హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!?.. ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ షాక్. మెట్రో రైలు చార్జీలు దగ్గరదగ్గర 50 శాతం పెరగనున్నాయి. అతి త్వరలోనే మోట్రో రైలు చార్జీల పెంపు ఉంటుందని మెట్రో వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పెంపు పది రూపాయల నుంచి 60 రూపాయల వరకూ ఉంటుంని చెబుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. భారీ నష్టాలలలో ఉన్న మెట్రో రైల్ ఆ నష్టాల నుంచి బయటపడేందుకు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తోంది. ఇప్పటికే మెట్రో హాలీడే సేవర్ కార్డును మెట్రో రద్దు చేసింది. అలాగే ప్రయాణీకులకు పది శాతం రాయితీని కూడా రద్దీ సమయాల్లో ఎత్తివేసింది. వాస్తవానికి మెట్రో  ధరల సవరణకు ఎల్ అండ్ టీ సంస్థ 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది . అయితే అప్పటి కేసీఆర్ సర్కార్ అందుకు అంగీకరించలేదు.  అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడం,  బెంగళూరు మెట్రో ఛార్జీలు   44 శాతం పెంచిన నేపథ్యంలో  హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది.
 హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!?.. ఎప్పట్నుంచంటే? Publish Date: Apr 17, 2025 10:25AM

ఈ 20లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనున్నది. అదే విధంగా ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో బుధవారం (ఏప్రిల్ 16)న కీలక సమావేశం జరిగింది. సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ప్రకటనపై చర్చించారు. ఈ నెల 20వ తేదీలోగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఆ లోపే ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.   వాస్తవానికి ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. నింబంధనలకు వ్యతిరేకంగా  ప్రస్తుతం   జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోడు పదవులలో కొనసాగుతున్నారు. ఇది పార్టీ నిబంధనలకు వ్యతిరేకం. అయినా కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయం తేల్చలేక పార్టీ హైకమాండ్ ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి మూడు రోజుల పాటు బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక, ప్రకటన ఉంటుందని అంటున్నారు. అందు కోసమే బుధవారం (ఏప్రిల్ 16)న అత్యవసరంగా ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో నిర్మలా సీతారామన్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి దక్షిణాది నుంచే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   
ఈ 20లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక Publish Date: Apr 17, 2025 10:03AM

వెరికోస్ వెయిన్స్.. ఇలా చేస్తే నరాల సమస్యలు రావు..!

  నరాల ఉబ్బరం అనేది ప్రతిరోజూ ఎవరో ఒకరు బాధపడే ఒక సాధారణ సమస్య. నరాల ఉబ్బరం నరాల సమస్య కాదు కానీ కండరాల తిమ్మిరి వల్ల వస్తుందట. ఈ సమస్య క్రమంగా నయమవుతుంది. చాలా మంది రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. దీనిలో కండరాలు అకస్మాత్తుగా బిగుతుగా  మారడం లేదా సాగదీయడం జరుగుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్య తరచుగా కాళ్ళు, చేతులు లేదా వీపులో సంభవిస్తుంది.  కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఇది తీవ్రమైన సమస్య కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే, అది  దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ కు చికిత్స ఏమిటి? కొంచెం శ్రద్ధ, సరైన జీవనశైలి,  సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. వెరికోస్ వెయిన్స్  కారణాలు,  దానిని నివారించే మార్గాలను తెలుసుకుంటే.. నీటి కొరత.. నీరు లేకపోవడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.   రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగకపోతే రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుందట. గర్భధారణ సమయంలో.. గర్భధారణ సమయంలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.   దీనితో పాటు డయాలసిస్ రోగులకు కండరాల తిమ్మిరి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట. డయాలసిస్ రోగులలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అధిక హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య సంభవిస్తుందట. విటమిన్లు లేకపోవడం.. విటమిన్ లోపాలు ఉన్నవారు.. ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్,  మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ఉపశమనం ఎలా.. ఎవరికైనా ఈ సమస్య ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య  ఎక్కువగా బాధపెడితే, పైన పేర్కొన్న కారణాలపై  శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు.   వీటిలో ఏవైనా ఉంటే, పరీక్షించుకోవాలి.  శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, దానిని ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీర్చుకోవాలి.  శరీరంలో విటమిన్ల లోపం ఉంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని డాక్టర్లు  చెబుతున్నారు.  ఆహారంలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది కాకుండా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వెరికోస్ వెయిన్స్.. ఇలా చేస్తే నరాల సమస్యలు రావు..! Publish Date: Apr 17, 2025 9:30AM

తెలుగుదేశంకి విజయసాయిరెడ్డి టెన్షన్.. బీజేపీ కోటాలో రాజ్యసభకు సాయిరెడ్డి?

వైసీపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ విరామానికి బ్రేక్ వేసి పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని ఆయనకే తిరిగి కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంటున్నారు.  ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ, జనసేనల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో వారిని ఒప్పించాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట.   వైసిపి ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు.  విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు.   ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ  విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్నా, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా  విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం.  ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఆయన కుమార్తెకు సంబంధించి  భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి  చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో  కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా అన్న చర్చ జరిగింది. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరిగింది.  వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చిన ఆయన జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు.  ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్  చేసిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో. రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగుపెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఉప ఎన్నిక టెన్షన్‌ పట్టుకుందంట.  విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. అయితే విజయసాయి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వెళ్లాలంటే టీడీపీ, జనసేన ఆమోదం తప్పనిసరి.  రాష్ట్రంలో బీజేపీకి కేవలం ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఆయన రాజ్యసభకు వెళ్లగలరు.  సాయిరెడ్డి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవన్‌కళ్యాణ్‌తో సంప్రదించకుండా తీసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శల గుప్పించారు.  టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి, జనసేనాని ఇలా అందరిపై సాయిరెడ్డి నోరుపారేసుకున్నారు. అయితే రిటైర్‌మెంట్ ప్రకటన సమయంలో జగన్ ఆదేశాలతో సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదివానని వెళ్లడించి కలకలం రేపారు. ఏదేమైనా టిడిపి వర్గాలు ఆయనను వర్గ శత్రువుగా చూస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు పొత్తుల్లో బీజేపీకి దక్కి..  ఢిల్లీ పెద్దలు విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీ ఎలా స్పందిస్తుంది? అధినేత చంద్రబాబు ఏం చేస్తారు? తమ బద్ద శత్రువుని తమ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు పంపాలా? ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.  ఒక వేళ నిజంగా విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించాల్సి వస్తే మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడం ఖాయం. కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ భేటీలో విజయసాయిరెడ్డి వ్యవహారం తేలుతుందంటున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా ప‌డిందంట. అయితే ఈ సారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఒక వేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని, రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయకు అది తప్ప వేరే మార్గమేమీ లేదంటున్నారు. అయితే సాయిరెడ్డిని టీడీపీ కోటాలో రాజ్యసభకు పంపితే పార్టీ శ్రేణులకు అధిష్టానం వివరణ ఇచ్చుకుని సముదాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ సారికి చక్రం తిప్పి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు వేసినా.. బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైనా రాజ్యసభకు పంపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి సాయిరెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందో?
తెలుగుదేశంకి విజయసాయిరెడ్డి టెన్షన్.. బీజేపీ కోటాలో రాజ్యసభకు సాయిరెడ్డి?   Publish Date: Apr 16, 2025 9:50PM

రాహుల్ వర్సెస్ రేవంత్!

ఇద్దరి మధ్య ;పెరిగింది దూరమా.. వైరమా?  తెలంగాణలో ఏమి జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలను ,గీత దాటితే వేటు తప్పదని  హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగతున్న ప్రచారం వెనక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం  దేనికి సంకేతం? ఈ అన్నిటినీ మించి, నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని  ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రశ్నార్ధకం చేస్తున్నాయని అంటున్నారు.  నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహాజమే అయితే కావచ్చు కానీ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఇవేవీ కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దీపా దాస్ మున్షీ ఉన్నత వరకు,కాంగ్రెస్ పార్టీలో‘అంతా బాగుంది’ అన్నట్లుగానే కథ నడిచింది. ఢిల్లీ, హైదరాబాద్ సంబంధాలు అన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ,దీపాదాస్ మున్షీ  స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతే  కాదు.. అసలు ఈ  మార్పు  కోసమే  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఏరి కోరి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  అయితే  అది కొంత వరకు  నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని అంటారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా.. లేకున్నా  రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రావడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం కూడా  ఇద్దరిమధ్య దూరం పెరడానికి ఒక కారణం అంటారు. నిజానికి  రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల అంతర్యం ఏమిటో ఆయన ఎందుకు అంత తరచుగా  ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ, రాహుల్, రేవంత్  మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్ధులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ అభీష్టానికి భిన్నంగా అదానీతో ఒప్పందం కుడుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు. సరే  తెర వెనక ఏమి జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. నిజానికి ఎవరూ కాదని అనడం లేదు కూడా. అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. అహ్మదాబాద్ ఎఐసీసీ సదస్సు లో రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చు కున్నారు. ఒక విధంగా సుమారు పది నిముషాలకు పైగా మెచ్చుకున్నారు. కానీ.. ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు. అలాగే.. ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యవసానంగానే  కాంగ్రెస్  పార్టీ పరిస్థితి హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు. నిజానికి మంత్రి వర్గ విస్తరణ అనే తేనె తుట్టెను కదిలిస్తే.. ఏ మవుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. అయినా.. ఓ వంక రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయంలో  మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లను ఉన్నపళంగా ఢిల్లీకి వచ్చేయమని అధిష్టానం ఆదేశించింది. ఆ రాత్రి ఏమి జరిగిందో కానీ.. మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్  సిగ్నల్  అనే వార్త వచ్చింది. అంతే కాదు.. కొత్తగా కొలువు తీరే మంత్రుల పేర్లు, ముహూర్తాలు కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ముహూర్తాలు వచ్చి పోయాయి కానీ.. మంత్రి వర్గ విస్తరణ అయితే జరగలేదు. కానీ విస్తరణ చుట్టూ కావలసినంత రాజకీయం అయితే  జరిగింది. అసలు అంతలా ఉరుకులు పరుగులు పెడుతూ హడావిడిగా రాత్రికి రాత్రి, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా అలాంటి అవసరం వచ్చి ఉంటే.. ఆ తర్వాత అధిష్టానం ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఎందుకు మౌనంగా ఉంది పోయింది?  తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి  అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తోంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   అలాగే, కంచ గచ్చిబౌలి భూముల వివాదం విషయంలోనూ  మీనాక్షి నటరాజన్  గీత దాటి చూపించిన చొరవ తదితర పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం పైనుంచి జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు.  నిజానికి రాహుల్ గాంధీ, రేవంత్  రెడ్డి మధ్య  దూరం పెరగడం కాదు, వైరం పెరిగిందనీ ఆ   వైరం పర్యవసానంగానే కాంగ్రెస్ పరిస్థతి  హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.
రాహుల్ వర్సెస్ రేవంత్! Publish Date: Apr 16, 2025 9:29PM

