సీఎం ఇంటి సమీపంలోనే ఘోరమా! ఏపీలో మహిళకు రక్షణే లేదా?

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన  లేఖలో నిలదీశారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశం సీఎం నివాసానికి దగ్గర లోనే ఉందని, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా మూడు కిలోమీటర్లు దూరంలో ఉందన్న చంద్రబాబు.. ఈ ఘటనను పరిశీలిస్తూ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.  రాష్ట్రంలో అసలు దిశ యాక్ట్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని డీజీపీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల కు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. పెట్రోలింగ్, గట్టి నిఘా లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా నది ఒడ్డున, పుష్కర ఘాట్‌ల వద్ద గంజాయి, మద్యం సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం అవకుండా మహిళలకు రక్షణ కల్పించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు.

మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌లతో ఉపయోగం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న ఎందుకు చర్యలు చేపట్టడం లేదని  చంద్రబాబు నిలదీశారు.  

ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేరస్తులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలన్నారు.గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగడం విచారకరమన్నారు.  ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ లన్నీ మోసపూరితంగా మారయన్నారు. వైసీపీ రంగులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చినట్లుందని చంద్రబాబు లేఖలో తెలిపారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు.