పండుగలని వదిలేస్తే.. కేరళ మూల్యం చెల్లించుకుంది.. కేంద్ర మంత్రి హెచ్చరిక.. 

భారత్ లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు కేరళలో జనవరిలోనే నమోదైన సంగతి తెలిసిందే. అయితే వెంటనే కఠినమైన చర్యలతో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి కూడా చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే తాజాగా ఓనం పండుగ సందర్భంగా నిబంధనలను సడలించడంతో.. ఈ నెల ప్రారంభం నుంచి 17వ తేదీ వరకూ కేరళలో వచ్చిన కరోనా కేసులు 1.35 లక్షలకు పైగానే నమోదయ్యాయి. మొదటి నుండి కట్టడి చేసి ఇపుడు ఓనం సందర్భంగా నిబంధనలను సడలించడంతో.. తగిన మూల్యం చెల్లించుకుందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్దన్ వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో.. ప్రయాణాలను అనుమతించి తప్పు చేశారని, దీంతో ప్రజలు మూకుమ్మడిగా పండగలు చేసుకునేలా నిబంధనలను సడలించారని ఆయన విమర్శించారు. దీంతో ఓనమ్ పర్వదినాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. దీంతో రోజువారీ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి.

 

ఇప్పుడు దేశవ్యాప్తంగా దసరా - దీపావళి పండుగ సీజన్ మొదలైంది. రాష్ట్రాలూ కోవిడ్ ప్రణాళికల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదు" అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. "ఓనమ్ సమయంలో చూపించిన నిర్లక్ష్యానికి ఇప్పటికే కేరళ నష్టపోయింది. రాష్ట్ర పరిధిలో వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించడం, ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరవడం తదితర కారణాలతోనే కేరళలో కేసులు పెరిగాయి" అని సోషల్ మీడియాలో నిన్న జరిగిన "సండే సంవాద్" కార్యక్రమంలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నలకు హర్ష వర్దన్ సమాధానమిచ్చారు.

 

కేరళ రాష్ట్ర ఉదంతాన్ని మిగిలిన రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుని కరోనా కట్టడిపై మరింత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అంతేకాకుండా వచ్చే పండగ సీజన్ తో పాటు త్వరలో శీతాకాలం కూడా కలిసి రానుండడంతో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన ఒక కమిటీ హెచ్చరించిన కొన్ని గంటలలోనే హర్షవర్దన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏ మతం కూడా ప్రాణాలను పణంగా పెట్టి, పండగలను జరుపుకోవాలని చెప్పలేదని, వీలైనంత వరకూ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఆయన సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన అన్నారు. దాదాపు 46 రోజుల తరువాత మనదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల లోపునకు తగ్గడం శుభ పరిణామమని అయన అన్నారు.