రాజీవ్ యువ వికాసం..నిరుద్యోగులకు గేమ్ ఛేంజర్ : భట్టి

రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని తెలిపారు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  బ్యాంకుర్లు ముందుకు వస్తే యువత ఆర్దికంగా ఎదుగుతారని రూ.61 వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. . రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు  గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం  అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది   .సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపుపై వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వం మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. వీరి ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. అర్హుల జాబితా రూపొందించిన తర్వాత కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్‌ తుది జాబితాను రీలీజ్ చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న రుణ పత్రాలు అందజేయనున్నారు
రాజీవ్ యువ వికాసం..నిరుద్యోగులకు గేమ్ ఛేంజర్ : భట్టి Publish Date: Apr 16, 2025 6:50PM

మూడు రోజులు ఈదురుగాలులతో వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

  తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది.  కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది.  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు  హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అయితే ఈ వర్షం ఆగగానే.. మళ్లీ భనుడు భగ భమన్నాడు. నేడు సైతం హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. సాయంత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. 
మూడు రోజులు ఈదురుగాలులతో వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ Publish Date: Apr 16, 2025 5:35PM

వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు

ఎన్డీయే సర్కార్ ఆమోదించిన  వక్ఫ్ బిల్లు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి.  ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లుపై రేపు మధ్యాహ్నం మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని.. ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని.. రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు Publish Date: Apr 16, 2025 4:48PM

తదుపరి సీజేఐ బీఆర్ గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే.  ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌ ఆఫ్ ఇండియాగా బీఆర్ గవాయ్ పేరును కొలీజియం  సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే నెల అంటే మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు సీజేఐగా సేవలందించనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో గవాయ్ పదవీ విరమణ చేస్తారు.   బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.   కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పని చేయనున్నారు.
తదుపరి సీజేఐ బీఆర్ గవాయ్ Publish Date: Apr 16, 2025 4:33PM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు!

బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన టీ.ప్రభాకరరావు  తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తే.. సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు వస్తానంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కేసు దర్యాప్తునకు తాను సహకరించాలంటే తనకు అరెస్టు నుంచి రక్షఏణ కల్పించాలని సుప్రీం కోర్టుకే కండీషన్ పెట్టారాయన అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.   తాను భారత్  వచ్చి  ఫోన్ ట్యాపింగ్  కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూనే.. తనను అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలివ్వాలని ప్రభాకరరావు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు.   నిందితుడి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ఈ మేరకే తన వాదనలు వినిపించారు. ఇదే కేసులో నిందితుడైన శ్రవణ్ రావును అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విధంగానే ప్రభాకరావుకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.  ఏడాది కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, ఇండియాకు రాకుండా అక్కడే స్థిరంగా ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలూ చేశారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తనను శరణార్ధిగా గుర్తించి అమెరికాలోనే శాశ్వతంగా నివాసముండేలా చూడాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుకున్నాడు.  క్యాన్సర్ రోగంతో ఇబ్బందిపడుతున్నందున చికిత్స చేయించుకునేంతవరకు తనను అమెరికా నుండి పంపవద్దనీ కోరారు. ఇలా అమెరికాలోనే ఉండిపోయేందుకు ఆయన చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావు అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.  ఇండియా ఆయన పాస్ పోర్టు రద్దు చేసింది. అన్నిటికీ మించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయనలో ఖంగారు మొదలైంది. ఏ క్షణంలోనైనా అమెరికా నుంచి తాను బలవంతంగా పంపబడటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన ప్రభాకరరావు,  తనను అరెస్టుచేయకుండా ఆదేశాలిస్తే ఇండియాకు వచ్చేస్తానని సుప్రింకోర్టుకే కండీషన్ పెట్టారు.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులను గమనించిన ఆయన అమెరికా తనను బలవంతంగా  ఇండియాకు పంపడంకంటే ముందే తనంత తానానుగానే భారత్ కు వచ్చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు ముందు బిల్డన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  అంతే కాకుండా కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు విచారణకు సహకరించాలంటే అరెస్టు చేయకూడదంటూ తాను పెడుతున్న కండీషన్ ను అంగీకరించాలని ఏకంగా సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.
 ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు! Publish Date: Apr 16, 2025 4:16PM

హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు

. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల  భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఊపయోగించి జింకలు, నెమళ్లు దీనస్ధితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన తప్పుడు ఫోటోను ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ షేర్ చేసినందున  తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు చేశారు. అయితే ఈ నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 
హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు Publish Date: Apr 16, 2025 4:14PM

గోశాలలో కామ్రేడ్ నారాయణ

ఇటీవలి కాలంలో వార్తలలో నిలిచిన ఎస్వీ గోశాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం (ఏప్రిల్ 16) పరిశీలించారు. తిరుమల తిరుపతి  దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాలలో నెలల వ్యవధిలో వందల గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను టీటీడీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు అయితే వాస్తవానికి గోవుల దాణా బొక్కేసింది కరుణాకరరెడ్డి హయాంలోనే అని ప్రత్యారోపణలు కూడా చేశారు. కరుణాకరరెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అవకతవకలన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఆలా టీటీడీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించారు. గోశాలలో ఆవుల ఆరోగ్య పరిస్థితులు, వాటికి అందుతున్న దాణా తదితర అంశాలను నిశితంగా పరిశీలిం చారు. అనంతరం టీటీడీ ఎస్వీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఇసుమంతైనా లేదని చెప్పారు. గోవులకు దాణా కొరత లేదనీ, నిత్యం గోవుల ఆరోగ్యాన్ని పశువైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని నారాయణ చెప్పారు. గోశాలలో గోవులన్నీ పుష్ఠిగా ఉన్నాయన్న ఆయన  టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయనీ, ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణం అన్నారు.. కమిషన్ల కక్కుర్తితో హరినాథరెడ్డి గోవులను విక్రయించారని నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పుడు గోశాల నిర్వహణ బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించారు. గోశాలను తన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం సరి కాదని నారాయణ అన్నారు. అసత్య, అవాస్తవ ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని నారాయణ అన్నారు. ఇక తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిం చడాన్ని నారాయణ స్వాగతించారు. అలాగే శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచినందుకు టీటీడీపై ప్రశంసల వర్షం కురిపించారు.  
గోశాలలో కామ్రేడ్ నారాయణ Publish Date: Apr 16, 2025 3:44PM

తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా?

  టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సాగరిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. "ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అని ఆమె రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచ‌డం చూడొచ్చు. తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌హీర్ ఖాన్ దంప‌తుల‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  కాగా, 2016లో తోటి క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్క‌ట‌య్యారు. కొడుకును కూడా నీలాగే చాంపియన్‌ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్.. యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా? Publish Date: Apr 16, 2025 3:16PM

కంచ గచ్చిబౌలి భుములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్ 

కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మరోసారి షాకిచ్చింది. నేడు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం  కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణం రక్షించడం మన బాధ్యత అని  ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి మండిపడ్డారు.చెట్ల పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సీఎస్‌ను కాపాడాలనుకుంటే.. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ లాయర్ బదులిస్తూ..ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని కోర్టుకు తెలిపారు.  ప్రస్తుతం పనులు జరగడం లేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో ఉంటుందని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. ఆ భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎంత టైం పడుతుంది? జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ.. 4 వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది.   
కంచ గచ్చిబౌలి భుములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్  Publish Date: Apr 16, 2025 3:08PM

స్కూల్ పిల్లలపై విష ప్రయోగం.. ఎక్కడంటే?

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులపై  వి ప్రయోగం జరిగింది. ఇచ్చోడ మండలం ధరంపురి ఎంపీపీ స్కూల్లో విద్యార్ధులు వినియోగించే నీటిలో వంట సామాగ్రిపై గుర్తు తెలియని దుండుగులు పురుగుల మందు చల్లారు. విషప్రయోగం అనంతరం దుండుగులు పురుగుల మందు డబ్బాను అక్కడే పడేశారు. దీనిని ప్రధానోపాధ్యయుడు ముందే గుర్తించడంతో 30 మంది విద్యార్ధులకు పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్కూల్ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.శనివారం, ఆది వారం సెలవు  కావడంతో స్కూల్లోని వంట గదికి సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు.  పాత్రలను క్లీన్ చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బం ది చెప్పారు. తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగు నీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
స్కూల్ పిల్లలపై విష ప్రయోగం.. ఎక్కడంటే? Publish Date: Apr 16, 2025 2:28PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా?

ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిల మధ్య పోరా జరగనుంది. ఇప్పటికే ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి కూమార్ యాదవ్ ను కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించేశాయి. మరి ఎన్డీయే కూటమి పరిస్థితి ఏమిటి? అంటే ఇంకెవరు నితీష్ కుమారే అంటున్నారు జేడీయూ నేత  రాజీవ్ రంజన్ ప్రసాద్.  అయితే ఆ విషయంలో ఏకాభిప్రాయం ఇసుమంతైనా లేదన్న విషయం ఇటీవలి పరిణామాల ద్వారా తేటతెల్లమౌతోంది. నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకతతో బీహార్ లో ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటికే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ వైదొలగింది. ఈ సారి ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పశుపతి కుమార్ పరాస్ విస్పష్టంగా తేల్చేశారు. గత ఐదేళ్లుగా ఎన్డీయే కూటమిలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ పేరుకు బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి అంటూ వైదొలగినా.. వాస్తవ కారణం మాత్రం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వ్యతిరేకతతోనే అన్నది సుస్పష్టం.  అంతే కాకుండా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ.. చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్డీయేలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇటీవల హర్యానాలో జరిగిన ఓ కార్యక్ర మంలో ప్రసంగించిన సైనీ.. బీహార్ లో బీజేపీ విజయం తథ్యం అని అంటూనే..  బీహార్ ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్ చౌదరి నాయకత్వంలో అది సాధ్యమౌతుందని చెప్పారు. ఆయన ఈ మాట సోమవారం (ఏప్రిల్ 14)న అన్నారు. అంతే వెంటనే అప్రమత్తమైన జేడీయూ.. మంగళవారం (ఏప్రిల్ 15)న బీహార్ లో ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమారే అని ఏకపక్ష ప్రకటన చేసేసింది.  ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూటమి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎదుర్కొంటుందనీ, అటువంటప్పుడు మరో ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ప్రశక్తే  లేదని జేడీయూ అంటోంది.  మొత్తం మీద బీహార్ లో ఎన్డీయే కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న విషయం ప్రస్ఫుటంగా బయటపడింది.  
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..  కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా? Publish Date: Apr 16, 2025 2:17PM

ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి

అజ్ఞాతంలో ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్‌ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను నెలకొల్పి, కార్తికేయ-2 ఫేమ్‌ నిఖిల్‌ సిద్ధార్థ్‌  హీరోగా  స్పై అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మించారు.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్‌ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్‌ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్‌లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యం వెనకున్న రహస్యాన్ని స్పృశిస్తూ, ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు ఉప్పలపాటి చరణ్‌తేజ్‌ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈవోగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకూ అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్య కాలంలో మిడ్‌ రేంజ్, కొత్త హీరోలతో హిట్‌ సినిమాలు తీసిన నలుగురైదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్లు సమాచారం.  ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం, ఏపీలో జగన్‌ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో.. ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రాజ్ కసిరెడ్డి.   స్పై సినిమాను ఎంత బడ్జెట్‌లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత?  తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్‌ సేకరించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి పైప్‌లైన్‌లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు? ఇందుకు మనీ రూటింగ్‌ ఎలా చేశారు? అనే దానిపై సిట్‌ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను నెలకొల్పిన రాజ్‌ కసిరెడ్డి.. ఆ వెంటనే  స్పై చిత్రం నిర్మాణం చేపట్టారు. దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రిజిస్టర్‌ చిరునామా అయిన హైదరాబాద్‌ మణికొండ ప్రశాంతి హిల్స్‌లోని ప్లాట్లలో తనిఖీలు జరిపాయి. అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి. ఇదే చిరునామాలో రీసోర్స్‌ వన్‌ ఐటీ సొల్యూషన్స్‌ అనే ఐటీ కంపెనీ ఉంది. దీనికి రాజ్‌ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయా అన్నదానిపై కూడా సిట్‌ బృందాలు ఆరా తీస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి Publish Date: Apr 16, 2025 12:43PM

అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి ట్రంప్‌ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటివారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు దృష్టిసారించారన్నారు. అయితే, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలా వెళ్లాలనుకునేవారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం పైనా ట్రంప్‌ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా స్పష్టంచేశారు. అయితే.. సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్ట్స్‌కు  రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం వెళ్లాలనేకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. తమ దేశాలకు వెళ్లే క్రమంలో చార్జీలను భరించలేకపోతే.. సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు.
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ Publish Date: Apr 16, 2025 11:09AM

సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా?

  రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు.    సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటిం చనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట   మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఉంటుంది.   ఈ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభివృద్ధిపై జపాన్ పర్యటనలో రేవంత్ బృందం అధ్యయనం చేయనుంది.  అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతికతను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పారిశ్రామికవేత్తలను, సంస్థలను ఆహ్వానించనున్నారు.  
సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా? Publish Date: Apr 16, 2025 11:02AM

లిక్కర్ స్కాం.. రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు.  లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న   సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు. ఇదే మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసుల విచారణకు  హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.  హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సిట్ బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయంలో అందుకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తానని కూడా విజయసాయిరెడ్డి అప్పట్లోనే చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని సిట్ బృందం భావిస్తోంది.  
లిక్కర్ స్కాం..  రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి Publish Date: Apr 16, 2025 10:47AM

పవన్ కల్యాణ్ కు ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా  ఆయన   తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడానికి బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని  సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఒక్క  ఉపముఖ్యమంత్రే కాదు. ఆయన అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కూడా. కీలక శాఖల మంత్రిగా ఆయన తరచూ విస్తృత పర్యటనలు చేయడంతో ఆయన వెన్నునొప్పి తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పవన్  కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్న సమ యంలో సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయ పడ్డాడు. దీంతో ఆయన అడవితల్లి బాట కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ బయ లు దేరి వెళ్లారు. ఆ తరువాత  తన కుమారుడు మార్క్ శంకర్ ను ఎత్తుకుని విమానాశ్రయంలో కనిపించారు. అదే చివరి సారి ఆయన బహిరంగంగా కనిపించడం. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించి, కుమారుడి పేరుమీద అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకు కారణం కూడా ఆయన బ్యాక్ పెయినే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా రాకపోవడంతో వెన్ననొప్ప తీవ్రంగా ఉందని భావించాల్సి వస్తున్నది.   
పవన్ కల్యాణ్ కు ఏమైంది? Publish Date: Apr 16, 2025 10:23AM

ఏపిలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్

 విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంలో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 15) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల, 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు  తుది గడువు మే 2. పోలింగ్ మే  9న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.   కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం లాంఛనమే. అయితే కూటమి పార్టీలలో ఏ పార్టీ ఈ ఎన్నికలో పోటీకి నిలబడు తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ  అయిన రాజ్యసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడంతో  రాజ్యసభ ఉప ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థి ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది.  
ఏపిలో  రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్  Publish Date: Apr 16, 2025 10:02AM

ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..!

  గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తే ఆడవాళ్లు వంటింటి కుందేళ్ల స్థానం నుండి మల్టీ టాస్కర్లు గా ఎదిగారు.  ఇంటి పని,  వంటి పని, ఉద్యోగంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చూసుకుంటున్నారు. అయినా సరే పెళ్లి తర్వాత ఆడవాళ్ల పాత్ర చాలా వరకు తగ్గించాలని చూస్తారు మగవారు. ఇంటి విషయాలలో మగవారు తమ మాటే నెగ్గాలని అనుకుంటూ ఆడవారి మాటను లెక్కచేయరు. కానీ మహిళల గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను అధ్యయనాలు బయటపెట్టాయి. ఆడవారికి ఏమీ తెలియదు.. వారికి ఏమీ చెప్పక్కర్లేదు అనుకోవడం మాత్రమే కాదు.. ఆడవారి మాట వినకుండా విస్మిరించే మగవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఒక అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం.. మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందట.  మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని,  తప్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే పురుషులు స్త్రీల మాట వినాలని అంటారు. మహిళల విషయానికి వస్తే.. మహిళలు  చాలా కోణాలను   పరిగణలోకి తీసుకుంటారు, సహకారాన్ని ఇష్టపడతారు . మహిళల ఆలోచనలు  పురుషుల కంటే సమతుల్య దృక్పథాన్ని అందిస్తాయి, ఇది ఎక్కువ  విజయావకాశాలకు దారితీస్తుంది. వారి ఆలోచనా విధానం పురుషుల ఆలోచనా విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారు అంచనా వేయగలరు. పురుషులు ఇంట్లో,  కార్యాలయంలో మరింత సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంట్లో,  కార్యాలయంలో మహిళల దృక్పథం  ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. తన సలహా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విజయమే కాకుండా, మానసిక ఆరోగ్యం,  ఇరువురి మధ్య  ఆనందం కూడా మెరుగవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే వారి ముందు భార్యాభర్తలు  ఒక జట్టులా ఉంటారు. తరచుగా పిల్లల ముందు పురుషులు తమ భార్యలను తిడతారు.  ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. అయితే  సమస్యలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి.  భార్య గృహిణి అయినప్పటికీ, ఆర్థిక నిర్ణయాల కోసం  ఎల్లప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లాలి. అది పొదుపు అయినా లేదా పెట్టుబడుల గురించి అయినా. ఆమె దాని సాంకేతిక అంశాలలోకి వెళ్ళలేకపోయినా, దానిని ఎలా చేయాలో,  మీరిద్దరూ కుటుంబంగా ప్రతి నెలా ఎంత ఆదా చేయాలో ఆమె మీకు చెప్పగలదు. పిల్లల ముందు ఒక జట్టుగా ఉండాలంటే, అది కిరాణా సామాను కొనడం లాంటి చిన్నదైనా లేదా కారు కొనడం లాంటి పెద్దదైనా  కలిసి మాట్లాడుకోవాలి.  ప్రతిదానిపైనా ఆమె అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. దీని వలన    జీవితంలోని ప్రతి అంశంలోనూ తాను కూడా ఉన్నానని భార్య భావిస్తుంది. ఇది ఆడవారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం.                                            *రూపశ్రీ.
ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..! Publish Date: Apr 16, 2025 9:30AM

నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..!

