టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యేకతలు ఇవే... 

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  ద్వదశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా మూడేండ్ల తర్వాత ప్లినరీ జరుగుతుండటంతో గులాబీ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరమంతా గులాబీమయమైంది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కటౌట్స్, జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన కూడళ్లన్ని టీఆర్ఎస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. నెక్లెస్ రోడ్ సర్కిల్, ప్యాట్నీ, ప్యారడైజ్, తెలుగు తల్లి ప్లై ఓవర్, బేగంపేట లోని సీఎం క్యాంప్ ఆఫీస్ సర్కిల్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, సైబర్ టవర్స్ , ఎల్పీనగర్ జంక్షన్, మలక్ పేట్ జంక్షన్ల దగ్గర పెద్ద ఎత్తుల ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఫొటోలతో కూడిన హోర్డింగ్ లు ఆకట్టుకుంటున్నాయి. 

ప్లీనరీకి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా ప్రతినిధులు, కార్యకర్తలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వచ్చిన వారిలో హుషారు నింపేందుకు సాంస్కతిక కార్యక్రమాలను, ధూంధాం ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలకు సంబంధించిన పాటలు, టీఆర్ఎస్ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలను వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. 

వేలాదిగా తరలి వస్తున్న ప్రతినిధులు, పార్టీనాయకులు, కార్యకర్తలకు నోరూరించే వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రుచులను అందించేందుకు ప్రత్యేకంగా 29 రకాల నాన్ వెజ్ ఐటమ్స్, పలు రకాల వెజ్ ఐటమ్స్, స్వీట్లను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్లీనరీ సందర్భంగా వంటల కోసం 500 మంది వంటవాళ్లు పని చేస్తున్నారని మంత్రి తలసాని తెలిపారు. వేదిక వద్ద తెలంగాణ సంప్రదాయాలను తెలియజేసే చిత్రాలు, ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన పాత్రను తెలియజేసే చిత్రాలు హైలైట్ కానున్నాయి. ప్లీనరీ వేదిక పై దాదాపు 100 మంది ముఖ్యులు కూర్చునే విధంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు.