నానీ కాదు..అంతా నేనే చేశా: వంశీ కొత్త వెర్షన్ లో మతలబు అదేనా?

గుడివాడలో జరిగిన క్యాసినోపై కొత్త ట్విస్టు బయటికొచ్చింది. నరం లేని నాలుక అబద్ధం చెప్పొచ్చు. కానీ ఏం జరిగిందో ఎవిడెన్స్ గా మారిన ఫొటోలు గానీ, వీడియోలు గానీ తప్పు చెప్పవు కదా. క్యాసినో జరిగిందని  నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని, అవసరమైతే పెట్రోలు మీద పోసుకొని  ఆత్మహత్య  చేసుకుంటానని వైసీపీ మినిస్టర్ కొడాలి నాని మంగమ్మ లెవెల్లో శపథం చేశారు. ఆయన శపథాన్ని బలపరుస్తున్నట్టు ఆయన స్నేహితుడైన వల్లభనేని వంశీ ఓ కొత్త వెర్షన్ ఐడియాను రిలీజ్ చేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టు కె.కన్వెన్షన్ లో క్యాసినో జరగలేదని, దాని పక్కన మరో స్థలంలో జరిగిందని, అది కూడా క్యాసినో కాదు.. కేవలం కోడిపందాలే జరిగాయని చెప్పుకొచ్చారు. క్యాసినో జరగనే లేదన్న వంశీ... అక్కడ జరిగింది కూడా పూర్తిగా తన డైరెక్షన్ లోనే జరిగిందని, అసలు కొడాలి నానికి ఆ తతంగానికి ఏం సంబంధం లేదంటూ వకాల్తా పుచ్చుకోవడమే  విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జరిగిందానికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని కూడా చెప్పడం మరో ట్విస్టు. 

మరి ఈ ముక్క చెప్పడానికి వంశీకి ఇంత టైమెందుకు పట్టిందన్న డౌటనుమానం అమరావతి ప్రజానీకాన్ని పీడిస్తోంది. క్యాసినో లోగుట్టును బయటపెట్టేందుకు టీడీపీ నేతలు దండు కట్టి దండోరా మోగించి చలో కె.కన్వెన్షన్ అంటూ కార్యకర్తలను ముందుకు ఉరికిస్తే.. తమ నిజరూపం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో వైసీపీ నేతలంతా కట్ట కట్టుకొని టీడీపీ నేతల్ని చితకబాదారు. దాని మీద పోలీసుల చేతగానితనాన్ని, లోపాయికారీ అంగీకారాన్ని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. దానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం కూడా అవమానంగా ఫీలైంది. ఖాకీ బట్టలేసుకుని కళ్లు మూసుకోమంటే మూసుకుంటాం గానీ.. కడుపు మండిన ప్రతిపక్షాలు విమర్శాస్త్రాలు సంధిస్తే చెవులు మూసుకోవడం ఎలా కుదురుతుందంటూ   ఆక్రోశం వెళ్లగక్కారు. ఏపీలో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం బజారుకెక్కి  బాహాబాహీలకు దిగినా చలించని వంశీ... ఇంత ఆలస్యంగా బయటికెందుకు వచ్చారన్నదే ఈ కథలో కొత్తమలుపు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

అధికార పార్టీతో అంటకాగుతూ నానీకి ఉన్న వ్యాపార, వ్యాపారేతర కార్యకలాపాల్లో భాగం పంచుకుంటూ లోపాయికారీగా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్న వంశీ ఉన్నపళంగా ఎందుకని బయటపడ్డాడు? వంశీమోహన్ బయటికొచ్చి వివరణ ఇవ్వడానికి వెనకాల ఏ మహాశక్తి పనిచేసిందో ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదంటున్నారు విమర్శకులు. అసలు మరక అధికార పార్టీకి  అంటకుండా  చూడటానికి నాని వెనకాల ఉన్న ఆ మహాశక్తే వంశీమోహన్ ను తెరముందుకు తీసుకొచ్చిందన్న  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నాని, వంశీ కలిసి చేస్తున్న కార్యకలాపాల్లో ఒకటోది ఇలా క్యాసినో రూపంలో బయటపడిందన్నమాట. ఇంకా ఎన్ని వ్యాపార, వ్యాపారేతర కార్యకలాపాల్లో  ఇద్దరికీ పార్ట్ నర్ షిప్ ఉందో తెలియాలంటే రానున్న కాలం రావాల్సిందేనంటున్నారు  ఆంధ్రా ప్రజలు. అసలు సంక్రాంతి సందర్భంగా కె.కన్వెన్షన్ లో ఏం జరిగిందో టీడీపీ నేతలు ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా ద్వారా బయటపెడుతుండడంతో వంశీ అనే కొత్త పాత్ర కాస్తా బయటికి రావడం గమనార్హం.