  శరీరం,  మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర  బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు  అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు.  తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది  మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు.  కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని  చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.  నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు.  దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట.  6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..! Publish Date: Apr 16, 2025 9:30AM

ఆంధ్ర నవయుగ వైతాళికుడు.. 

  కందుకూరి విరేశలింగం అనగానే అందరికీ ఉద్యమ స్పూర్తి గుర్తుకు వస్తుంది.  స్త్రీల కోసం పాటు పడిన సంఘసంస్కర్తలలో కందుకూరి విరేశలింగం తెలుగు ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.  ఈయనను నవయుగ వైతాళికుడు అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కందుకూరి విరేశలింగం ను రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది.  ఏప్రిల్ 16, 1848లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన జయంతి సందర్బంగా ఆయన గూర్చి తెలుసుకుంటే.. కందుకూరి విరేశలింగం గూర్చి.. వీరేశలింగం ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన కేవలం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  తండ్రి మరణించాడు. దీంతో ఈయన  తన మామ వద్ద పెరిగాడు. విరేశలింగం గారి  విద్యా నైపుణ్యం,  స్నేహపూర్వక స్వభావం  పాఠశాల రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత, ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. వీరేశలింగం తెలుగు, సంస్కృతం,  ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తెలుగులో మొదటి నవలను రచించారు,  తెలుగు సాహిత్యానికి ఆత్మకథ,  వ్యాస ప్రక్రియలను పరిచయం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంపై మొదటి తెలుగు పుస్తకాన్ని కూడా రాశారు.  అనేక ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. తెలుగు సమాజ సంస్కరణకు ఆయన చేసిన గణనీయమైన కృషి ఎంతో గౌరవనీయమైనది. అయితే రాజా రామ్ మోహన్ రాయ్,  కేశుబ్ చంద్ర సేన్ వంటి సామాజిక సంస్కర్తలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెలుపల ఆయన కీర్తి పరిమితం. ఆయన మహిళల హక్కులకు చాలా మద్దతు ఇచ్చారు.  మహిళల హక్కుల గురించి చాలా  విస్తృత రచనలు చేశారు. బాల్య వివాహాలను,  యువతులను వృద్దులతో  వివాహం చేసే ఆచారాన్ని ఆయన ఖండించారు. వితంతు పునర్వివాహాన్ని కూడా ఆయన సమర్థించారు. విరేశలింగం గారి  రాడికల్ ఆలోచనలు,  పదునైన విమర్శలు అతన్ని చాలా మంది విమర్శకులకు,  ప్రజల ఎగతాళికి గురి చేశాయి. స్త్రీలను ఎల్లప్పుడూ ద్వితీయ పౌరులుగా పరిగణించరని వాదించడానికి ఆయన పురాతన గ్రంథాలను ఉపయోగించారు. రామాయణంలో, శ్రీరాముడు ఎల్లప్పుడూ సీతతో సభలో ఎలా ఉండేవాడో ఆయన నొక్కి చెప్పారు.   మహిళల పరిస్థితి దిగజారినప్పుడు భారతదేశం యొక్క క్షీణత ప్రారంభమైందని ఆయన నమ్మాడు. ఆయన బాలికలు,  మహిళల కోసం పాఠశాలలను స్థాపించాడు.  డిసెంబర్ 11, 1881న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు.  ఇది సంప్రదాయవాద సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సమాజం ఎంతగానో అవమానించినా, ఆయన తన జీవితకాలంలో దాదాపు 40 మంది వితంతువులకు పునర్వివాహం చేయించాడు. మహిళల హక్కులు,  విద్యను ప్రోత్సహించడానికి ఆయన వివిధ పత్రికలు,  జర్నల్స్‌ను ప్రచురించారు.  1887లో రాజమండ్రిలో బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి హాజరైన వారిలో వీరేశలింగం మొదటి వ్యక్తి.  1893లో భారత ప్రభుత్వం ఆయనను 'రావు బహదూర్' బిరుదుతో సత్కరించింది. ఆయన మే 27, 1919న 71 సంవత్సరాల వయసులో మరణించారు.                                               *రూపశ్రీ.
ఆంధ్ర నవయుగ వైతాళికుడు..  Publish Date: Apr 16, 2025 9:30AM

అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం.. 

