బోండా ఉమాపై మరోసారి హత్యాయత్నం.. వైసీపీ మూకల అరాచకం..
posted on Jan 21, 2022 4:34PM
కనిపిస్తే దాడులు.. కుదిరితే కేసులు.. వీలైతే హత్యలు.. ఏపీలో వైసీపీ మూకల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఇటీవల పల్నాడులో చంద్రయ్యను వైసీపీ నాయకులు నడిరోడ్డుపై దారుణంగా చంపేస్తే.. తాజాగా గుడివాడలో టీడీపీ నేత బోండా ఉమాపై మరోసారి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గుడివాడలో గోవా కల్చర్ తీసుకొచ్చి.. కె కన్వెన్షన్లో గబ్బు గబ్బు చేసిన ఘటనపై.. టీడీపీ నిజనిర్థారణ కమిటీ కొడాలి నాని ఇలాఖాలో అడుగుపెట్టింది. టీడీపీ నాయకుల రాకన తట్టుకోలేని.. వైసీపీ మూకలు వారిపై దాడులకు తెగబడ్డారు.
రాళ్లతో బోండా ఉమాపై దాడికి ప్రయత్నించారు. ఆ దాడిలో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. పెద్ద సంఖ్యలో పోగైన వైసీపీ శ్రేణుల దాడి నుంచి పోలీసుల రక్షణలో బోండా ఉమా అదృష్టవశాత్తు బయటపడ్డారు.
బోండా ఉమాపై దాడి ఇదే మొదటిసారి కాదు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ మాచర్లలో ఇలానే జరిగింది. బోండా ఉమా, బుద్దా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారును.. వైసీపీ రౌడీలు కొన్ని కిలోమీటర్ల పాటు వెంబడించి దాడి చేశారు. తురక కిశోర్ అనే వైసీపీ లీడర్ పెద్ద కర్రతో.. బోండా ఉమాపై దాడి చేశాడు. కారు అద్దాలు పగలగొట్టి.. కారు లోపల ఉన్న ఉమాను ఆ కర్రతో కొట్టాడు. కానీ, తృటిలో తప్పించుకుని.. కారును వేగంగా నడిపి.. ఆ హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా, వదలకుండా బోండా ఉమా కారును వైసీపీ వర్గాలు వెంబడించగా.. స్థానిక పోలీసులు తమ వాహనంలో బోండా ఉమా, బుద్దా వెంకన్నలను సురక్షితంగా విజయవాడ తరలించారు. ఆనాడు బోండా ఉమాను చంపాలని చూసిన తురక కిశోర్కు ఆ తర్వాత మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ఘనత వైసీపీది. రౌడీలకు ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం ఉంటుందనే దానికి ఆ ఘటనే నిదర్శనం.
అప్పటి నుంచీ బోండా ఉమాను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు వైసీపీ నాయకులు. తాజాగా, ఆయన గుడివాడ వస్తున్నారని తెలిసి మరోసారి కాపు కాసినట్టున్నారు. ఈసారి బోండా ఉమా కారుపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది.. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగుండేదని అంటున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ వర్గీయుల చేతిలో 33 మంది టీడీపీ నాయకులు హత్యకు గురయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఇక కేసుల సంఖ్య అయితే లెక్కేలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తల వరకు.. అనేక వందల మందిని ఏదో ఒక కేసులో ఇరికించింది వైసీపీ ప్రభుత్వం. అయినా ఆగకుండా.. చంద్రబాబు ఇంటిపై ముట్టడి.. మంగళగిరి పార్టీ ఆఫీసు ధ్వంసం.. లాంటి విధ్వంసకాండ కొనసాగిస్తూనే ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం.. కడప ఫ్యాక్షన్ అంటూ టీడీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. డీజీపీ కొమ్ము కాస్తున్నారంటూ ఎంతగా ఆరోపిస్తున్నా.. ఏపీలో వైసీపీ మూకల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.
వీడియో లింక్-- https://www.youtube.com/watch?v=QYtMoy5YxNw&t=3s