మావోయిస్టు అగ్రనేతను కాటేసిన కరోనా! హరిభూషన్ అలియాస్ జగన్ పోరాట చరిత్ర ఇది.....
posted on Jun 23, 2021 8:37PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మావోయిస్టులకు గండంగా మారింది. అడవుల్లో ఉండే మావోయిస్టులు వైరస్ భారీన పడ్డారని సమాచారం. చాలా మంది మావోయిస్తులకు కరోనా సోకిందని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు నిజం కాదని.. కొన్ని లేఖలు విడుదలైనా.. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే మాత్రం మావోయిస్టులను కరోనా కాటేస్తుందని తెలుస్తోంది. తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్ అలియాస్ లక్మూ అలియాస్ ధర్మన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. 56 ఏళ్ల జగన్.. ఛత్తీసగఢ్ బస్తర్ జిల్లా అడవుల్లో సోమవారం రాత్రి ఆయన చనిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు. హరిభూషణ్ కొవిడ్ బారిన పడి, గుండెపోటుతో మృతి చెందారని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కూడా హరిభూషన్ అలియాస్ జగన్ మృతిని ధృవీకరించారు.
అయితే హరిభూషణ్ మృతిపై మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు ఛత్తీసగఢ్ సుక్మా జిల్లా మీనగుట్ట అటవీ ప్రాంతంలో విషతుల్యమైన ఆహారం తినడం వల్ల మృతి చెందారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ మృతిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు దయాకర్, ఐతు, ప్రకాశన్న లాంటి వారు కరోనాతో చనిపోయిన క్రమంలో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మావోయిస్టులు, తాజాగా జగన్ విషయంలో మౌనం వహించడంపై సస్పెన్స్ నెలకొంది. అయితే హరిభూషణ్ మృతి చెందినట్లుగా తమవద్ద విశ్వసనీయమైన సమాచారం ఉన్నట్లు మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షించే వర్గాలు చెబుతున్నాయి.
మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన హరిభూషణ్ది ఆదివాసీ గిరిజన కుటుంబం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం ఆయన స్వగ్రామం. ఆయన అసలు పేరు యాప నారాయణ. కొమ్మక్క-రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడు. నర్సంపేట సమీపంలోని సాయిరెడ్డిపల్లిలో పదో తరగతి వరకు చదివారు. నర్సంపేటలో ఇంటర్ చేశారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే రాడికల్ విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశారు. మడగూడెం, నర్సంపేట, పాకలకొత్తగూడెం ఏరియాల్లో పీపుల్స్వార్, న్యూడెమోక్రసీల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న దశలో 1984లో హరిభూషణ్ పీపుల్స్వార్ దళంలో చేరారు. హరిభూషణ్ భార్య సమ్మక్క, అలియాస్ శారదక్క ప్రస్తుతం మావోయిస్టు బస్తర్ ప్రాంత నేతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాతంలో ఉన్నప్పుడే సమ్మక్కను హరిభూషణ్ వివాహం చేసుకున్నారు.
మావోయిస్టుగా హరిభూషణ్ది 37 ఏళ్ల ప్రస్థానం. గోదావరి లోయలో ఛత్తీసగఢ్, బస్తర్ ఏరియాల్లో పోలీసులకు ఆయన కొరకరాని కొయ్యగా మారారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ కమిటీలో, ఉత్తర తెలంగాణ స్పెషల్జోనల్ కమిటీ లో మిలటరీ ప్లాటోన్ తెలంగాణ యాక్షన్ కమిటీ క మాండర్గా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయం లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేసిన హరిభూషణ్ తదుపరి కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ, ఛత్తీసగఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు జగన్. ఆయన తలపై 40లక్షల రివార్డు ఉంది.
మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చల సమయం లో హరిభూషణ్ ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లా ల్లో పీపుల్స్వార్ విస్తరణ కోసం విస్తృతంగా పనిచేశారు. హరిభూషణ్ స్వయంగా ఇల్లెందు, కొత్తగూడెం, ములుగు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో సంచరించి దళాల్లో నియామకాలు పెంచారు. పీపుల్స్వార్ టార్గెట్లు పూర్తి చేయడంలో, యాక్షన్లు జరపడంలో దిట్టగా పేరుగాంచిన హరిభూషణ్ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందితే ప్రత్యర్థులు హడలిపోయేవారు. హరిభూషణ్ బాల్యంలో మంచి కబడ్డీ క్రీడాకారుడు అని నర్సంపేట ప్రాంతంలో గుర్తింపు ఉంది. జగన్ పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో గట్టి పట్టు కలిగిన హరిభూషణ్ ఛత్తీసగఢ్లో పలు విధ్వంసాలకు వ్యూహకర్త అని, తెలంగాణలో అనేక సంచనల హింసాత్మక ఘటనలకు కారణంగా చెబుతుంటారు.