విలువల విషయంలో ముగ్గురూ ముగ్గురే!

posted on: Mar 21, 2026 3:37PM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు.  ఈ ముగ్గురి మధ్య బంధం, అనుబంధం ఎంత బలంగా ఉందో.. రాజకీయాలలోనూ, వ్యక్తిగత విషయాలలోనూ, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలోనూ, నైతిక వర్తనలోనూ ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా ఉంటారు. వీరి రుజువర్తనకూ, హాస్య చతురతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అరుదైన సంఘటన ఇటీవల దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా ఈ ముగ్గురిపై నెటిజనుల ప్రశంసల పూల జల్లు కురవడానికి కారణమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అదెప్పుడంటే.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభోత్సవం సందర్భంగా. ఈ ముగ్గురూ కలిసి దివ్యాంగ శక్తి పథకం లబ్ధి దారులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.  

మంగళగిరిలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు  పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లతో కలిసి దివ్యాంగులకు ధైర్యం నింపే విధంగా వారితో పాటు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగానే  బస్సులో వీరిరువురి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో బస్సులో కూర్చున్న చంద్రబాబు వెనుక వస్తున్న పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. ఈ బస్సులో  దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణం.. మీరు టికెట్ తీసుకోవలసిందే అని గట్టిగా చెప్పారు. ఇందుకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో బిగ్గరగా నవ్వారు. ఆ వెనుకే ఉన్న లోకేష్ మాత్రం చంద్రబాబుతో అంతే సరదాగా మనమందరం ఎమ్మెల్యేలం కదా.. కనుక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అర్హులమే  అని బదులిచ్చారు.

అయితే తాము తమ గుర్తింపు కార్డులను వెంట తేచ్చుకోలేదని చెబుతూ.. తనకూ, పవన్ కల్యాణ్ కూ చంద్రబాబుకు టికెట్ తీసుకున్నారు.తాము తీసుకున్న టికెట్ ముగ్గురి కోసమేనని మరోసారి కండక్టర్ వద్ద నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ముగ్గురు నేతల మధ్యా ఆత్మీయ బంధానికి ప్రతీకగా ఉండటమే కాకుండా విలువలకు వారిచ్చే ప్రాధాన్యతను కూడా ఎత్తి చూపింది. ఈ వీడియో తెలుగుదేశం, జనసేన పార్టీలలో జోష్ నింపుతోంది. కూటమి పార్టీల మధ్యా చీలిక వస్తుందని  ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాశలేనని విస్పష్టంగా తేల్చేసింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...