే అంటున్నారు. అలాగే,   ఈ లోగా. రాష్ట్ర రాజకీయాలు, ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అప్పటికి రాజెవరో .. రెడ్డెవరో ...?
చిక్కుల్లో  సర్కార్..  సందిగ్ధంలో విపక్షం! Publish Date: Mar 14, 2025 9:18AM