Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముగిసిన నాదెండ్ల భాస్కరరావు ప్రస్థానం
posted on: Apr 22, 2026 3:09PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, వృత్తిరీత్యా న్యాయవాది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పొందిన ఆయన, కొంతకాలం న్యాయవాదిగా సేవలందించారు.
అనంతరం రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య మంత్రివర్గాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన భాస్కరరావు, ఎన్టీఆర్కు సన్నిహితుడిగా నిలిచారు. 1983లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు.
అయితే 1984లో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో, రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ (ఐ) ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో, అప్పటి గవర్నర్ రామ్లాల్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో భారీ ఉద్యమం చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి ‘ధర్మయుద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. ఈ ఉద్యమానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించగా, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించింది. ఉద్యమం తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, గవర్నర్ రామ్లాల్ను వెనక్కి పిలిపించింది. అనంతరం ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది.
కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కరరావు, మెజారిటీ నిరూపించలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984 ఆగస్టులో చోటుచేసుకున్న ఈ రాజకీయ సంక్షోభం ‘ఆగస్టు సంక్షోభం’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితంపై ముద్ర వేసింది. అనంతరం టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కరరావు, 1998లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినా, వయోభారం కారణంగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించలేదు.
ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనోహర్, 2004, 2009లో తెనాలి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు.
ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన, 2024లో తెనాలి నుంచి మరోసారి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం (23-04-2026) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.



.webp)