  కళలకు భారతదేశం పెట్టింది పేరు.  ఇప్పుడు సినిమా హాళ్లలో సినిమాలు ఇంతగా వస్తున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వీధులలో నాటకాల రూపంలో వివిధ కథలు, చారిత్రాత్మక సంఘటనలను ప్రదర్శించేవారు. ఇలా పుట్టిందే నాటక రంగం. రాత్రి సమయాల్లో లాంతర్లు,  దివిటీలు పెట్టి నాటకాలను ప్రదర్శించేవారు.  పగలంతా కష్టం చేసిన ఆనాటి ప్రజలకు రాత్రయ్యే సరికి ఇదొక మంచి వినోదంగా ఉండేది. ఈ కోవలో హరికథలు,  బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివి ఎన్నో ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమ ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైనది మాత్రం నాటక రంగమే..  ప్రతి ఏడాది ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటారు.  అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం అనేది ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం సందర్బంగా  జరుపుకుంటారు.  తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఎలా మారింది?   తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి మార్గదర్శకుడు (రచయిత). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన నాటకాలు, నవలలు,  సామాజిక వ్యంగ్య రచనలు రాశారు. ఇవి తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అన్నింటికంటే మించి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన తన రచనల ద్వారా జాతి వివక్ష,  అనేక ఇతర సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలో అరుదుగా ఉండే వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు.  మొదటి తెలుగు నాటకం కందుకూరి రాసిన వ్యవహార ధర్మ బోధని మొదటిసారిగా ప్రదర్శించబడింది. 2007లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పుట్టినరోజును 'తెలుగు నాటకరంగ దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రకటించింది. అప్పటి నుండి నాటక కార్యకర్తలు ఏప్రిల్ 16ని తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కందుకూరి విరేశలింగం పంతులు గారు ఆధునిక నాటక ప్రదర్శనకు రూపం ఇచ్చిన వారిలో ఒకరు. విరేశలింగం పంతులు గారు డైలాగ్స్ రూపంలో బ్రాహ్మ వివాహము అనే నాటకాన్ని హాస్య సంజీవని అనే పత్రికలో రచించారు.  ఆ తరువాత వ్యవహార ధర్మభోధిని  అనే నాటకాన్ని ప్రకటించారు. ఆనాటి గ్రాంథిక భాష కాలంలో వ్యవహారిక బాషలో ఒక నాటకాన్ని సాగించడం పెద్ద సాహసమనే చెప్పాలి.  వేదిక మీద ప్రదర్శించిన తొలి నాటకం ఇది. తెలుగు రాష్ట్రంలో  తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కందుకూరి విరేశలింగం పంతులు గారిదే. ఈ కారణంగానే కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.                                 *రూపశ్రీ.  
అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం..  Publish Date: Apr 16, 2025 9:30AM

చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు

16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది. కానీ మంగళవారం ( ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఈ మ్యాచ్ లో బంతిదే ఆధిపత్యం. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఫలితంగా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా రాణించాడు. మూడు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా కేవలం పాతిక పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అనిరిచ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30 పరుగులు, ప్రియాన్స్ ఆర్యా 22 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా ముందు 112 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంది. అందరూ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం లాంఛనమే అని భావించారు. అయితే పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తల్ల కిందులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ ను వంద పరుగులలోపే కట్టడి చేశారు. ఐపీఎల్ చరిత్రలోఇంత తక్కువ స్కోరును కాపాడుకుని గెలవడం ఇదే ప్రథమం. ఆ విషయంలో పంజాబ్ కొత్త రికార్డు సృష్టించింది. ఇక పంజాబ్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ మాయ చేశాడు. తన స్పిన్ మాయా జాలంతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్ 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహల్ తను వేసిన చివరి ఓవర్లో రస్సెల్ రెండు సిక్స్ లు ఓ ఫోర్ బాదడంతో ఆ దశలో కోల్ కతాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే జాన్సన ఆ ఆశలను చిదిమేశాడు. 3.1 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యి 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్ ను వరించింది. 
చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు Publish Date: Apr 15, 2025 12:37AM

టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ

జానా X రాజగోపాల్... ప్రేమ్‌సాగర్ X వివేక్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నదట. అలాంటి వారి జాబితాలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేరారు.  ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్‌సాగర్‌రావ్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో  అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా  ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? కష్టకాలంలో పదేళ్ళు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్ లో ఉన్నారని, కష్ట కాలంలో పార్టీ తో ఉన్న తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టినట్లు అయ్యిదంట. పార్టీ కోసం పని చేసిన ప్రేమ్‌సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు, మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్‌విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్‌రావ్‌కి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పోతుందోనని  కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందంట. జిల్లా నుంచి ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు కేబినెట్‌ బెర్త్ ఖరారైందన్న  ఉహగానాల నేపథ్యంలో ప్రేమ్‌సాగర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. వివేక్‌ టార్గెట్‌ గానే ప్రేమ్‌ సాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు.  ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని ...ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్‌లను దృష్టిలో ఉంచుకుని వివేక్‌కు ఈసారి కేబినెట్ బెర్త్‌ ఖాయం అనే ప్రచారం జరగుతోంది. ఈ సందర్భంలో వివేక్‌ టార్గెట్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్‌ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.
టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ Publish Date: Apr 15, 2025 11:37PM