స్టెంట్ వేశారు.. వంగవీటి రాధా సేఫ్!

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన తెలుగుదేశం నేత వంగవీటి రాధాకు వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారు జామున గుండెపోటుకు గురైన వంగవీటి రాధాను హుటాహుటిన విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలసిందే. అక్కడ రాధాను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె పోటు వచ్చిందని ధృవీకరించారు. జాప్యం లేకుండా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. దాంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపారు. ఇలా ఉండగా రాధాకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న ఆయన అనచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పలువురు నాయకులు కూడా ఆస్పత్రికి వచ్చి రాధా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.