Latest News

తెలంగాణలో బీజేపీ మిషన్‌ ప్రారంభం... 60+10పైనే గురి

posted on: May 16, 2017 10:44AM


 

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలనైతే అనుసరించారో... అలాంటి స్ట్రాటజీనే తెలంగాణలోనూ ఇంప్లిమెంట్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒక టార్గెట్‌ను విధించుకుని... పక్కా ప్లాన్‌తో సీరియస్‌గా సీన్‌లోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పదికిపైగా ఎంపీ సీట్లు, అరవైకి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా మిషన్‌-2019ని సిద్ధంచేసింది. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు అధినాయకత్వం ఆదేశించింది. ముఖ్యంగా బూత్‌ కమిటీల స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేసింది.

 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో జూన్‌ తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఫార్ములాను అమలు చేయనుంది. ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని భావిస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది.

 

అధికార టీఆర్‌ఎస్‌కు కింది స్థాయి వరకు కేడర్‌ లేకపోవడం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియా శీలకంగా వ్యవహరించకపోవడం, టీడీపీ పూర్తిగా బలహీన పడటం, వామపక్షాలు సత్తాచాటలేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...